నిర్మల్ అదనపు కలెక్టర్ రాంబాబు
2021-22 ఆర్థిక సంవత్సర బుక్లెట్ విడుదల
రూ. 3557.37 కోట్ల రుణాల లక్ష్యం
నిర్మల్ టౌన్, జూలై 2 : వార్షిక రుణ ప్రణాళికలను అమలు చేయాలని నిర్మల్ అదనపు కలెక్టర్ రాంబాబు అన్నారు. కలెక్టరేట్లో శుక్రవారం జిల్లా కో ఆర్డినేషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. నిర్మల్ జిల్లా వార్షిక రుణ ప్రణాళికను ఖరారు చేసి, బుక్లెట్లను విడుదల చేశారు. 2021-22 ఆర్థిక సంవత్సరానికిగాను రూ. 3557.37కోట్లతో రుణ ప్రణాళిక ఏర్పాటు చేసిన ట్లు చెప్పారు. ఇందులో రైతులకు ప్రాధాన్యమిచ్చినట్లు తెలిపారు. డబ్బులు రుణాల చెల్లింపునకు వినియోగించుకోరాదన్నారు. ఎస్సీ, ఎస్టీ రుణాలకు సంబంధించిన లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని చెప్పారు. వ్యవసాయ రంగానికి రూ. 2782.66 కోట్లు కేటాయించగా.. పంట రుణాలకు రూ. 1957.35 కోట్లు కేటాయించినట్లు వివరించారు. సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమల రంగానికి రూ. 383.42 కోట్లు, విద్యా రంగానికి రూ. 36.48కోట్లు, గృహ రంగానికి రూ. 80.40 కోట్లు కేటాయింపులు చేసినట్లు వెల్లడించారు. గతేడాది పంట రుణాలకు రూ.1646 కోట్లు లక్ష్యంగా పెట్టుకోగా, రూ. 1134 కోట్లు మాత్రమే రైతులకు అందించినట్లు వివరించారు. ఈ ఏడాది వంద శాతం రుణాలు అందించాలని సూచించారు. స్వయం సహాయక సంఘాలకు రూ. 239కోట్లకుగాను రూ. 261 కోట్లు చెల్లించినట్లు చెప్పారు. కార్యక్రమంలో లీడ్ బ్యాంకు మేనేజర్ హరికృష్ణ, నాబార్డు డీడీఎం రాజశేఖర్రెడ్డి, ఆర్బీఐ ఏజీఎం శరత్చంద్, ఎస్బీఐ ఏజీఎం సూర్యప్రకాశ్ రావు, యూబీఐ అధికారి కృష్ణ, ఏడీసీసీ ఏజీఎం మురళీధర్రెడ్డి, పరిశ్రమలశాఖ అధికారి నర్సింహారెడ్డి పాల్గొన్నారు.