Iran War : ఇరాన్-అమెరికా యుద్ధం మరింత ఉద్రిక్తంగా మారుతోంది. ఇప్పుడీ యుద్ధంలోకి హౌతీలు కూడా చొరబడ్డారు. తాజాగా గల్ఫ్ ఆఫ్ ఒమన్ తీరంలో ఒక నౌకపై హౌతీలు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆరుగురు మరణించినట్లు యెమెన్ వెల్లడించింది. యెమెన్లోని ఉగ్రవాద సంస్థ హౌతీస్. ఈ సంస్థకు ఇరాన్ అండగా ఉంటుంది. అందుకే తాజా యుద్ధంలో ఇరాన్ తరఫున ఈ ఉగ్రవాదులు కూడా పోరాడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా తాము మూడు మిస్సైల్స్ ప్రయోగించినట్లు యెమెన్ ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. ఈ వివరాల ప్రకారం గల్ఫ్ ఆఫ్ ఒమన్ తీరంలో, ఎర్ర సముద్రం వద్ద ఈజిప్టుకు చెందిన తిహమా అనే నౌకపై హౌతీలు మిస్సైల్ దాడి చేశారు.
ఈ ఘటనలో నౌకలోని నలుగురు మరణించారు. వీరిలో ముగ్గురు పాకిస్తానీలు, ఒక ఇండోనేసియన్ ఉన్నారు. ఆ తర్వాత ఈ నౌకలోని వారిని రక్షించేందుకు మరో రెస్క్యూ నౌక వచ్చింది. అయితే, ఈ నౌకపై కూడా హౌతీలు దాడి చేశారు. ఈ ఘటనలో మరో రెస్క్యూవర్లు మరణించారు. హౌతీస్ జరిపిన దాడిలో ఇలా ఆరుగురు మరణించారు. అలాగే, ఆయుధాలతో వెళ్తున్న సౌదీ మిలిటరీ నౌకపై కూడా బాబ్ ఎల్-మాందెబ్ వద్ద దాడి చేశామని హౌతీస్ సంస్థ ప్రకటించింది. ఈ దాడిపై సౌదీ అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు. మరోవైపు అమెరికా కూడా ఒక కార్గో నౌకపై దాడి చేసింది. పనామాకు చెందిన ఒక కార్గో నౌకకు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ స్పందించలేదని, దీంతో అమెరికన్ నేవీకి చెందిన ఎంహెచ్60 హెలికాప్టర్ నుంచి రెండు మిస్సైల్స్ ప్రయోగించామని అమెరికా తెలిపింది.
ఈ నౌక ఇరాన్ వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా ఈ దాడి చేశామని పేర్కొంది. ఇరాన్ పోర్టులకు ఎలాంటి నౌకలు వెళ్లకుండా జలసంధిని అమెరికా దిగ్బంధించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ ప్రాంతంలో రాకపోకలపై నిషేధం ఉన్నప్పటికీ.. పనామా నౌక వెళ్లేందుకు ప్రయత్నించడంతో దాడి చేశామని తెలిపింది. ఇంకోపక్క.. యుద్ధాన్ని ముగించేందుకు సిద్దంగా ఉన్నామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటిస్తున్నారు. కానీ, తమ షరతులకు అంగీకరించే వరకు యుద్ధం కొనసాగుతుందని, హార్ముజ్ జలసంధిని తెరిచేది లేదని ఇరాన్ అంటోంది. దీంతో ఇంకా వార్ కొనసాగుతోంది.