Kangana Ranaut | బాలీవుడ్ ప్రముఖ నటి, రాజకీయ నాయకురాలు కంగనా రనౌత్ విద్యార్థులపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు విశాల్ దద్లానీ సోషల్ మీడియా వేదికగా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో కంగనా వ్యవహరించిన తీరును, ఆమె చేసిన కామెంట్స్ను తప్పుపడుతూ ఆయన ఘాటైన వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. విద్యార్థులు రోడ్లపై నిరసనలు తెలుపుతున్న సమయంలో ప్రభుత్వాలు మరియు పాలకుల తరఫున జరిగిన హింసాత్మక ఘటనలను ఆయన తన పోస్ట్లో గుర్తుచేశారు.
ఈ సందర్భంగా విశాల్ దద్లానీ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. నిరసన సమయంలో విద్యార్థులు బూతులు మాట్లాడారని, చెడు భాష వాడారని కంగనా రనౌత్ అంటుంది. రోడ్లపై శాంతియుతంగా నిరసన తెలుపుతున్న పిల్లలపై దాడులు చేయడం, వారిపై రాళ్లు రువ్వి చివరికి ఆ నిందలన్నీ వారిపైనే నెట్టడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. అంతేకాకుండా, విద్యార్థులపై జరిగిన హింసను ప్రస్తావిస్తూ.. వారిపైకి నేరుగా కాల్పులు జరపడం, టియర్ గ్యాస్ ప్రయోగించడం, పెల్లెట్ గన్లతో వారి ముఖాలను తీవ్రంగా గాయపరచడం వంటి దారుణాలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఇప్పటికీ మీ నాయకులు తమ కిరాయి మూకల ద్వారా విద్యార్థులను భయబ్రాంతులకు గురిచేస్తూ, దాడులు చేయిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ పరిణామాలన్నింటినీ దృష్టిలో ఉంచుకునే ప్రజలు మరియు నెటిజన్లు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని, ఆమె చేసిన పనుల వల్లే ఈ రకమైన వ్యతిరేకతను కొనితెచ్చుకున్నారని విశాల్ దద్లానీ ఘాటుగా వ్యాఖ్యానించారు.