నిర్మల్ టౌన్ : జిల్లాలో పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేసుకునేందుకు అన్ని విధాల కృషి చేస్తున్నామని జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అన్నారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలో అజాదికా అమృతోత్సవం కార్యక్రమంలో భాగంగా ఎగుమతిదారులకు పారిశ్రామిక రంగంపై నిర్వహించిన అవగాహన సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పారిశ్రామిక రంగానికి తీసుకుంటున్న చర్యలు, వనరులపై అవగాహన కల్పించారు.
జిల్లాలో వాణిజ్య బ్యాంకులు, పారిశ్రామిక సంస్థల ద్వారా అందిస్తున్న ప్రోత్సాహాకాలు ప్రజలకు ఉపయోగపడేలా జిల్లా పరిశ్రమలశాఖ కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పారిశ్రామికవేత్తలు కృష్ణ, రవిప్రకాశ్, మహేందర్లు పాల్గొన్నారు.