Telangana | సరిహద్దు రాష్ట్రాల పల్లెలన్నీ తెలంగాణ ప్రగతిని చూడాలని పయనమవుతున్నయి. విభజన రేఖ అవతలి నుంచి ‘జై తెలంగాణ’ నినాదాలు చేస్తున్నయి. ‘అనతి కాలంలోనే అపార అభివృద్ధిని సాధించిన తెలంగాణలో మమ్మల్నీ కలుపుకోండి’ అంటూ నిండు మనసుతో, ఎండిన గొంతుతో అభ్యర్థిస్తున్నయి. సతతహరిత.. సస్యశ్యామల.. సుందర.. సువర్ణ.. నిర్మల తెలంగాణలో భాగస్వాములను చేయండని అడుగుతున్నయి.
కర్ణాటకలోని రాయచూరు.. మహారాష్ట్రలోని నాందేడ్.. ఆంధ్రప్రదేశ్లోని తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల ప్రజలు తెలంగాణ అభివృద్ధిని చూసి సంబురపడిపోతున్నరు. తెలంగాణలో కలిసేందుకు ఒక అవకాశం ఇవ్వమని కోరుతున్నరు. ఎందుకంటే, తెలంగాణలోవ్యవసాయం ఓ పండగ. సంక్షేమం ఓ ఉత్సవం. అభివృద్ధి ఓ వేడుక. ఈ ప్రగతి ఫలాలను తామూ పొందాలనుకుంటున్నరు.
భరోసాలేని తమ బతుకులను బాగుచేసుకోవాలని ఆరాటపడుతున్నరు. ఈ ఆకాంక్ష .. అక్షరాలా న్యాయమైందే.సామాన్య జనుల స్వరానికి ప్రజా ప్రతినిధులూ గొంతు కలుపుతున్నరు. రాయచూరు అర్బన్ ఎమ్మెల్యే శివరాజ్ పాటిల్ ఏకంగా బహిరంగ ప్రకటన చేసిండు. అభివృద్ధిలో కుంటుపడుతున్న రాయచూరును తెలంగాణలో కలిపితేనే న్యాయం జరుగు తుందని అంటున్నడు. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాదీ ఇదే పరిస్థితి. అక్కడ ఊర్లకు ఊర్లు కదిలొచ్చి ఉద్యమం లేపుతున్నయి.
నాందేడ్ జిల్లాలోని పలు గ్రామాల సర్పంచ్లు ‘తెలంగాణలో కలపాలి’ అనే ప్రతిపాదన తీసుకొచ్చిండ్రు. ముఖ్యమంత్రి కేసీఆర్ను, మంత్రి హరీష్ రావును కలిసి తమ గోడు వెళ్ల్లబోసుకున్నారు. మరోవైపు పోలవరం ప్రాజెక్టు వల్ల నిర్వాసితులుగా మారిన పాత ఖమ్మం జిల్లా ప్రజలు, ఆంధ్రప్రదేశ్లోని తూగో, పగో జిల్లాలకు చెందిన నిర్వాసితులు తెలంగాణ అభివృద్ధికి హారతిపట్టి జైకొడుతున్నరు.
ఇది తెలంగాణ విజయం. టీఆర్ఎస్ పాలన పట్ల సరిహద్దు అవతల పెరుగుతున్న మద్దతుకు సాక్ష్యం. ఏదో ఒకనాటికి, ఈ ఆకాంక్షలే నినాదాలు అవుతాయి. నినాదాలే ఉద్యమ గీతాలు అవుతాయి. ఆ గీతాలే సరిహద్దు గీతలు చెరుపుతాయి. తెలంగాణ మలిదశ ఉద్యమం కూడా గుప్పెడు మందితో మొదలై ఉప్పెనలా ఎగిసింది కదా!
అనేక అవమానాలు ఎదుర్కొని, రాజీలేని పోరాటంతో తెలంగాణ సాధించుకున్నం. మన పథకాలను ఇతర రాష్ట్రాలే కాకుండా, కేంద్రం కూడా కాపీ కొట్టే పరిస్థితికి వచ్చినం. దళితబంధు ప్రకటించినంక ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంతోమంది ‘ఏపీలో పార్టీ పెట్టండి, మేం గెలిపించుకుంటం’.. అని విజ్ఞప్తి చేసిండ్రు. ఇదంతా ఎందుకు? మన అభివృద్ధి చూసే కదా? తెలంగాణ పథకాలు తమకు కావాలనే కదా? ‘తెలంగాణలో మా జిల్లాలను కలుపుకోండి’ అంటూ సరిహద్దు రాష్ట్రాల నుంచి వినతులు వస్తున్నయి. రాయచూర్ అర్బన్ ఎమ్మెల్యే శివరాజ్ పాటిల్ అయితే ‘రాయచూర్ను తెలంగాణలో విలీనం చేయండి’ అని బహిరంగ ప్రకటన చేసిండు. ఇటు పక్కన, మహారాష్ట్ర సరిహద్దు జిల్లా నాందేడ్ను తెలంగాణలో కలుపుకోవాలని ఎన్నో లేఖలు వచ్చినయి. నాందేడ్ జిల్లాలోని ప్రజలు, ప్రజా ప్రతినిధులు, పార్టీల నాయకులు నన్ను కలిసి తమ ఆకాంక్షను తెలియజేసిండ్రు. ఇది కదా అభివృద్ధి అంటే? ఇది కదా మార్పు అంటే? దేశ విదేశాల్లో మన రాష్ట్ర ప్రగతి, ప్రతిష్ట గురించి గొప్పగా చెప్పుకొంటుండ్రు. మన దగ్గర స్థిరపడేందుకు.. ఇక్కడ పనులు చేసుకునేందుకు ఉత్తరాది ప్రజలు ఎంతో ఆసక్తితో ఉన్నరు. ఇంకేం కావాలె? ఇలాంటి అభివృద్ధి దేశానికే గర్వకారణం.
– సీఎం కేసీఆర్
ఆంధ్రాలో.. జై తెలంగాణ!
ఒక రాష్ట్ర అవసరాల కోసం, మరో రాష్ట్ర ప్రజల మనోభావాలను పట్టించుకోకుండా, భావోద్వేగాలను బలిపెట్టి మరీ.. కలిపేయడం అప్రజాస్వామికం. తెలంగాణలోని ఏడు మండలాలకు ఆంధ్రా పోలవరం శాపమైంది. ఒక్క కలంపోటుతో ఆంధ్రాలో కలిపేశారు. వాళ్లంతా మనసొక చోట, బతుకొకచోట.. అన్నట్టు బతుకుతున్నారు. తమను తెలంగాణలో కలిపేయమని కోరుతున్నారు. వీళ్లే కాదు, పోలవరంకారణంగా నిర్వాసితులైన లక్షలమంది ఆంధ్రా ప్రజల అభ్యర్థనా ఇదే.
ఆంధ్రాలో సాగునీటి సౌలభ్యం కోసం నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు పనులకు అవరోధం లేకుండా.. తెలంగాణ ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్లో చేర్చింది కేంద్రం. అలా, తెలంగాణ అభివృద్ధి ఫలాలు ఆ మండలాలకు దక్కకుండా చేసింది. ప్రాజెక్టు పుణ్యమాని నిర్వాసితులైన లక్షల మంది ఆంధ్రా ప్రజలకు కూడా పొరుగున ఉన్న తెలంగాణ.. నీడనిచ్చే పెద్దన్నలా అనిపిస్తున్నది, అన్నపూర్ణలా కనిపిస్తున్నది. ‘మమ్మల్నీ తెలంగాణలో కలపండి’
పునరావాసం కోసం
పోలవరం ప్రాజెక్టు పనుల వల్ల ఏటా వానాకాలంలో ఏడు మండలాలు ముంపులోనే ఉంటున్నాయి. దీంతో నిర్వాసితులు ఎత్తు ప్రాంతాల్లో తలదాచుకోవాల్సిన పరిస్థితి. ఇప్పటికే తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో సుమారు రెండు లక్షల కుటుంబాలవారు నిర్వాసితులుగా మారారు. వారికి భద్రాచలం, బూర్గంపాడు, అశ్వారావుపేట మండలాలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. సర్కారువైపు నుంచి కొంత పరిహారం ఇచ్చారు కానీ, పునరావాసం కల్పించడంలో జాప్యం జరిగింది. అటవీ ప్రాంతంలో పునరావాసం కల్పిస్తామని చెప్పడంతో వాళ్లెవరూ అంతదూరం వెళ్లడానికి సిద్ధంగా లేరు. దీర్ఘకాల అనుబంధం ఉన్న తెలంగాణలో కలిసేందుకు సుముఖత చూపిస్తున్నారు. పరిహారం తీసుకున్నా, తెలంగాణలోనే స్థిరపడాలనేది చిరకాల వాంఛ. అవసరమైతే పెద్ద ఎత్తున ఉద్యమం చేసేందుకూ వారు సిద్ధంగా ఉన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం కేసీఆర్ అనుసరించిన వ్యూహాన్ని తామూ యథాతథంగా అమలు చేస్తామని చెబుతున్నారు.
ఇండ్ల స్థలాలతో సిద్ధం
భద్రాచలం డివిజన్ పరిధిలోని విఆర్పురం, కూనవరం, చింతూరు మండలాలను తూర్పు గోదావరి జిల్లాలో కలిపారు. అశ్వారావుపేట డివిజన్ పరిధిలోని వేలేరుపాడు, కుక్కునూరు మండలాలను పశ్చిమ గోదావరి జిల్లాలో కలిపారు. భద్రాచలం మండలంలో ఉన్న నెల్లిపాక, గౌరిదేవి పేట, తోటపల్లి, ఎటపాక గ్రామాలనూ తూగోలో తోసేశారు. పోలవరం ముంపు కిందికి వెళ్లిన తర్వాత ఆయా మండలాల అభివృద్ధి ఒకతరం వెనక్కి వెళ్లిపోయింది. నిధుల్లేక ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. వరదలొచ్చినా, వానలొచ్చినా చీకట్లోనే మగ్గాల్సిన పరిస్థితి. అందుకే వాళ్లు తెలంగాణనే కోరుకుంటున్నారు. ఇప్పటికే చాలామంది పైసాపైసా కూడబెట్టి భద్రాచలం, బూర్గంపాడు, వైరా, ఖమ్మం వంటి ప్రాంతాల్లో ఇండ్ల స్థలాలు తీసుకొన్నారు. రాయలసీమలోని అనేక ప్రాంతాల ప్రజల్లోనూ తెలంగాణ సెంటిమెంట్ ఉంది. హైదరాబాద్ మీద మమకారమూ ఉంది. ఒకరిద్దరు నాయకులు ప్రయివేటు చర్చల్లో తమ మనసులోని మాట చెబుతున్నారు. ఎక్కడో ఉన్న వైజాగ్ కంటే, దగ్గర్లోని హైదరాబాదే తమకు అనుకూలమని అంటున్నారు. రాష్ట్ర విభజన తర్వాత అపోహలతో వెళ్లిపోయినవారు కూడా, తట్టాబుట్టా సర్దుకుని హైదరాబాద్కు వచ్చేస్తున్నారు. సమర్థుడైన రాజు, సుస్థిరమైన రాజధాని.. రెండూ కరువైపోయిన బాధ ఆంధ్రుల మాటల్లో స్పష్టంగా తెలుస్తున్నది.
బతుకులు మార్చండి
తెలంగాణలో ఉంటే మాకు న్యాయం జరిగేది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. మమ్మల్ని తెలంగాణలో కలిపేయండి. ఇప్పటిదాకా తెలిసిచేశారో తెలియక చేశారో.. అదంతా వదిలేయండి. మేం మాత్రం తెలంగాణ బిడ్డలుగానే బతకాలనుకుంటున్నాం.
– ముత్యాల శేఖర్
ఎక్కడికో వెళ్తున్నాం
గిరిజన ప్రాంతంలో ప్రశాంతంగా బతికే వాళ్లం. ఖమ్మం జిల్లా నుంచి వేరుచేసి మమ్మల్ని ఆంధ్రాలో కలిపారు. తూర్పు గోదావరి జిల్లాకు చివరగా ఉన్నాం. ఇక్కడ పట్టించుకునే నాథుడే లేడు. ఇంకెన్నాళ్లీ కష్టాలు? వరదొస్తే తట్టాబుట్టా మోసుకొని ఎక్కడికో వెళ్లాల్సి వస్తున్నది.
– మండా దుర్గాప్రసాద్
✍ కేవీ రావు
తెలంగాణగె.. జయవాగలి!
కర్ణాటకలోని రాయచూరు జిల్లా తెలంగాణ సింహద్వారం గద్వాలకు చాలా దగ్గర. వాళ్ల చుట్టాలు, స్నేహితులు అంతా మనవాళ్లే. ఏ అవసరం ఉన్నా తెలంగాణ గడప తొక్కుతారు. తెలంగాణతో తమ జీవితాలు ఇంతగా ముడిపడి ఉన్నప్పుడు.. తామంతా తెలంగాణ బిడ్డలమైపోవాలని ఆశించడంలో తప్పేముంది? కాబట్టే, తెలంగాణలో కలిసేందుకు రాయచూరు ఓ రాచమార్గాన్ని కోరుతున్నది.
తెలంగాణలోని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల గురించి వింటూ, చదువుతూ క్రమంగా తెలంగాణ పట్ల మమకారాన్ని పెంచుకుంటున్నారు కర్ణాటక ప్రజలు. తెలంగాణ ప్రగతి ఫలాలను తామూ పొందాలన్న ఆలోచన వాళ్ల మనసులో మెదిలింది. రాయచూరు జిల్లాను తెలంగాణలో కలపడం ఒక్కటే పరిష్కారమనే నిర్ణయానికి వచ్చేశారు.
సంక్షేమంతో సాగిపోవాలని
కర్ణాటకలో వృద్ధాప్య పింఛను ఆరువందల రూపాయలు. అదే తెలంగాణలో 2,016 రూపాయలు. ఎన్నింతలు ఎక్కువ? ప్రజలు కూడా బేరీజు వేసుకొనే ఉంటారు. ఒక్క పింఛనే కాదు.. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్, రైతుబంధు, రైతుబీమా, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, రైతు రుణమాఫీ వంటి పథకాలనెన్నిటినో రోజూ చూస్తూనే ఉన్నారు వాళ్లు. ఆ పథకాలు తమకూ అందాలని కన్నడ కష్టజీవులు కోరుకోవడం దురాశేం కాదు. కానీ, అక్కడున్నది బీజేపీ ప్రభుత్వం. కాసులు, కార్పొరేట్లు, ఉద్వేగ రాజకీయాలు.. తప్ప జనంగోడు పట్టని పాలకుల పాదాల కింద నలిగిపోతున్నది ఆ ప్రాంతం. ‘ఇంకానా ఇకపై వద్దు..’ అంటూ తమనూ తెలంగాణలో కలపమని డిమాండ్ చేస్తున్నారు.
ముక్తకంఠంతో
తెలంగాణ అభివృద్ధిని యావత్ దేశమే ఆసక్తిగా చూస్తున్నది. సరిహద్దు రాష్ర్టాల నుంచీ ప్రశంసలు అందుతున్నాయి. ప్రజలే కాదు, ప్రజా ప్రతినిధులు సైతం తెలంగాణలో విలీనానికి పట్టుబడుతున్నారు. సాక్షాత్తు, రాయచూరు అర్బన్ ఎమ్మెల్యే శివరాజ్ పాటిల్ తాజాగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం జాతీయ స్థాయిలో చర్చనీయమైంది. తెలంగాణ పథకాల గురించి అక్కడి ప్రజల్లో చాలామందికి తెలుసు. ఇక హైదరాబాద్ కర్ణాటక ప్రాంతంలో ఉన్న రాయచూరు మొదటి నుంచీ నిర్లక్ష్యానికి గురైంది. ఎమ్మెల్యే శివరాజ్ పాటిల్ కూడా ఇదే మాట చెప్పారు. రాయచూరు జిల్లాలోని పలు గ్రామాలు, పట్టణాల ప్రజలు ఎమ్మెల్యే చెప్పింది వాస్తవమేనని అన్నారు. తమను ముమ్మాటికీ తెలంగాణలో కలిపి తీరాల్సిందే అని పట్టుబడుతున్నారు. సాంస్కృతికంగా కూడా రాయచూరుకు తెలంగాణతో అనుబంధం ఎక్కువ. ఇరు ప్రాంతాల మధ్య బంధాల వారధిగా కృష్ణానది పారుతున్నది. మాట్లాడేది కన్నడమే అయినా, మనలానే ఉర్దూ ప్రభావం అపారం. ఉన్న కొద్దిపాటి సారవంతమైన భూమి ఆంధ్రా క్యాంపుల అధీనంలోకి వెళ్లిపోయింది. దీంతో కొన్ని ప్రాంతాల్లో రాజకీయ పెత్తనమూ కృష్ణా గోదావరి జిల్లాల నుంచి వలసవచ్చిన కొన్ని సామాజిక వర్గాలదే. తెలంగాణలో చేరితే నీటి వసతి లభిస్తుంది, ముక్కారు పంటలు పండించుకోవచ్చు. పన్లోపనిగా ఆంధ్రుల పెత్తనాన్నీ వదిలించుకోవచ్చని రాయచూరు ప్రజల ఆలోచన.
అదృష్టవంతులు
మా ఆయన చనిపోయాడు. అప్పులు చేసి బిడ్డల పెండ్లిళ్లు చేసిన. ఒక్కదాన్నే కదా, పాత ఇంట్లోనే ఉందామని అనుకుంటే అదీ కూలిపోయింది. సర్కారు ఇచ్చే మొక్కుబడి డబ్బుతో ఇల్లు కట్టలేం. అదే తెలంగాణలో నాలాంటి పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తున్నారు. నిజంగా తెలంగాణోళ్లు అదృష్టవంతులు.
– శివమ్మ
మాకు ప్రగతి కావాలి
మాది కున్షి గ్రామం. రాయచూరులో స్థిరపడ్డాం. తెలంగాణలో గురుకులాలతో పేద విద్యార్థులకు ఉత్తమమైన విద్య అందుతున్నది. ఇలాంటి పథకాలు మా దగ్గర లేవు. మేం కూడా విద్య, వైద్యం, ఆర్థిక ప్రగతిలో ముందుండాలని కోరుకుంటున్నాం. అందుకే, తెలంగాణలో కలవాలని ఆశిస్తున్నాం.
-శివరాజ్
✍పెద్ది విజయభాస్కర్
మహారాష్ట్ర సరిహద్దులో మహా నినాదం! గోదావరికి ఇవతల సస్యశ్యామలం. అవతల బీడువారిన పొలాలు. ఒకటి తెలంగాణ. ఇంకోటి మహారాష్ట్ర. సాగు, సంక్షేమంతో సుభిక్షంగా వర్ధిల్లుతున్న తెలంగాణలోతమ ఊర్లనూ కలుపుకోవాలన్న బలమైన డిమాండ్ అక్కడ రోజురోజుకూ బలపడుతున్నది.
మూడేండ్ల క్రితం.. మహారాష్ట్ర ప్రజలు సరిహద్దు దాటి తెలంగాణలోకి వచ్చి ఆందోళన చేశారు. ఆ ఆందోళన తెలంగాణకు వ్యతిరేకంగా కాదు. సొంత రాష్ట్రంపైనే తిరుగుబాటు. నాందేడ్లో నలిగిపోతున్నామనీ.. నాగలి కట్టి వ్యవసాయం చేయలేకపోతున్నామనీ.. తమను తెలంగాణలో కలిపేస్తే సంతోషంగా ఏరువాక చేసుకుంటామని మొరపెట్టుకున్నారు. ఆ డిమాండ్ ఊరూరా వ్యాపించి ఉద్యమం లేపింది.-
బెల్లూర్ కథ..
మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ధర్మాబాద్ తాలుకా బెల్లూర్ గ్రామం. ఆ ఊరు దాటితే గోదావరి నది. గోదావరిని దాటితే, తెలంగాణలోని కందకుర్తి గ్రామం. గోదావరికి ఇవతల ఏడాది పొడవునా పచ్చని పైర్లతో పరుచుకొని ఉంటుంది. అవతలి వైపు వ్యవసాయ భూములు యాసంగి కాలంలో బీడుగా కనిపిస్తాయి. పక్కనే గోదావరి పారుతున్నా ఆ నీటిని ఎత్తిపోసుకునే సదుపాయం లేదు. మోటార్లు బిగించుకునైనా సరే పొలాల్లోకి నీళ్లు మళ్లించుకుందామంటే కరెంట్ లేదు. గోదావరికి ఇవతలి వైపున తెలంగాణలో సుమారుగా 23 ఎత్తిపోతల పథకాలు చేపట్టింది తెలంగాణ సర్కార్. వానాకాలం, యాసంగి అనే తేడా లేకుండా ఏడాది పొడవునా నీరు పారుతున్నది. బెల్లూర్లోని 1,500 మందికి వ్యవసాయమే జీవనాధారం. చుట్టూ 5 వేల ఎకరాల భూములున్నాయి. కానీ రెండు పంటలూ వేయలేని పరిస్థితి. వానాకాలం పంట మాత్రమే తీస్తారు. అది కూడా.. పత్తి, శనగ, కందులు, సోయాబీన్. యాసంగిలో సాగు చేయాలంటే గుండెలో దడ. నీళ్ల పారకం లేని భూమిలో పంటలు వేసి నష్టాలు చూడలేక వెనుకడుగు వేస్తుంటారు. ఇదొక్క బెల్లూర్ కథనే కాదు. నాయగావ్ అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రజలందరి అనుభవం కూడా. నిజామాబాద్ జిల్లాతో దగ్గరి సంబంధాలు కలిగి ఉన్న నాయగావ్ నియోజకవర్గంలోని చాలా గ్రామాల ప్రజలు తెలంగాణలో కలవడానికి ఆసక్తి చూపుతున్నారు. మరాఠా బంధాన్ని తెంచుకునేందుకు సిద్ధపడుతున్నారు.
2019లో ఒక సమావేశం
నాందేడ్ జిల్లాలో ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటన్నిటినీ తెలంగాణలో విలీనం చేయడానికి అక్కడి ప్రజలు, నాయకులు ఆసక్తి చూపుతున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిసి తమ ఆకాంక్షనూ తెలియజేశారు. ఈ మేరకు సెప్టెంబర్ 18, 2019న ఒక సమావేశం జరిగింది. ఆ సమావేశంలో నాయగావ్, భోకర్, దెగ్లూర్, కిన్వత్, హత్గావ్ అసెంబ్లీ నియోజకవర్గాల రైతులు, ప్రజలు పాల్గొని తెలంగాణలో కలిసేందుకు ఆసక్తి ఉన్నట్లు ముక్తకంఠంతో వివరించారు. బాబ్లీ సర్పంచ్ బాబురావు నేతృత్వంలో కేసీఆర్ను కలిశారు. 2019 ఎన్నికల్లో ధర్మాబాద్లో టీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించారు.
వ్యవసాయమే ప్రధాన ఆకర్షణ
తెలంగాణ అవతరణ తర్వాత రాష్ట్రంలో సేద్యం పండగలా మారింది. వ్యవసాయ, సంక్షేమ పథకాలు రైతుకు చింత లేకుండా చేస్తున్నాయి. సర్కారు పెట్టుబడి సాయంగా ఎకరానికి రూ.10వేలు చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నది. మహారాష్ట్ర ప్రజలను ఆకట్టుకుంటున్నది ఈ పథకమే. వాస్తవానికి మహారాష్ట్రలో రైతన్నది దయనీయ పరిస్థితి. పంట వేసినప్పటి నుంచి చేతికొచ్చే వరకు ప్రతీ దశలో దళారులదే రాజ్యం. రైతుకు లాభం చేకూరడం లేదు. కానీ, మన దగ్గర ప్రభుత్వమే నేరుగా పెట్టుబడి సాయం అందజేస్తుంది. ప్రమాదవశాత్తు రైతు చనిపోతే, బీమా రూపంలో కుటుంబానికి రూ. 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇస్తున్నది. తెలంగాణలో ఉన్నట్టే.. 24గంటల ఉచిత కరెంటు, నిరంతర సాగునీటి సౌలభ్యం తమకూ కావాలని కోరుకుంటున్నారు నాందేడ్ ప్రజలు. ఏ ఊర్లో చూసినా ఇదే చర్చ. నాయగావ్, దెగ్లూర్ నియోజవర్గాల్లోని రైతులు కూడా తెలంగాణ సంక్షేమం పట్ల ఆకర్షితులవుతున్నారు. ఈ గిరిజన గ్రామాలు జిల్లా కేంద్రం నాందేడ్కు 300 కి.మీ దూరంలో ఉన్నాయి. జిల్లా కేంద్రం నుంచి ముంబై మహానగరం 500 కిలోమీటర్లు. అదే హైదరాబాద్ అయితే 300 కిలోమీటర్లే. కాబట్టి, తెలంగాణలో విలీనమే పరిష్కారమని అనుకుంటున్నారు ప్రజలు. ప్రజలకు పాలకుడు, రాజధాని చేరువలో ఉండాలని చెబుతాడు చాణక్యుడు. నాందేడ్ ప్రజల ఆకాంక్ష కూడా ఇదే.
మంచిగా చేస్తున్నారు
మా చుట్టాలంతా తెలంగాణలోనే ఉంటారు. మేం నిత్యం ఏదో ఒక పనిమీద తెలంగాణకు వస్తూనే ఉంటాం. రైతాంగాన్ని బతికించేందుకు కేసీఆర్ సారు చేస్తున్న కృషిని చూసి, మేం కూడా తెలంగాణలో కలిస్తే బాగుంటుందని అనిపిస్తున్నది.
– పార్వతీ బాయి
✍ జూపల్లి రమేష్ రావు
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి