నిజామాబాద్ సిటీ : రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వరి ధ్యానం కొనుగోలుకు జిల్లాలో అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రగతిభవన్లో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. మార్కెటింగ్ శాఖ కొనుగోలు కేంద్రాలకు అవసరమైన సదుపాయాలు గన్ని బ్యాగులు, తూకం కాంటాలు, తదితర అవసరమైన యంత్రాలు కేంద్రాలకు సరిపోయే విధంగా అందుబాటులో ఉంచుకోవాలని అన్నారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు రైతులు తీసుకువచ్చే ఎఫ్ఏక్యూ కలిగిన ఏ గ్రేడ్ రకానికి క్వింటాలుకు రూ.1960, కామన్ రకానికి రూ.1940 రైతులకు చెల్లించనున్నట్లు వెల్లడించారు. ఇన్చార్జిలు జారీ చేసిన టోకన్ ప్రకారమే నిర్ధేశించిన తేదీకి తీసుకు రావాలని, 17 శాతంలోపు తేమ కలిగిన ధ్యానం మాత్రమే కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. ఈనెల 21న ధాన్యం కొనుగోలుకు సంబంధించి జిల్లా స్థాయి, 21, 22న గ్రామ, మండలస్థాయిలో అవగాహన సమావేశాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
రైస్మిల్లర్లు కడ్తా పేరుతో రైతుల వద్ద అధిక ధాన్యాన్ని తీసుకున్నా, హమాలీలు అధిక చార్జీలు వసూలు చేసినా చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎక్కడైనా సమస్యలు ఎదురైతే రైతులు 18004256644, 08462221085 నంబరుకు కాల్ చేయాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు చిత్రమిశ్ర, చంద్రశేఖర్, డీసీఓ సింహాచలం, ఇన్చార్జి డీసీఓ వెంకటశ్వేరావు, డీఏఓ గోవింద్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.