– జంక్షన్ బాక్స్లు ధ్వంసం చేసి రూ.25 లక్షల విలువైన విద్యుత్ వైర్ల అపహరణ
భువనగిరి అర్బన్, జూన్ 06 : యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో భారీ చోరీ ఘటన వెలుగు చూసింది. గుర్తు తెలియని దుండగులు రాత్రి వేళ మార్కెట్ ప్రాంగణంలోకి ప్రవేశించి విద్యుత్ వ్యవస్థకు సంబంధించిన జంక్షన్ బాక్స్లను ధ్వంసం చేసి సుమారు రూ.25 లక్షల విలువ గల విద్యుత్ వైర్లను శుక్రవారం రాత్రి ఎత్తుకెళ్లినట్లు అధికారులు తెలిపారు. సమాచారం ప్రకారం ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో ఏర్పాటు చేసిన విద్యుత్ సరఫరా వ్యవస్థలో భాగంగా ఉన్న జంక్షన్ బాక్స్లను దుండగులు లక్ష్యంగా చేసుకున్నారు. ముందుగా విద్యుత్ కనెక్షన్లను ధ్వంసం చేసి, విద్యుత్ వైర్లను కత్తిరించి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. శనివారం ఉదయం విధులకు వచ్చిన సిబ్బంది జంక్షన్ బాక్స్లు ధ్వంసమై ఉండడాన్ని గమనించి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు.
ఘటన స్థలాన్ని పరిశీలించిన అధికారులు ప్రాథమిక అంచనాల ప్రకారం సుమారు రూ.25 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు పేర్కొన్నారు. మార్కెట్లో విద్యుత్ సరఫరా వ్యవస్థకు అంతరాయంతో పాటు ప్రభుత్వ ఆస్తికి భారీ నష్టం సంభవించిందని తెలిపారు. ఇంత పెద్ద మొత్తంలో విద్యుత్ వైర్లు చోరీ కావడం స్థానికంగా సంచలనం రేపింది. మార్కెట్ వంటి కీలక ప్రభుత్వ ప్రాంగణంలో భద్రతా లోపాలు ఎలా చోటు చేసుకున్నాయనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాత్రి వేళల్లో నిఘా, సీసీ కెమెరాల పర్యవేక్షణ, భద్రతా సిబ్బంది విధులపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఘటనపై మార్కెట్ అధికారులు సంబంధిత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. చోరీ జరిగిన ప్రాంతంలోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తూ దుండగుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నేరంలో పాల్గొన్న వారిని త్వరలోనే గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ప్రభుత్వ ఆస్తుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ వంటి ప్రధాన కేంద్రాల్లో రాత్రి వేళల్లో నిఘాను మరింత కట్టుదిట్టం చేయాలని ప్రజలు కోరుతున్నారు.