న్యూఢిల్లీ: వివాదాస్పద ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ అమెన్డ్మెంట్ బిల్లు(FCRA Bill) 2026ను పార్లమెంటరీ స్థాయి సంఘానికి సిఫారసు చేశారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఆ బిల్లును పాస్ చేస్తూ లోక్సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఆ బిల్లులో ఉన్న అంశాలపై విపక్షాలు ఆందోళనలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో జేపీసీకి బిల్లును కమిటీకి పాస్ చేశారు. పార్లమెంటరీ స్థాయి సంఘంలో 21 మంది లోక్సభ, పది మంది రాజ్యసభ సభ్యులు ఉంటారు. శీతాకాల పార్లమెంట్ సమావేశాల తొలివారం చివరి రోజున జేపీసీ తన నివేదికను సమర్పిస్తుంది. ఎఫ్సీఆర్ఏ ఎజెండాను పూర్తిగా విత్డ్రా చేసుకోవాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఆ బిల్లును జేపీసీకి పంపేందుకు ఆసక్తిగా ఉన్నట్లు మంగళవారం ప్రభుత్వం పేర్కొన్న విషయం తెలిసిందే. క్యాథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని అనేక క్రైస్తవ సంఘాలు, మీజోరం.. నాగాలాండ్ సీఎంలు, కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకే పార్టీలు కూడా ఎఫ్సీఆర్ఏ బిల్లును వ్యతిరేకిస్తున్నాయని ప్రభుత్వం తెలిపింది. ఈ బిల్లును మార్చి 25వ తేదీన లోక్సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ద్వారా ఎన్జీవోలు, విదేశీ నిధులపై ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టనున్నది.
ఇండియాలోని కంపెనీలకు, స్వచ్ఛంద సంస్థలకు విదేశాల నుంచి అందుతున్న నిధులపై నియంత్రణకు, పారదర్శకత కోసం కేంద్రం ఈ బిల్లును తీసుకొస్తోంది. ఈ బిల్లు ప్రకారం విదేశాల నుంచి అందుతున్న నిధుల కోసం ఒక ప్రత్యేక పర్యవేక్షణా వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. విదేశీ సంస్థలకు చెందిన నిధులు, ఆస్తులు, విరాళాల్ని ఈ సంస్థ పర్యవేక్షిస్తుంది. మతపరమైన సంస్తకు చెందిన ఆస్తుల విషయంలో కూడా ఆయా నిర్వహణా సంస్థలు వాటి ఔన్నత్యాన్ని, విశ్వాసాన్ని కాపాడాలి. ఈ విషయంలో ఏదైనా సంస్థ నిబంధనలు ఉల్లంఘిస్తే సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటారు. ఐదేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. ఈ బిల్లును తమిళనాడుతో పాటు మిజోరం వ్యతిరేకిస్తున్నాయి.