రాజన్న సిరిసిల్ల : పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టాలి. గత 2014 నుంచి 2019 వరకు కరీంనగర్కు వెయ్యి కోట్లతో స్మార్ట్ సిటీ తీసుకొచ్చానని బీఆర్ఎస్ కరీంనగర్(Karimnagar) పార్లమెంట్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్(Vinod Kumar) అన్నారు. ఆదివారం జిల్లాలోని చందుర్తి, వేములవాడ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక చాలా అభివృద్ధి చేశామన్నారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు పూర్వపు పాత జిల్లాలను కలుపుకుని రాష్ట్రంలో 33 జిల్లాలు ఏర్పాటు చేశారు.
రైతులు అవస్థలు పడొద్దని రైతుబంధు పథకానికి రూపకల్పన చేశారు. రైతుకు పెట్టుబడి ఇచ్చే ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేదన్నారు. రైతులకు నార్లు పోసేప్పుడు ఇవ్వాల్సిన రైతుబంధు వరి కోతల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుందని మండిపడ్డారు. నాలుగు నెలల కాంగ్రెస్ పాలనలో ప్రాజెక్టులు, చెరువులు ఎండినయి. కాంగ్రెస్ అసమర్థతతోనే రాష్ట్రంలో కరువు వచ్చిందని ఆరోపించారు. నదుల అనుసంధానం పేరుతో కేంద్రం కుట్ర రాజకీయాలు చేస్తున్నారు.
బండి సంజయ్ ఎప్పుడైనా తెలంగాణ కోసం ఒక్క మాట మాట్లాడలేదన్నారు. బండి సంజయ్ ఒక్క గుడి తేలేదు..బడి తేలేదు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో జాతీయ రహదారులు తాను తీసుకొచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. నలుగురు బీజేపీ ఎంపీలు, ముగ్గురు కాంగ్రెస్ ఎంపీలు గెలిచి ఒక్క సారి కూడా నవోదయ పాఠశాల కోసం ఒక్క మాట మాట్లాడలేదని విమర్శించారు. కరీంనగర్లో రూ.50కోట్లతో తిరుమల తిరుపతి దేవస్థానం కడుతున్నాం.
కొండగట్టు ఆలయానికి 334 ఎకరాల ప్రభుత్వ భూమిని అప్పగించామన్నారు. రైతుల పట్ల కేవలం బీఆర్ఎస్కే ప్రేమ ఉందని చెప్పారు. కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా పని చేస్తా..ప్రజలకు అందుబాటులో ఉంటాను. కరీంనగర్ యువత కోసం అంతర్జాతీయ స్థాయిలో ఉన్న స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ (Skill development center) తీసుకొస్తానని హామీనిచ్చారు. యువత ఆలోచించి ఓటెయ్యాలని విజ్ఞప్తి చేశారు.