నిజామాబాద్, మార్చి 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : అకాల వర్షాలు అన్నదాతలకు అపార నష్టాన్ని మిగిల్చాయి. వందలాది ఎకరాల్లో పంట పొలాలు దెబ్బతిన్నాయి. ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇటీవల కురిసిన వర్షాలతో భారీగా పంట నష్టం వాటిల్లింది. దిగుబడి బాగా వస్తుందనుకున్న అన్నదాతల ఆశలకు గండిపడింది. పలు ప్రాంతాల్లో వడగండ్లు పడడంతో వరి, మక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. పంటల నష్టంపై వ్యవసాయ శాఖ వివరాలు సేకరించి నివేదికలను ప్రభుత్వానికి పంపించింది. నిజామాబాద్ జిల్లాలో 2 వేల ఎకరాలు, కామారెడ్డి జిల్లాలో 981 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లినట్లు తేలింది. రైతు ప్రయోజనాలే పరమావధిగా పని చేస్తున్న కేసీఆర్ ప్రభుత్వం.. అకాల వర్షాలతో నష్టపోయిన అన్నదాతలను ఆదుకునేందుకు కార్యాచరణను సిద్ధం చేస్తున్నది. పరిహారం అందించి రైతులకు భరోసా ఇవ్వాలని యోచిస్తున్నది. ఒకవైపు బీమా పథకాల్లో సవాలక్ష కొర్రీలతో కేంద్ర సర్కారు కిరికిరి పెడుతున్నా, అవేవీ పట్టించుకోకుండా అన్నదాతలను ఆదుకోవాలన్న ఏకైక లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తున్నది.
యాసంగి పంటల సీజన్లో మరోమా రు భారీ వర్షం అపార నష్టాన్ని మిగిల్చింది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో అన్నదాతలను తీవ్రంగా కుంగదీసింది. అక్కడక్కడా కురిసిన భారీ వర్షాలతో వేలాది ఎకరాల్లో వివిధ పంటలు తీవ్రం గా దెబ్బతిన్నాయి. చెడగొట్టు వానలకు తోడు గాలి దుమారం తీవ్రంగా చేటు చేసింది. శ్రమటోడ్చి సాగు చేస్తున్న రైతులకు ఆదిలోనే ఆటంకం ఎదురైనట్లుగా మారింది. ఊహించని విపత్తుతో కొంత మంది రైతులను కోలుకోకుండా చేసింది. ఏపుగా ఎదిగిన వరి పంట నేలవాలి పూర్తిగా పనికి రా కుండా పోయింది. దెబ్బతిన్న పంటలను చూసి కర్షకులు కంటతడి పెడుతున్నారు. తమకు ఎదురైన నష్టాలను తలచుకొని అధికారులు, ప్రజా ప్రతినిధుల ఎదుట ఆవేదన వెలిబుచ్చుతున్నారు. పంట నష్టపరిహారం ద్వారా రైతులకు సాంత్వన చేకూర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నది. పంట నష్టం బీమా సౌకర్యం కల్పనతోపాటు పరిహారం చెల్లించి అన్నదాతకు ఇబ్బంది ఎదురవ్వకుండా చర్యలు తీసుకుంటున్నది. సకాలంలో పరిహారం అందివ్వడం ద్వారా కర్షకుడి కన్నీటిని తుడిచేలా తెలంగాణ వ్యవసాయ శాఖ పాటుపడుతున్నది.
పంట నష్టం వివరాలివీ…
నిజామాబాద్ రూరల్, బాల్కొండ, ఆర్మూర్ నియోజకవర్గాల పరిధిలో పంట నష్టం వాటిల్లినట్లు అధికారులు గుర్తించారు. ప్రాథమిక సమాచా రం మేరకు నిజామాబాద్ జిల్లాలో 1970 ఎకరాల్లో పంటలు నేలకొరిగాయి. ఇందులో వరి, మక్కజొన్న పంటలు అత్యధికంగా విస్తరించి ఉన్నా యి. ఇంకా ముసురు కొనసాగుతుండడంతో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా వరి సాగుదారులంతా స్థానిక వ్యవసాయాధికారులతో మాట్లాడి తగు సూచనలను పాటించాలని చెబుతున్నారు. కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి, కామారెడ్డి నియోజకవర్గాల్లో పంటలు తీవ్రంగా నష్టపరిచాయి. జిల్లా వ్యాప్తంగా 1153 మంది రైతులకు సంబంధించిన 981 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసాయాధికారులు తేల్చారు. ముఖ్యంగా వరి, మక్కజొన్న, జొన్న పంటలు దెబ్బతిన్నట్లుగా గుర్తించారు. కామారెడ్డి జిల్లాలో అత్యధికంగా మక్కజొన్న పంటలే దెబ్బతిన్నాయి. పంట చేతికొచ్చే ఈ దశలో వడగండ్ల వానతో పాటు గాలి దుమారం, భారీ వర్షం మూలంగా మక్కజొన్న కంకులు నేలకొరగడం కాసింత ఇబ్బందికరమైన పరిస్థితులను తీసుకువచ్చింది.
బీమా పేరుతో కేంద్రం కిరికిరి…
తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నదాతలకు కొండంత అండగా నిలుస్తున్నది. పంట నష్టాన్ని శాస్త్రీయ పద్ధతిలో లెక్కిస్తూ పరిహారం అందివ్వడంలోనూ వేగంగా చర్యలు తీసుకుంటున్నది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వాతావరణ ఆధారిత బీమా, ఫసల్ బీమా యోజన పథకాల్లో నిబంధనల కిరికిరి పెట్టి రైతులతో ఆటలాడుకుంటున్నది. బీమా ప్రీమియం చెల్లించిన రైతులకు ఈ బీమా పథకాల ద్వారా లబ్ధి చేకూరడం కలగానే మిగులుతున్నది. ప్రయోజనం అంతగా లేకపోవడంతో కేంద్రం అందిస్తున్న బీమాను రైతులు తిరస్కరిస్తున్నారు. ప్రీమియం చెల్లించినప్పటికీ పంట నష్టం తర్వాత పరిహారం సకాలంలో రావడం లేదనే రైతులు బీమా చెల్లింపులపై అనాసక్తి చూపిస్తున్నారు. గత సీజన్కు సంబంధించి వరికి జిల్లా వ్యాప్తంగా చాలా తక్కువ మంది మాత్రమే బీమా చెల్లించారు. ఇక మక్కజొన్న పంటకు సైతం బీమాకు రైతులు మొగ్గు చూపలేదు. అయితే దురదృష్టవశాత్తు ఈసారి వర్షాలతో అధిక మొత్తంలో నష్టపోవడంతో రైతుకు ఊహించని విపత్తు ఎదురైనట్లు అయ్యింది. క్షేత్ర స్థాయిలో వ్యవసాయ అధికారులు సేకరించిన పంట నష్టం వివరాల నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి వ్యవసాయ శాఖ సమర్పించింది. తద్వారా కేంద్ర సర్కారుతో సంబంధం లేకుండానే కేసీఆర్ సర్కారే పంట నష్ట పరిహారాన్ని అందివ్వనుంది.
తక్షణ స్పందన…
రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా రాష్ట్ర ప్రభుత్వం తక్షణం స్పందిస్తున్నది. వారికి ఇబ్బందులను తొలగించి నష్టాలను నివారిస్తున్నది. వారం రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన అకాల వర్షాలు నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలోనూ ప్రభావం చూపాయి. కామారెడ్డి జిల్లాలోని గాంధారి, లింగంపేట, కామారెడ్డి, మాచారెడ్డి, బాన్సువాడ ఏరియాల్లో వడగండ్ల వానలు పంటలను నష్టపరిచాయి. అలాగే నిజామాబాద్ జిల్లాలోని ధర్పల్లి, జక్రాన్పల్లి, మాక్లూర్, భీమ్గల్, వర్ని, కోటగిరి, రుద్రూర్, చందూర్, నవీపేట, రెంజల్ ప్రాంతాల్లోనూ అక్కడక్కడా పంటలను చెడగొట్టే వానలతో ఇబ్బందులు తలెత్తాయి. మక్కజొన్న, వరి పంటలే ఎక్కువగా నష్టపోగా వ్యవసాయ శాఖ వెంటనే కదిలి క్షేత్ర స్థాయిలో పరిశీలన చేస్తున్నది. ప్రభుత్వం కూడా తక్షణం ఆదేశాలు జారీ చేయడంతో నష్ట వివరాల సేకరణలో ప్రభుత్వ యంత్రాంగం నిమగ్నమై రైతులకు బాసటగా నిలిచింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సైతం ఉమ్మడి జిల్లాలోని పంట నష్టంపై వివరాలను ఆరా తీశారు.
వివరాలను ప్రభుత్వానికి నివేదిస్తాం…
అకాల వర్షాలతో వాటిల్లిన పంట నష్టం వివరాలను సేకరించాం. ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తాం. రైతులెవ్వరూ పంట నష్టంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. తగు విధంగా వారికి పరిహారం వచ్చేలా ప్రభుత్వానికి వివరాలను పంపిస్తున్నాం. పూర్తిగా నేలకొరిగిన పంటలు కాకుండా పాక్షికంగా దెబ్బతిన్న చోట్ల వ్యవసాయాధికారుల సూచనలతో పంటలను నిలబెట్టుకోవచ్చు. రైతుల సేవలో వ్యవసాయ శాఖ అధికారులంతా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారు.
– భాగ్యలక్ష్మి, కామారెడ్డి జిల్లా వ్యవసాయాధికారిణి