Mojtaba Khamenei : అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సంతకానికి ఎలాంటి విలువ లేదని ఇరాన్ సుప్రీం లీడర్ (Iran Supreme Leader) మొజ్తబా ఖమేనీ (Mojataba Khamenei) ఎద్దేవా చేశారు. ఇటీవల ఇరాన్-అమెరికా (Iran-US) మధ్య కుదిరిన తాత్కాలిక శాంతి అవగాహన ఒప్పందాన్ని అమెరికానే ఉల్లంఘించిందని విమర్శించారు. ఈ ఉల్లంఘనతో ట్రంప్ సంతకం విలువలేనిదనే విషయం రుజువైందంటూ సెటైర్ వేశారు. ఇరాన్ ప్రజలను ఉద్దేశించి తాజాగా విడుదల చేసిన సందేశంలో ఖమేనీ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ ఏడాది జూన్ 18న ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్య కుదిరిన ఎంఓయూను అమెరికా పదేపదే ఉల్లంఘిస్తోందని ఖమేనీ విమర్శించారు. ఈ చర్యతో అమెరికా అసలు స్వరూపం మరోసారి బయటపడిందని, ఒప్పందాలను ఉల్లంఘించడం, ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవడం ఆ దేశ వైఖరికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. అమెరికా యుద్ధోన్మాదాన్ని కొనసాగిస్తూ ఇరాన్పై మరింత ఒత్తిడి తీసుకురావాలని ప్రయత్నిస్తే మరచిపోలేని గుణపాఠం నేర్పుతామని ఖమేనీ హెచ్చరించారు. రెసిస్టెన్స్ ఫోర్సెస్తో కలిసి తగిన సమాధానం ఇస్తామని స్పష్టంచేశారు.
ఈ తాత్కాలిక ఒప్పందం ప్రకారం.. 60 రోజుల్లో తుది ఒప్పందంపై ఇరుదేశాలు చర్చలు జరపాల్సి ఉంది. అయితే ఇటీవల ఇరాన్పై అమెరికా వరుసగా దాడులు చేసింది. ప్రతిగా ఇరాన్ కూడా గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడులకు పాల్పడింది. దాంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. అమెరికా ఇప్పటికే ఒప్పందంలోని నిబంధనలను ఉల్లంఘించినందున తాము కూడా ఎంఓయూ కింద ఉన్న నియమాల అమలును నిలిపివేసినట్లు ఇరాన్ ఉప విదేశాంగ మంత్రి కాజెమ్ ఘరీబాబాది తెలిపారు.
ప్రస్తుతం తమ ప్రాధాన్యం దేశ రక్షణేనని, చర్చల గురించి ఎలాంటి ప్రక్రియ కొనసాగడం లేదని ప్రభుత్వ టెలివిజన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.