కోల్కతా : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు చెదురు ముదురు సంఘటనలు మినహా ప్రశాంతంగా జరుగుతున్నాయి. మంగళవారం ముగిసిన మూడో దశ ఓటింగ్లో పెద్ద ఎత్తున ఓటర్లు తరలిరావడంతో 77.68 శాతం ఓటింగ్ నమోదైంది. అసెంబ్లీ ఎన్నికలు మధ్యలో ఉండగా.. కొత్తగా కూపన్ల పంపిణీ వివాదం రాజుకున్నది. ఓటర్లను ఆకట్టుకునేందుకు ముద్రించిన వేయి రూపాయల కూపన్లును బీజేపీ పలు ప్రాంతాల్లో పంపిణీ చేయడం ఈ వివాదానికి మూలకారణం. కాగా, ఈ ఆరోపణలను బీజేపీ ఖండించింది.
మంగళవారం బెంగాల్లో మూడవ దశలోని 31 స్థానాల్లో ఓటింగ్ జరిగింది. తృణమూల్-బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు, రాళ్ళు రువ్వుకోవడం, దాడులు చేసుకోవడం వంటి చిన్న చిన్న సంఘటనలు బయటపడ్డాయి.
మోదీ ర్యాలీని సక్సెస్ చేసేందుకు బీజేపీ నేతలు వేయి రూపాయల విలువ చేసే ముద్రించిన కూపన్లు పంపిణీ చేసినట్లు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిట్రా ట్వీట్ చేసి ఈ కూపన్ల గురించి బయటపెట్టారు. ‘మోడీ ఇలా ఇంటింటికి చేరుకుంటున్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలి. ఇలా మోదీని ఇంటింటికి వెళ్లనివ్వవద్దని ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేస్తున్నాం’ అని మహువా ట్వీట్ చేశారు.
కూపన్ల పంపిణీని అడ్డుకోవాలని టీఎంసీతో పాటు వామపక్షాలు నేతలు డిమాండ్ చేస్తున్నారు. ప్రజలు వెంట రావడంలేదని గమనించి ఇలా రప్పించుకుంటున్నారని వామపక్షాలు దుమ్మెత్తిపోశాయి. మూడు రోజుల క్రితం జియోనగర్లో మోదీ ర్యాలీకి హాజరు కావడానికి ఇలాంటి కూపన్లు పంచిపెట్టినట్లు ఇరు పార్టీలు ఆరోపిస్తున్నాయి. మోదీ ర్యాలీకి హాజరయ్యేందుకు కూపన్లు పంపిణీ చేసింది నిజమేనని జియోనగర్ గ్రామస్తులు పేర్కొంటుండటం విశేషం. కూపన్ల ద్వారా గ్రామస్తులకు ఖచ్చితంగా బహుమతి ఇస్తామని బీజేపీ నేతలు హామీ ఇచ్చినట్లు వారు చెప్తున్నారు.
దక్షిణ 24 పరగణాలలో రైదిగి వద్ద బీజేపీ మద్దతుదారుల చేతిలో కూపన్లు కనిపించాయి. అందులో వెయ్యి రూపాయల ప్రస్తావన ఉన్నది. దానిపై మోదీ ఫొటో ముద్రించి ఉన్నది. అయితే, టీఎంసీ, వామపక్షాలు ఆరోపిస్తున్నట్లుగా ఇది కూపన్ కాదని, తమ పార్టీ మద్దతుదారులు ఇచ్చిన విరాళాలకు ఇస్తున్న రసీదు అని బీజేపీ నేతలు చెప్తున్నారు.
జియోనగర్లో సమావేశం నిర్వహించడానికి విరాళాలు సేకరించారని, అందులో వచ్చిన విరాళానికి రసీదు ఇచ్చినట్లు వారు అంటున్నారు. అయితే, రైదిగికి చెందిన బీజేపీ అభ్యర్థి శాంతను బాపులి భిన్నమైన వాదన వినిపించారు. ఈ కూపన్ల నుంచి నగదు పొందవచ్చునని, కార్యకర్తలను తరలించేందుకు తీసుకువచ్చిన వాహనాల కోసం అలా కూపన్లు ఇవ్వాల్సి వచ్చిందని చెప్పారు.
సీపీఎం అభ్యర్థి కాంతి గంగూలీ రైదిగికి వెళ్ళినప్పుడు పార్టీ కార్యకర్తలు ఈ కూపన్లను చూపించారు. తృణమూల్ కార్యకర్తలకు కూడా ఇలాంటి కూపన్లు అందినట్లు వారు చెప్పారు. ఈ కూపన్లో మోదీ ఫొటోతో పాటు వెయ్యి రూపాయలను ముద్రించారు. అయితే కూపన్పై చందా లేదా విరాళం వంటి పదాలు ఎక్కడా ముద్రించలేదు. వీటిని బీజేపీ మధురాపూర్ ఆర్గనైజింగ్ జిల్లా కమిటీ ముద్రించినట్లు తేలింది. ఈ తప్పుడు ధోరణిని బీజేపీ ప్రారంభించిందని, అయితే ప్రజలు ఈ ఆఫర్ను తిరస్కరించి తమకే మద్దతు తెలిపారని కాంతి గంగూలీ ధీమాతో ఉన్నారు.
పరిచయం అక్కర్లేని సితార్ ప్లేయర్.. పండిత్ రవిశంకర్.. చరిత్రలో ఈరోజు
హజ్ యాత్రికులకు కరోనా వ్యాక్సిన్ తప్పనిసరి : సౌదీ ప్రభుత్వం
ప్రధానిపై అసత్య రాతలు.. బ్లాగర్కు 72 లక్షల జరిమానా
బుర్కా ధరించండని చెప్పి ఇబ్బందుల్లో పడిన ఇమ్రాన్ఖాన్
ఆర్మీకి వ్యతిరేకంగా గళమెత్తిన అందగత్తె
2036 వరకు రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమిర్ పుతిన్
వర్చువల్గా పెండ్లి ఉంగరాలు మార్చుకున్న అమెరికన్ జంట
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..