విద్యానగర్, నవంబర్ 28 : కామారెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులను విడుదల చేస్తున్నదని ప్రభుత్వ విప్, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. విప్ తన నివాసంలో మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో 15 బీటీ రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం తాజాగా రూ.34.20 కోట్లు మంజూరు చేసిందన్నారు. రానున్న రోజుల్లో నియోజకవర్గ అభివృద్ధికి మరింత కృషి చేస్తామని అన్నారు. ఎన్నడూ లేని విధంగా పట్టణాలు, పంచాయతీల్లో రోడ్లు ఎంతో అభివృద్ధి చెందాయన్నారు. కామారెడ్డి పట్టణ అభివృద్ధికి మరో రూ.25 కోట్లు మంజూరు చేయాలని మంత్రి కేటీఆర్ను కోరామని తెలిపారు. కామారెడ్డి మెడికల్ కాలేజీకి రూ.234 కోట్లు మంజూరయ్యాయని త్వరలో శంకుస్థాపన కార్యక్రమానికి సీఎం కేసీఆర్ను ఆహ్వానిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఎంకే ముజీబుద్దీన్, ఎంపీపీ పిప్పిరి ఆంజనేయులు, మాచారెడ్డి జడ్పీటీసీ మినుకూరి రాంరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ పిప్పిరి వెంకటి, టీఆర్ఎస్ అధికారి ప్రతినిధి బల్వంత్ రావు, ఆంజనేయులు, గరిగంటి లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.