కూసుమంచి, జూలై 23: బోర్లు, బావుల్లో ఇప్పుడు కొంత నీరు ఉన్నప్పటికీ మున్ముందు ఇంకిపోయి భూగర్భ జలాలు ఇంకా తగ్గే ప్రమాదం ఉందని డీఏవో పులయ్య అన్నారు. అందుకని, ఇప్పుడున్న నీటి వనరులను చూసి రైతులెవరూ వరి పంటను వేయవద్దని సూచించారు. ఎల్ నినో ప్రభావంతో భూగర్భ జలాలు పూర్తిగా తగ్గితే వరి పంటకు నీరు అందదని అన్నారు. కాబట్టి వరి వేయకుండా స్వల్పకాలిక పంటలు వేసుకోవాలని రైతులను కోరారు.
కూసుమంచి మండలం కిష్టాపురంలో గురువారం జరిగిన రైతు అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పెసర, కంది, మినుము, వేరుశనగ వంటి పంటలను వేసుకోవాలని సూచించారు. రైతులు పొలాలు, చేలల్లో పల్లపు ప్రాంతాల్లో ఫారంపాండ్స్ తీసుకోవాలన్నారు.సర్పంచ్ సైదులు, ఏవో రామడుగు వాణి, ఏఈవో వాణి తదితరులు పాల్గొన్నారు.