ఆంధ్రాలో.. జై తెలంగాణ!
ఒక రాష్ట్ర అవసరాల కోసం, మరో రాష్ట్ర ప్రజల మనోభావాలను పట్టించుకోకుండా, భావోద్వేగాలను బలిపెట్టి మరీ.. కలిపేయడం అప్రజాస్వామికం. తెలంగాణలోని ఏడు మండలాలకు ఆంధ్రా పోలవరం శాపమైంది. ఒక్క కలంపోటుతో ఆంధ్రాలో కలిపేశారు. వాళ్లంతా మనసొక చోట, బతుకొకచోట.. అన్నట్టు బతుకుతున్నారు. తమను తెలంగాణలో కలిపేయమని కోరుతున్నారు. వీళ్లే కాదు, పోలవరంకారణంగా నిర్వాసితులైన లక్షలమంది ఆంధ్రా ప్రజల అభ్యర్థనా ఇదే.
ఆంధ్రాలో సాగునీటి సౌలభ్యం కోసం నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు పనులకు అవరోధం లేకుండా.. తెలంగాణ ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్లో చేర్చింది కేంద్రం. అలా, తెలంగాణ అభివృద్ధి ఫలాలు ఆ మండలాలకు దక్కకుండా చేసింది. ప్రాజెక్టు పుణ్యమాని నిర్వాసితులైన లక్షల మంది ఆంధ్రా ప్రజలకు కూడా పొరుగున ఉన్న తెలంగాణ.. నీడనిచ్చే పెద్దన్నలా అనిపిస్తున్నది, అన్నపూర్ణలా కనిపిస్తున్నది. ‘మమ్మల్నీ తెలంగాణలో కలపండి’ అనిపించేలా చేస్తున్నది.
పునరావాసం కోసం
పోలవరం ప్రాజెక్టు పనుల వల్ల ఏటా వానాకాలంలో ఏడు మండలాలు ముంపులోనే ఉంటున్నాయి. దీంతో నిర్వాసితులు ఎత్తు ప్రాంతాల్లో తలదాచుకోవాల్సిన పరిస్థితి. ఇప్పటికే తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో సుమారు రెండు లక్షల కుటుంబాలవారు నిర్వాసితులుగా మారారు. వారికి భద్రాచలం, బూర్గంపాడు, అశ్వారావుపేట మండలాలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. సర్కారువైపు నుంచి కొంత పరిహారం ఇచ్చారు కానీ, పునరావాసం కల్పించడంలో జాప్యం జరిగింది. అటవీ ప్రాంతంలో పునరావాసం కల్పిస్తామని చెప్పడంతో వాళ్లెవరూ అంతదూరం వెళ్లడానికి సిద్ధంగా లేరు. దీర్ఘకాల అనుబంధం ఉన్న తెలంగాణలో కలిసేందుకు సుముఖత చూపిస్తున్నారు. పరిహారం తీసుకున్నా, తెలంగాణలోనే స్థిరపడాలనేది చిరకాల వాంఛ. అవసరమైతే పెద్ద ఎత్తున ఉద్యమం చేసేందుకూ వారు సిద్ధంగా ఉన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం కేసీఆర్ అనుసరించిన వ్యూహాన్ని తామూ యథాతథంగా అమలు చేస్తామని చెబుతున్నారు.
ఇండ్ల స్థలాలతో సిద్ధం
భద్రాచలం డివిజన్ పరిధిలోని విఆర్పురం, కూనవరం, చింతూరు మండలాలను తూర్పు గోదావరి జిల్లాలో కలిపారు. అశ్వారావుపేట డివిజన్ పరిధిలోని వేలేరుపాడు, కుక్కునూరు మండలాలను పశ్చిమ గోదావరి జిల్లాలో కలిపారు. భద్రాచలం మండలంలో ఉన్న నెల్లిపాక, గౌరిదేవి పేట, తోటపల్లి, ఎటపాక గ్రామాలనూ తూగోలో తోసేశారు. పోలవరం ముంపు కిందికి వెళ్లిన తర్వాత ఆయా మండలాల అభివృద్ధి ఒకతరం వెనక్కి వెళ్లిపోయింది. నిధుల్లేక ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. వరదలొచ్చినా, వానలొచ్చినా చీకట్లోనే మగ్గాల్సిన పరిస్థితి. అందుకే వాళ్లు తెలంగాణనే కోరుకుంటున్నారు. ఇప్పటికే చాలామంది పైసాపైసా కూడబెట్టి భద్రాచలం, బూర్గంపాడు, వైరా, ఖమ్మం వంటి ప్రాంతాల్లో ఇండ్ల స్థలాలు తీసుకొన్నారు. రాయలసీమలోని అనేక ప్రాంతాల ప్రజల్లోనూ తెలంగాణ సెంటిమెంట్ ఉంది. హైదరాబాద్ మీద మమకారమూ ఉంది. ఒకరిద్దరు నాయకులు ప్రయివేటు చర్చల్లో తమ మనసులోని మాట చెబుతున్నారు. ఎక్కడో ఉన్న వైజాగ్ కంటే, దగ్గర్లోని హైదరాబాదే తమకు అనుకూలమని అంటున్నారు. రాష్ట్ర విభజన తర్వాత అపోహలతో వెళ్లిపోయినవారు కూడా, తట్టాబుట్టా సర్దుకుని హైదరాబాద్కు వచ్చేస్తున్నారు. సమర్థుడైన రాజు, సుస్థిరమైన రాజధాని.. రెండూ కరువైపోయిన బాధ ఆంధ్రుల మాటల్లో స్పష్టంగా తెలుస్తున్నది.
బతుకులు మార్చండి
తెలంగాణలో ఉంటే మాకు న్యాయం జరిగేది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. మమ్మల్ని తెలంగాణలో కలిపేయండి. ఇప్పటిదాకా తెలిసిచేశారో తెలియక చేశారో.. అదంతా వదిలేయండి. మేం మాత్రం తెలంగాణ బిడ్డలుగానే బతకాలనుకుంటున్నాం.
ఎక్కడికో వెళ్తున్నాం
గిరిజన ప్రాంతంలో ప్రశాంతంగా బతికే వాళ్లం. ఖమ్మం జిల్లా నుంచి వేరుచేసి మమ్మల్ని ఆంధ్రాలో కలిపారు. తూర్పు గోదావరి జిల్లాకు చివరగా ఉన్నాం. ఇక్కడ పట్టించుకునే నాథుడే లేడు. ఇంకెన్నాళ్లీ కష్టాలు? వరదొస్తే తట్టాబుట్టా మోసుకొని ఎక్కడికో వెళ్లాల్సి వస్తున్నది.