నిర్మల్ టౌన్ : నిర్మల్ జిల్లాలోని నిర్మల్, భైంసా, ఖానాపూర్ మున్సిపాలిటీలో జరిగే పట్టణ ప్రణాళిక అభివృద్ధి పనులతో పాటు పట్టణ ప్రగతి పనులను వేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో పట్టణ ప్రగతి ద్వారా నిర్వహించే పనులపై అన్ని మున్సిపాలిటీ అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఆయా మున్సిపాలిటీలో పట్టణ ప్రణాళిక అమలుకు తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం విడుదల చేసిన నిధులను సద్వినియోగం చేసుకొని అభివృద్ధి పనులు చేపట్టాలని సూచించారు.
అన్ని వార్డుల్లో పారిశుధ్య పనులతో పాటు సీసీ రోడ్లు, మురికి కాలువలు నిర్మించాలని ఆదేశించారు. ఖాళీ ప్రదేశాలను గుర్తించి అక్రమాలకు గురి కాకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరానికిగాను పన్నులను వసూలు చేయాలని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, జిల్లా అధికారులు పాల్గొన్నారు.