తెలంగాణగె.. జయవాగలి!
కర్ణాటకలోని రాయచూరు జిల్లా తెలంగాణ సింహద్వారం గద్వాలకు చాలా దగ్గర. వాళ్ల చుట్టాలు, స్నేహితులు అంతా మనవాళ్లే. ఏ అవసరం ఉన్నా తెలంగాణ గడప తొక్కుతారు. తెలంగాణతో తమ జీవితాలు ఇంతగా ముడిపడి ఉన్నప్పుడు.. తామంతా తెలంగాణ బిడ్డలమైపోవాలని ఆశించడంలో తప్పేముంది? కాబట్టే, తెలంగాణలో కలిసేందుకు రాయచూరు ఓ రాచమార్గాన్ని కోరుతున్నది.
తెలంగాణలోని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల గురించి వింటూ, చదువుతూ క్రమంగా తెలంగాణ పట్ల మమకారాన్ని పెంచుకుంటున్నారు కర్ణాటక ప్రజలు. తెలంగాణ ప్రగతి ఫలాలను తామూ పొందాలన్న ఆలోచన వాళ్ల మనసులో మెదిలింది. రాయచూరు జిల్లాను తెలంగాణలో కలపడం ఒక్కటే పరిష్కారమనే నిర్ణయానికి వచ్చేశారు.
సంక్షేమంతో సాగిపోవాలని
కర్ణాటకలో వృద్ధాప్య పింఛను ఆరువందల రూపాయలు. అదే తెలంగాణలో 2,016 రూపాయలు. ఎన్నింతలు ఎక్కువ? ప్రజలు కూడా బేరీజు వేసుకొనే ఉంటారు. ఒక్క పింఛనే కాదు.. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్, రైతుబంధు, రైతుబీమా, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, రైతు రుణమాఫీ వంటి పథకాలనెన్నిటినో రోజూ చూస్తూనే ఉన్నారు వాళ్లు. ఆ పథకాలు తమకూ అందాలని కన్నడ కష్టజీవులు కోరుకోవడం దురాశేం కాదు. కానీ, అక్కడున్నది బీజేపీ ప్రభుత్వం. కాసులు, కార్పొరేట్లు, ఉద్వేగ రాజకీయాలు.. తప్ప జనంగోడు పట్టని పాలకుల పాదాల కింద నలిగిపోతున్నది ఆ ప్రాంతం. ‘ఇంకానా ఇకపై వద్దు..’ అంటూ తమనూ తెలంగాణలో కలపమని డిమాండ్ చేస్తున్నారు.
ముక్తకంఠంతో
తెలంగాణ అభివృద్ధిని యావత్ దేశమే ఆసక్తిగా చూస్తున్నది. సరిహద్దు రాష్ర్టాల నుంచీ ప్రశంసలు అందుతున్నాయి. ప్రజలే కాదు, ప్రజా ప్రతినిధులు సైతం తెలంగాణలో విలీనానికి పట్టుబడుతున్నారు. సాక్షాత్తు, రాయచూరు అర్బన్ ఎమ్మెల్యే శివరాజ్ పాటిల్ తాజాగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం జాతీయ స్థాయిలో చర్చనీయమైంది. తెలంగాణ పథకాల గురించి అక్కడి ప్రజల్లో చాలామందికి తెలుసు. ఇక హైదరాబాద్ కర్ణాటక ప్రాంతంలో ఉన్న రాయచూరు మొదటి నుంచీ నిర్లక్ష్యానికి గురైంది. ఎమ్మెల్యే శివరాజ్ పాటిల్ కూడా ఇదే మాట చెప్పారు. రాయచూరు జిల్లాలోని పలు గ్రామాలు, పట్టణాల ప్రజలు ఎమ్మెల్యే చెప్పింది వాస్తవమేనని అన్నారు. తమను ముమ్మాటికీ తెలంగాణలో కలిపి తీరాల్సిందే అని పట్టుబడుతున్నారు. సాంస్కృతికంగా కూడా రాయచూరుకు తెలంగాణతో అనుబంధం ఎక్కువ. ఇరు ప్రాంతాల మధ్య బంధాల వారధిగా కృష్ణానది పారుతున్నది. మాట్లాడేది కన్నడమే అయినా, మనలానే ఉర్దూ ప్రభావం అపారం. ఉన్న కొద్దిపాటి సారవంతమైన భూమి ఆంధ్రా క్యాంపుల అధీనంలోకి వెళ్లిపోయింది. దీంతో కొన్ని ప్రాంతాల్లో రాజకీయ పెత్తనమూ కృష్ణా గోదావరి జిల్లాల నుంచి వలసవచ్చిన కొన్ని సామాజిక వర్గాలదే. తెలంగాణలో చేరితే నీటి వసతి లభిస్తుంది, ముక్కారు పంటలు పండించుకోవచ్చు. పన్లోపనిగా ఆంధ్రుల పెత్తనాన్నీ వదిలించుకోవచ్చని రాయచూరు ప్రజల ఆలోచన.
అదృష్టవంతులు
మా ఆయన చనిపోయాడు. అప్పులు చేసి బిడ్డల పెండ్లిళ్లు చేసిన. ఒక్కదాన్నే కదా, పాత ఇంట్లోనే ఉందామని అనుకుంటే అదీ కూలిపోయింది. సర్కారు ఇచ్చే మొక్కుబడి డబ్బుతో ఇల్లు కట్టలేం. అదే తెలంగాణలో నాలాంటి పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తున్నారు. నిజంగా తెలంగాణోళ్లు అదృష్టవంతులు.
మాకు ప్రగతి కావాలి
మాది కున్షి గ్రామం. రాయచూరులో స్థిరపడ్డాం. తెలంగాణలో గురుకులాలతో పేద విద్యార్థులకు ఉత్తమమైన విద్య అందుతున్నది. ఇలాంటి పథకాలు మా దగ్గర లేవు. మేం కూడా విద్య, వైద్యం, ఆర్థిక ప్రగతిలో ముందుండాలని కోరుకుంటున్నాం. అందుకే, తెలంగాణలో కలవాలని ఆశిస్తున్నాం.
-శివరాజ్