తిమ్మాపూర్/ కరీంనగర్ విద్యానగర్/ గన్నేరువరం, జూలై 23 : మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పీఏ మురళీధర్రెడ్డి వేధింపుల వల్లే గుండ్లపల్లి మాజీ సర్పంచ్ భర్త, కాంగ్రెస్ నాయకుడు రాజేందర్రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడంటూ కుటుంబ సభ్యులు, బంధువులు ఆగ్రహించారు. కవ్వంపల్లి పీఏ అరాచకాలతో రాజిరెడ్డి ఈ నెల 14న ఎల్ఎండీలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట ఆత్మహత్యకు యత్నించాడని, గురువారం తెల్లవారుజామున ప్రైవేట్ హాస్పిటల్లో పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయాడంటూ భగ్గుమన్నారు. మృతదేహాన్ని ప్రభుత్వ దవాఖానకు తరలించగా, అక్కడే ఆందోళనకు దిగారు.
ఆత్మహత్యకు బాధ్యులైన పీఏ మురళీధర్రెడ్డితో పాటు మరో నలుగురిపై కేసు నమోదు చేయాలని, పీఏను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అప్పటి వరకు మృతదేహాన్ని తరలించే ప్రసక్తే లేదని తెగేసి చెప్పారు. ఒక దశలో దవాఖాన ఎదుట ప్రధాన రోడ్డుపై ధర్నా చేశారు. అరగంటకుపైగా అక్కడే బైఠాయించారు. దీంతో పోలీసులు దిగొచ్చి.. కుటుంబసభ్యులతో మాట్లాడి రాజేందర్ రెడ్డి భార్య సమత నుంచి ఫిర్యాదు తీసుకున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే పీఏ వంగాల మురళీధర్రెడ్డితో పాటు మహ్మద్ షాదీక్, వంగాల రవీందర్రెడ్డి, పైడిమల్ల మల్లేశం, బిగుళ్ల శ్రవణ్పై ఎల్ఎండీ పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేశారు.

అందుకు తగిన ఎఫ్ఐఆర్ కాఫీని ఏసీపీ విజయ్కుమార్ అందించగా, మురళీధర్రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయలేదో చెప్పాలంటూ పోలీసులను ప్రశ్నించారు. ఆయనపై అంత ఊదారత ఎందుకు చూపుతున్నారని నిలదీశారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో బాధితులు కొంత తగ్గారు. ఆ తర్వాత పోలీస్ పహారా మధ్య రాజేందర్రెడ్డి మృతదేహాన్ని అంబులెన్స్లో గుండ్లపల్లికి తరలించారు. నేరుగా ఆయన ఇంటికే తీసుకెళ్లారు.
ఇదే సమయంలో కుటుంబసభ్యులు, బంధువులు, గ్రామస్తులు రాజీవ్ రహదారిని దిగ్బంధించారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినదించారు. అనంతరం రాజేందర్రెడ్డి ఇంటికి సమీపంలో ఉన్న మురళీధర్రెడ్డి ఇంటిపై దాడికి యత్నించారు. అప్పటికే పోలీసులు పెద్ద ఎత్తున చేరుకొని కట్టడి చేశారు. స్వల్ప లాఠీచార్జి చేస్తూ చెదరగొట్టారు. అనంతరం పోలీస్ పహారా మధ్యన రాత్రి సమయంలో రాజేందర్రెడ్డి మృతదేహానికి అంత్యక్రియలు పూర్తి చేశారు.
న్యాయం చేయకపోతే చచ్చిపోతం : బేతెల్లి సమత (రాజేందర్రెడ్డి భార్య)
ఎమ్మెల్యే పీఏ మురళీధర్రెడ్డి వేధింపుల కారణంగానే తన భర్త రాజేందర్రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడని బేతెల్లి సమత రోదించింది. తన భర్త ఆత్మహత్యకు కారకులను వెంటనే అరెస్ట్ చేసి, న్యాయం చేయాలని వేడుకున్నది. లేదంటే నా బిడ్డ, కొడుకుతో కలిసి ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ ఎదుట పురుగుల మందుతాగి చనిపోతామని హెచ్చరించింది.
రాజేందర్రెడ్డిది ఆత్మహత్య కాదు.. హత్యే

ఎమ్మెల్యే పీఏ అరాచకాలతో ఆత్మహత్య చేసుకున్న రాజేందర్రెడ్డిది హత్యేనని మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ధ్వజమెత్తారు. ఆయన కుటుంబానికి న్యాయం జరిగే వరకూ బీఆర్ఎస్ పక్షాన ప్రత్యక్షంగా పోరాటంలోకి దిగుతామని హెచ్చరించారు. తాను అమెరికా నుంచి రాగానే అండగా ఉంటానని స్పష్టం చేశారు. తమకు పార్టీలతో సంబంధం లేదని, రాజేందర్రెడ్డి కుటుంబానికి న్యాయం చేయాలని, ఆ బాధ్యత ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ తీసుకోవాలని సూచించారు. ఈ మేరకు అమెరికాలో ఉన్న ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు.
రాజేందర్రెడ్డి మరణం బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. గ్రామానికి ఏం చేశావని రాజేందర్రెడ్డి వాట్సాప్లో ప్రశ్నిచడంతో కక్షకట్టి అట్రాసిటీ కేసు నమోదు చేయించారని ఆరోపించారు. దీంతో రాజేందర్రెడ్డి ఆవేదనకులోనై ఎమ్మెల్యేకు చెప్పుకొనేందుకు వెళ్తే కనీసం స్పందించకపోవడంతో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడన్నారు. ఆత్మహత్యాయత్నం చేసుకున్న వ్యక్తిపై సానుభూతితో ఉండాల్సింది పోయి రాజేందర్రెడ్డినే తాగుబోతు అని ఎమ్మెల్యే చులకన చేశాడని గుర్తు చేశారు. ఇప్పటికైనా రాజేందర్రెడ్డి మృతికి కారకులపై కేసు నమోదు చేసి రిమాండ్ చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ను నమ్మి పార్టీలో చేరితే ప్రాణాలు పోయేలా చేసిన వారిపై సీఎం రేవంత్రెడ్డి సీరియస్గా చర్యలు తీసుకోవాలన్నారు.