వరంగల్ అర్బన్ : నవమాసాలు మోసి పెంచి పెద్ద చేసిన ఆ తల్లి వారికి భారమైంది. ముదిమి వయసులో వారి ఆలనా పాలనా చూడాల్సిన కొడుకులు కర్కషంగా తల్లిని గాలికొదిలేశారు. పని చేసే ఓపిక లేక ఆ తల్లి ఆకలితో అలమటించింది. ఇక చేసేది లేక న్యాయం కోసం పోలీస్ స్టేషన్ను ఆశ్రయించింది. వారి దీనగాథను విన్న ఎస్ఐ మానవీయంగా స్పందించారు. కడుపు నిండా తిండి పెట్టి న్యాయం చేస్తానని హామీనిచ్చారు.
వివరాల్లోకి వెళ్తే.. కమలాపూర్ మండలం గుండేడు గ్రామానికి చెందిన మేకల పోచమ్మ (70) తన భర్త సంవత్సరన్నర క్రితం చనిపోయాడు. కాగా, పోచమ్మకు ఇద్దరు కొడుకులు మేకల రాజయ్య, మేకల సదయ్య, కూతరు గట్టమ్మ ఉన్నారు. తండ్రి చనిపోయినప్పటి నుంచి తల్లి బాగోగులు చూసుకోవడం లేదు. కనీసం తిండి కూడా పెట్టకుండా తల్లిని వదిలేశారు.
దీంతో పోచమ్మ తన మీదే ఆధారపడి ఉన్న ఇంకా పెండ్లి కాని తన కూతురు మేకల గట్టమ్మ (45) ఇద్దరు కలిసి న్యాయం కోసం పోలీస్ స్టేషన్కు వెళ్లారు. కాగా, కమలాపూర్ ఇన్స్పెక్టర్ పి. కిషన్ వారి బాధ తెలుసుకొని చలించిపోయారు. ఆకలితో ఉన్న వారిద్దరికి భోజనం పెట్టి ఆకలి తీర్చారు. మానవీయంగా స్పందించి ఆదరించిన ఎస్ఐని పలువురు అభినందించారు.