Telangana Cabinet | హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఈ నెల 18న సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. ప్రధానంగా ఏపీ, తెలంగాణ మధ్య పెండింగ్ అంశాలపై కేబినెట్ చర్చించనున్నట్లు సమాచారం. సమగ్ర నివేదిక తయారు చేయాలని అధికారులను సీఎం రేవంత్ ఇప్పటికే ఆదేశించారు. అదేవిధంగా రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లపై కేబినెట్ చర్చించే అవకాశం ఉంది. జూన్ 2 తరువాత హైదరాబాద్లో ఏపీకి కేటాయించిన భవనాలను అధీనంలోకి తీసుకోవాలని అధికారులకు సీఎం సూచించారు. ఉద్యోగుల బదిలీలు వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. విద్యుత్ సంస్థల బకాయిల వివరాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. ఇక ధాన్యం కొనుగోలు, వ్యవసాయం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులతో సచివాలయంలో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే.