KCR | హైదరాబాద్ : కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టాలని, రాష్ట్రంలో యుద్ధం ఇంకా మిగిలి ఉందని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఉద్యమ శక్తులను మరోసారి పునరేకీకరణ చేసి కార్యక్షేత్రానికి రూపకల్పన చేస్తున్నట్టు చెప్పారు.
రాజకీయ, సామాజిక అంశాల్లో వచ్చిన మార్పులు, రాష్ట్ర ప్రగతి తదితర అంశాలపై తెలంగాణ ఉద్యమకారుడు గోసుల శ్రీనివాస్యాదవ్ ఎడిటోరియల్ వ్యాసాలతో రూపకల్పన చేసిన ‘సన్ ఆఫ్ ద సాయిల్’ (భూమిపుత్రుడు) పుస్తకాన్ని కేసీఆర్ శుక్రవారం ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పుస్తక రచయిత గోసుల శ్రీనివాస్ యాదవ్ను కేసీఆర్ ప్రత్యేకంగా అభినందించారు. తెలంగాణ మలి దశ ఉద్యమంలో, తెలంగాణ ప్రగతిని సాధారణ శైలిలో, ప్రజలకు అర్థమయ్యేలా వివరించారని ప్రశంసించారు. త్వరలో ఉద్యమ రచయితలతో ఒక సమావేశం పెట్టుకుందామని, రచయితలకు అన్ని విధాలుగా తోడుగా ఉంటానని, రచయితలు ప్రజల పక్షాన ఉండాలని కేసీఆర్ ఈ సందర్భంగా సూచించారు.
తెలంగాణ మలిదశ ఉద్యమంలో భావ వ్యాప్తితో ఉద్యమం ఉధృతమైందని గుర్తు చేస్తూ మరోసారి కవులు, కళాకారులు ఏకం కావలసిన అవసరాన్ని గుర్తు చేశారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను ఇప్పటికి కాంగ్రెస్ సర్కారు తిరోగమన దిశగా ఆలోచించడాన్ని కేసీఆర్ తప్పుబట్టారు. కర్షకులు, కార్మికులు, నిరుద్యోగులు వివిధ వర్గాలు కాంగ్రెస్ పాలనలో అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పదేళ్ల తెలంగాణలో ప్రజలకు చిన్న ఇబ్బంది కలగకుండా పరిపాలన చేశామని ఈ సందర్భంగా కేసీఆర్ తన పాలన మజిలీలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్య్రకమంలో మాజీ మంత్రి హరీశ్రావు, బాలమల్లు, శరత్ తదితరులు పాల్గొన్నారు.