హైదరాబాద్ : కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యాన్ని(Grains) వెంటనే మిల్లులకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి (Shantikumari) జిల్లాల కలెక్టర్లకు ఆదేశించారు. జిల్లా కలెక్టర్లతో శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆమె మాట్లాడారు.
వర్షంలో తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టడానికి కొంత మంది జిల్లాల కలెక్టర్లు(Collectors) తీసుకున్న చర్యలను సీఎస్ అభినందించారు. ఇదే విధానాన్ని అనుకరించి రాష్ట్ర వ్యాప్తంగా రైతులు నష్టపోకుండా ఉండేలా అన్ని జిల్లాల కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని సూచించారు. పాఠశాలలు (Schools) పున:ప్రారంభమయ్యే తేదీ జూన్ 12 లోగా అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమం కింద చేపట్టిన పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు.
పాఠశాలలు తెరిచే రోజున ప్రతి విద్యార్ధికి నోట్బుక్లు, పాఠ్యపుస్తకాలు, ఒక జత స్కూల్ యూనిఫాం అందేలా తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చిన్నపాటి మరమ్మతు పనులు, విద్యుద్దీకరణ, మరుగుదొడ్లు, త్రాగునీరు, పెయింటింగ్, ఫర్నీచర్ పనులు నాణ్యతగా జరిగేలా పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బి వెంకటేశం, పంచాయత్ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, పౌర సరఫరాల శాఖ కమిషనర్ డిఎస్ చౌహాన్ తదితరులు పాల్గొన్నారు.