నిర్మల్ అర్బన్ : జిల్లాలో వినాయక నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. తొమ్మిది రోజుల పాటు విశేష పూజలు అందుకున్న వినాయకుడు గంగమ్మ ఒడికి చేరనున్నారు. నిర్మల్ జిల్లాలో ఆయా మండలాలు, గ్రామాలలో ఏర్పాటు చేసిన వినాయకులను ఐదు, ఏడు రోజులలో ఇప్పటికే నిమజ్జనం చేయగా భారీ వినాయకులను 9 రోజులు, 10 రోజులకు నిమజ్జనం చేయనున్నారు.జిల్లాలో సమస్యాత్మక ప్రాంతమైన భైంసాలో శనివారం, నిర్మల్, ఖానాపూర్లలో ఆదివారం నిమజ్జనం చేయనున్నారు. ఈ సందర్భంగా వినాయక శోభాయాత్రను భక్తి శ్రద్ధలతో నిర్వహించేందుకు ఉత్సవ సమితి సభ్యులు ఏర్పాట్లను పూర్తి చేశారు. పోలీసు శాఖతో పాటు మున్సిపల్, ఆర్అండ్బీ, విద్యుత్, అగ్నిమాపక శాఖ, ఆరోగ్య శాఖ అధికారులు ఏర్పాట్లను పూర్తి చేశారు.
జిల్లా ఇన్చార్జి ఎస్పీ సీ.హెచ్ ప్రవీణ్ కుమార్, భైంసా ఏఎస్పీ కిరణ్ ఖారేలా ఆధ్వర్యంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇప్పటికే వినాయకులను నిమజ్జనం చేసే ప్రదేశాల్లో ఏర్పాట్లను పర్యవేక్షించారు. శోభాయాత్ర జరిగే మార్గంలో విద్యుత్ లైన్ల మరమ్మతులు, వీధి దీపాల ఏర్పాట్లు, గుంతలను పూడ్చడం వంటి పనులను పూర్తి చేశారు. భారీ వినాయకులను నిమజ్జనం చేసేందుకు నిమజ్జన ప్రదేశాల వద్ద క్రేన్లను, గజ ఈతగాళ్లను, మున్సిపల్ ఆధర్యంలో పారిశుధ్య కార్యక్రమాలు, విద్యుత్ సమస్య పరిష్కారానికి జనరేటర్లను ఏర్పాటు చేశారు. జిల్లాలో ఉత్సవ శోభాయాత్రను విజయవంతం చేసేందుకు పోలీసులు జిల్లాకు ప్రత్యేక బలగాలను రప్పించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలీసులు ఫ్లాగ్ మార్చ్ను నిర్వహించారు.
ప్రార్థన మందిరాలు, మసీదులు, దేవాలయాల్లో సీసీ కెమెరాలు, పోలీస్ పికెటింగ్లను ఏర్పాటు చేశారు. డీఎస్పీలు, సీఐ, ఎస్సైలు, కానిస్టేబుళ్లు, హోంగార్డులు, స్పెషల్ పార్టీ సిబ్బందితో పాటు, మొబైల్ వీడియోగ్రఫీని ఏర్పాటు చేశారు. దాదాపు 1000 మంది పోలీసులు నిమజ్జనంలో విధులు నిర్వహించనున్నారు. జిల్లాలో వినాయక నిమజ్జనాన్ని ప్రశాంతంగా నిర్వహించేందుకు గట్టి చర్యలు తీసుకున్నామని జిల్లా ఇన్చార్జి ఎస్పీ ప్రవీణ్ కుమార్ తెలిపారు.