తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా వైవీ సుబ్బారెడ్డి బుధవారం ప్రమాణస్వీకారం చేశారు. శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలి వద్ద ఈఓ కేఎస్ జవహర్రెడ్డి.. చైర్మన్తో ప్రమాణం చేయించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులతో స్వామి వారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేశారు. ఈఓ, చైర్మన్ను శాలువతో సన్మానించి స్వామివారి ప్రసాదం, చిత్రపటం అందించారు. పలువురు ప్రజాప్రతినిధులు చైర్మన్ను అభినందించారు.
గత పాలక మండలి అనేక బృహత్తర కార్యక్రమాల నిర్వహణకు ఆమోదం తెలిపినా కొవిడ్ మహమ్మారితో అవి ఆగిపోయాయన్నారు. రాబోయే రోజుల్లో వీటన్నింటినీ కొనసాగిస్తామని సుబ్బారెడ్డి తెలిపారు. ప్రమాణ స్వీకారం అనంతరం ఆయన ఆలయం ఎదుట మీడియాతో మాట్లాడారు. ఇలాంటి కార్యక్రమాలు కొనసాగించడం కోసమే వేంకటేశ్వర స్వామి మరోసారి తనకు సేవ చేసుకునే అవకాశం ఇచ్చారని అభిప్రాయపడ్డారు. తనకు ఈ భాగ్యం కల్పించిన స్వామివారితో పాటు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి రుణపడి ఉంటానన్నారు. దేశవ్యాప్తంగా సుమారు వంద ఆలయాల్లో ప్రారంభించిన గుడికో గోమాత కార్యక్రమం కొనసాగిస్తూ, దేశంలోని ముఖ్య ఆలయాలన్నింటిలో భక్తులు గోపూజ చేసుకునే ఏర్పాటు చేస్తామని సుబ్బారెడ్డి తెలిపారు.
ప్రపంచ ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలని, కొవిడ్ నుంచి విముక్తి లభించేలా చేయాలని శ్రీవారిని ప్రార్థిస్తూ గత రెండేళ్లుగా నిర్వహిస్తున్న ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలు కొవిడ్ పూర్తిగా పోయే వరకు కొనసాగిస్తామని చెప్పారు. గో ఆధారిత ఎరువుల ద్వారానే పండించిన ఉత్పత్తులతో స్వామి వారికి నిత్య నైవేద్యం సమర్పించే కార్యక్రమం వంద రోజులకుపైగా కొనసాగుతోందన్నారు. శాశ్వతంగా కార్యక్రమం కొనసాగే ఏర్పాట్లు చేస్తామన్నారు. దేశవ్యాప్తంగా హిందూ ధర్మ ప్రచారం పెద్ద ఎత్తున నిర్వహిస్తామన్నారు. సామాన్య భక్తులకు సులభంగా, శీష్రంగా స్వామివారి దర్శనం కల్పించేందుకు ప్రాధాన్యం ఇస్తామన్నారు. కొవిడ్ కారణంగా భక్తుల ఆరోగ్య భద్రత దృష్ట్యా నిలిపి వేసిన సర్వ దర్శనం 15 రోజుల్లోపు కొంత సంఖ్యలోనైనా పునరుద్ధరించే అవకాశాలు పరిశీలించేందుకు అధికారులతో చర్చిస్తానని చైర్మన్ వివరించారు.