న్యూఢిల్లీ: దేశంలో కరోనా రెండో దశ విజృంభిస్తున్నది. ఈ నేపథ్యంలో ప్రవేశ, ఉద్యోగ నియామక పరీక్షలు ఒక్కొక్కటిగా వాయిదాపడుతున్నాయి. తాజాగా ఈ నెలలో జరగాల్సిన సీజీఎల్, హెచ్ఎస్ఎల్ పరీక్షలను వాయిదా వేస్తునట్టు స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (ఎస్సెస్సీ) ప్రకటించింది. వీటితోపాటు ఎస్సెస్సీ జీడీ కానిస్టెబుల్ నోటిఫికేషన్ను వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. షెడ్యూల్ ప్రకారం సీహెచ్ఎల్ టైర్-1 పరీక్ష మే 21, 22 తేదీల్లో, సీజీఎల్ టైర్-1 పరీక్ష ఈ నెల 29 నుంచి జరగాల్సి ఉన్నాయి. అలాగే జనరల్ డ్యూటీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఈ నెల మొదటి వారంలో విడుదలవాల్సి ఉన్నది. దీనిద్వారా సీఏపీఎఫ్, ఎన్ఐఏ, అస్సాం రైఫిల్స్లో రైఫిల్మ్యాన్ పోస్టులను భర్తీ చేస్తారు. వాయిదా పడిన నోటిఫికేషన్ను త్వరలోనే విడుదల చేస్తామని తెలిపింది. అదేవిధంగా పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తామనే విషయాల కోసం అభ్యర్థులు క్రమం తప్పకుండా ఎస్సెస్సీ వెబ్సైట్ ssc.nic.inలో చూడాలని వెల్లడించింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి