– చండూర్ పోలీస్ స్టేషన్, సర్కిల్ ఆఫీస్ వార్షిక తనిఖీ
చండూరు, సెప్టెంబర్ 18 : పెండింగ్ కేసుల సత్వర పరిష్కారం, నాణ్యమైన దర్యాప్తు, ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించడమే లక్ష్యంగా సిబ్బంది పని చేయాలని నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు. శుక్రవారం చండూర్ పోలీస్ స్టేషన్, సర్కిల్ ఆఫీస్ ను వార్షిక తనిఖీలో భాగంగా ఆయన తనిఖీ చేశారు. స్టేషన్ పరిసరాలు, రిసెప్షన్, సిబ్బంది విధుల నిర్వహణ, రికార్డు గదులు, సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుల వివరాలు, పెండింగ్ కేసులు, దర్యాప్తులో ఉన్న కేసులు, పెండింగ్ ట్రయల్ కేసులు, కోర్టు కేసుల వివరాలను పరిశీలించి, కేసుల దర్యాప్తు పురోగతిపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తు చేపట్టి, ఆధారాలను పకడ్బందీగా సేకరించి, నిర్ణీత సమయంలో చార్జిషీట్లు దాఖలు చేయాలని అధికారులకు సూచించారు.
అదేవిధంగా స్టేషన్లోని క్రైమ్ రిజిస్టర్, జనరల్ డైరీ, ఎఫ్ఐఆర్ రిజిస్టర్, సీడీ ఫైల్స్, కోర్టు కేసుల రికార్డులు, స్టేషన్ రికార్డులు, బీట్ బుక్స్ తదితర రికార్డులను ఆయన పరిశీలించారు.పోలీస్ స్టేషన్ పరిధిలోని సమస్యాత్మక ప్రాంతాలు, నేరాలకు అవకాశం ఉన్న ప్రాంతాలు, గతంలో నేరాలు జరిగిన ప్రదేశాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రజలు పోలీస్ స్టేషన్కు వచ్చినప్పుడు వారి సమస్యలను గౌరవంగా విని, చట్టపరమైన పరిధిలో తక్షణమే స్పందించాలని సిబ్బందికి సూచించారు. ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ, పోలీస్ శాఖపై ప్రజల్లో మరింత నమ్మకం పెరిగే విధంగా విధులు నిర్వహించాలని తెలిపారు. అనంతరం స్టేషన్ పరిధిలో ఎస్పీ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ వెంట నల్లగొండ డిఎస్పీ శివరాం రెడ్డి, చండూర్ సీఐ రాము, ఎస్.ఐ శివకుమార్ ఉన్నారు.

ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి : ఎస్పీ శరత్ చంద్ర పవార్