నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ దవాఖాన కార్పొరేట్ స్థాయి వైద్య సేవలకు కేరాఫ్ అడ్రస్గా నిలుస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేయడం.. సిబ్బంది సమష్టి కృషితో రాష్ట్రంలో అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్న దవాఖానగా నిలుస్తున్నది. ప్రైవేటులో సైతం చేయలేని క్లిష్టమైన, లక్షలు ఖర్చయ్యే అరుదైన ఆపరేషన్లను ఉచితంగా చేస్తూ అందరి మన్ననలు పొందుతున్నది. అత్యుత్తమ సేవలు అందుతుండడంతో పేషెంట్లు బారులు తీరుతున్నారు. ప్రసవాల్లోనూ ప్రభుత్వ దవాఖాన ముందు వరుసలో నిలుస్తున్నది.
ఖలీల్వాడి, మార్చి 20 : తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రభుత్వ దవాఖానల దశదిశ మారిపోయింది. ‘నేను రాను బిడ్డో.. సర్కార్ దవాఖానకు’ అనే పరిస్థితి నుంచి సర్కారు దవాఖానకే పోదాం అనే విధంగా నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ దవాఖాన తయారైంది. కోట్లు ఖర్చు పెట్టి నిరుపేద ప్రజలకు అండగా నిలిచే విధంగా ప్రభుత్వ దవాఖానలను రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీర్చిదిద్దారు. ఇందులో నిజామాబాద్ దవాఖాన ఏడు అంతస్తులతో కార్పొరేట్ దవాఖానలకు దీటుగా తయారైంది. ఎమ్మెల్సీ కవిత, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చొరవతో కోట్లు ఖర్చుచేసి మెరుగైన వైద్య సేవలు అందించే విధంగా చర్యలు తీసుకున్నారు.
దవాఖానలో అరుదైన ఆపరేషన్లు..
రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా వందలాది ఆపరేషన్లు చేసి… వారెవ్వా…ప్రభుత్వ దవాఖాన అనిపించుకున్నది. ఒక్క రోజే 90 ఆపరేషన్లు చేసిన చరిత్ర ప్రభుత్వ దవాఖానకు ఉంది. అంతేకాకుండా క్యాత్ల్యాబ్, మోకాళ్ల చిప్పల మార్పిడి, అనేక రకాల ఆపరేషన్లు విజయవంతంగా పూర్తి చేశారు. ప్రైవేటు దవాఖానలో సైతం చేయలేని క్లిష్టమైన, లక్షలు ఖర్చయ్యే ఆపరేషన్లను ఉచితంగా చేస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. అన్ని రోగాలకు సంబంధించిన వైద్యులు అందుబాటులో ఉండి నిత్య పర్యవేక్షణలో ప్రభుత్వ దవాఖానలో సేవలు కొనసాగుతున్నాయి. గతంలో దవాఖానను పట్టించుకునేనాథుడే కరువయ్యారు. అలాంటిది రాష్ట్రంలో నంబర్ వన్ స్థానంలో ఉండి జాతీయ పుస్కారాలు అందుకున్న ఘనత ప్రభుత్వ దవాఖానకు ఉంది. నాణ్యతకు మారుపేరుగా నిజామాబాద్ దవాఖాన సేవలు అందిస్తున్నారు.
వైద్యకళాశాలతో మారిన దశదిశ..
గతంలో నిజామాబాద్ ప్రభుత్వ దవాఖానను ఎంసీఐ బృందం సందర్శించినప్పుడు సరైన వసతులు లేకపోవడంతో వైద్యకళాశాలకు అనుమతి ఇవ్వని పరిస్థితి, కానీ.. ఎమ్మెల్సీ కవిత, మంత్రి ప్రశాంత్ రెడ్డి పట్టువదలని విక్రమార్కుడిలా ముఖ్యమంత్రి కేసీఆర్తో మాట్లడి ప్రభుత్వ దవాఖానలో కార్పొరేట్ స్థాయిలో ఉండే విధంగా వసతులు కల్పించి జిల్లాకు వైద్యకళాశాలను మంజూరు చేయించారు. దీంతో దవాఖాన దశదిశ మారిపోయింది. నిత్యం రద్దీతో కిటకిటలాడుతున్నది. కరోనా సమయంలో వైద్యులు, సిబ్బంది భయపడకుండా ప్రజల ప్రాణాలే ముఖ్యమనే విధంగా పని చేసి చూపించారు.
భారీగా పెరిగిన ఓపీ కేసులు
కరోనా కన్నా ముందు దవాఖానలో సుమారు 1000కి పైగా ఓపీ ఉండేది. కానీ ప్రస్తుతం 1600 మంది ఓపీ వస్తున్నారు. ఇన్పేషెంట్లు(ఐపీ) సైతం భారీగా ఉండగా, అందులోనూ అధికంగా మహిళలే ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ నెలలో వీరే 1267 మంది ఉన్నారు. వీరిలో 40 శాతం శస్త్రచికిత్సలు చేయించుకున్న వారు కావడం గమనార్హం.
ప్రసవాల్లోనూ.. టాప్
జిల్లా కేంద్ర దవాఖాన ప్రసవాల్లోనూ అగ్రస్థానంలో నిలుస్తున్నది. నిత్యం పదుల సంఖ్యలో ప్రసవాలు చేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలతో నార్మల్ డెలివరీల కోసం విశేషంగా కృషి చేస్తున్నారు. కొన్ని క్లిష్టమైన కేసుల్లో మాత్రమే ఆపరేషన్లు చేస్తున్నారు.
ఏ సమస్యలతో వస్తున్నారంటే ..
చిన్నచిన్న జ్వరాల నుంచి టైఫాయిడ్ వరకు వాంతులు, కడుపు, నడుము, తలనొప్పితో చికిత్స పొందే వారితో పాటు మోకీలు మార్పిడి, కణతుల తొలగింపు వంటి అరుదైన శస్త్ర చికిత్సలు చేయించుకునే వారి వరకు ఉంటున్నారు. ముఖ్యంగా గర్భిణుల విషయంలో వైద్యులు, సిబ్బంది ప్రత్యేకంగా చొరవ తీసుకుంటున్నారు. వ్యాయామం చేయిస్తూ నార్మల్ డెలవరీలు చేయించేలా వైద్యులు కష్టపడుతున్నారు. వారి ఆరోగ్యనికి భరోసా కల్పిస్తున్నారు.
నిత్యం పర్యవేక్షిస్తున్నాం..
ప్రతి రోజూ దవాఖానలోని వైద్యులతో సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. రోగులకు అందుతున్న వైద్య సదుపాయాలపై నిత్యం పర్యవేక్షిస్తున్నాం. ప్రతి సోమవారం 1500 నుంచి 1600 వరకు ఓపీ వస్తున్నారు. దవాఖానకు రోగుల తాకిడి పెరిగింది. ఓపీ ఎక్కువగా ఉంటున్నది. పడకలకు మించి ఐపీ నమోదువుతున్నది. ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలుగకుండా వైద్య సేవలు అందిస్తున్నాం. శస్త్రచికిత్సలు, మోకీలు మార్పిడి, ప్రసవ సమయంలో ఆపరేషన్లు చేస్తుండడంతో ప్రజలకు ప్రభుత్వ దవాఖానపై నమ్మకం పెరిగింది. ప్రభుత్వ దవాఖానలో అన్ని వసతులు మెండుగా ఉన్నాయి.
–డాక్టర్ ప్రతిమారాజ్, దవాఖాన సూపరింటెండెంట్