న్యూఢిల్లీ : దేశంలో కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా టీకాల పంపిణీ కార్యక్రమం వేగంగా సాగుతున్నది. ప్రస్తుతం టీకా కేంద్రాల్లో కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. టీకాలను కేంద్రం తయారీ సంస్థలను సేకరించి ఉచితంగా రాష్ట్రాలకు సరఫరా చేస్తోంది. త్వరలో రష్యాకు చెందిన స్పుత్నిక్-వీ వ్యాక్సిన్ సైతం ప్రభుత్వ ఆధ్వర్యంలో సాగుతున్న టీకా కేంద్రాల్లోనూ ఉచితంగా వేయనున్నారు. ఈ విషయాన్ని కొవిడ్-19 వర్కింగ్ గ్రూప్ ప్రెసెడింట్ డాక్టర్ ఎన్కే అరోరా తెలిపారు. ప్రస్తుతం స్పుత్నిక్ వ్యాక్సిన్ ప్రైవేటు ఆసుపత్రుల్లో మాత్రమే అందుబాటులో ఉంది. రష్యా వ్యాక్సిన్ను సైతం ఉచితంగా అందుబాటులో ఉంచాలని మేం కోరుకుంటున్నామని, అయితే టీకా సరఫరాపై ఆధారపడి ఉంటుందన్నారు.
వ్యాక్సిన్ను మైనస్ 18 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయాల్సి ఉంటుందని, పోలియో వ్యాక్సిన్ కోల్డ్ చైన్ సదుపాయాలను స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ నిల్వ చేసేందుకు వినియోగిస్తామన్నారు. కొన్ని ప్రాంతాల్లో టీకాల పంపిణీలో స్పీడ్ తగ్గిందన్నారు. కార్యక్రమం రాబోయే వారం క్రమబద్ధీకరించనున్నట్లు చెప్పారు. ప్రాధాన్యతా క్రమంలో జూలై చివరి నాటికి సుమారు 50 కోట్ల మోతాదులు పంపిణీ చేస్తామన్నారు. ఈ సందర్భంగా ఆయన ‘రోజుకు కోటి టీకాల లక్ష్యం’పై స్పందిస్తూ.. టీకా సరఫరాలో ప్రధాన భాగం కొవిషీల్డ్, కొవాగ్జిన్దేనని తెలిపారు. రెండు వ్యాక్సిన్ల ఉత్పత్తి పెంచడంతో పాటు స్పుత్నిక్ వీ, మోడెర్నా, జైడస్ క్యాడిలా కొత్త టీకాలతో.. రోజువారీ టీకాల పంపిణీని 8 నుంచి 10 మిలియన్లకు పెంచవచ్చన్నారు.
థర్డ్ వేవ్.. డెల్టా ప్లస్ వేరియంట్ నేపథ్యంలో ఈ ఏడాది చివరి నాటికి 18 ఏళ్లు పైబడిన ప్రతి వ్యక్తికి (సుమారు 93కోట్లు మంది) టీకాలు వేయాలని కేంద్ర లక్ష్యంగా పెట్టుకుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చి నాటికి థర్డ్ వచ్చే అవకాశం ఉందని అరోరా పేర్కొన్నారు. ఈ క్రమంలో డెల్టా వేరియంట్లకు వ్యతిరేకంగా టీకాలు వేసేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుతం డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు దేశంలో 52 వరకు నమోదయ్యాయి.