ఖలీల్వాడి, మే 28 : పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల అమలులో గ్రామ రెవెన్యూ అధికారుల(వీఆర్వో) సేవలను వినియోగించుకోవాలని కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశించారు. శనివారం సాయంత్రం ఆయా శాఖల అధికారులతో పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమంపై కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. నూటికి నూరుశాతం సాధించేలా అధికారులు చొరవ చూపాలన్నారు. గ్రామపంచాయతీల వారీగా వీర్వోలకు బాధ్యతలను అప్పగించాలని, క్షేత్రస్థాయిలో వారి పర్యవేక్షణ ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వారు నిర్వర్తించాల్సిన బాధ్యతలపై వీఆర్వోలకు స్పష్టమైన అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. వైకుంఠధామాలు డంపింగ్ యార్డులు, పల్లెప్రకృతి వనాలు, బృహత్ పల్లెప్రకృతి వనాలు, రహదారులు, చెరువులు, కాలువ గట్లు తదితర ఖాళీ ప్రదేశాల్లో పూర్తిస్థాయిలో మొక్కలు నాటాలన్నారు. డంపింగ్ యార్డులలో తడి, పొడి చెత్తను వేరు చేస్తూ తడి చెత్త నుండి కంపోస్ట్ ఎరువు తయారు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. పల్లెప్రగతి కార్యక్రమం ముగిసే నాటికి నిర్దేశిత పనులు వందశాతం పూర్తి కావాలని స్పష్టం చేశారు. పల్లె, పట్టణ ప్రగతికోసం స్పష్టమైన ప్రణాళికతో ముందుకు సాగాలన్నారు.
ప్రతి గ్రామపంచాయతీ పరిధిలో 10 ఎకరాల అటవీ భూమిని సేకరించి సచివాలయాల ఆధ్వర్యంలో మొక్కలు నాటాలన్నారు. సారంగాపూర్లోని నిజామాబాద్ సహకార చక్కెర ఫ్యాక్టరీకి చెందిన 10 ఎకరాల స్థలాన్ని బృహత్ పట్టణ ప్రకృతి వనం కోసం ఉపయోగించాలని ఆదేశించారు. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమంపై ఈనెల 30వ తేదీన మధ్యాహ్నం 2గంటలకు జిల్లా పరిషత్ మీటింగ్ హాలులో జిల్లాస్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు సమావేశానికి హాజరవుతారని, జిల్లాస్థాయి అధికారులతోపాటు ఆయా మండలాల ఎంపీడీవోలు హాజరుకావాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా, డీఎఫ్వో సునీల్, జిల్లా పరిషత్ సీఈవో గోవింద్, డీఆర్డీవో చందర్, డీపీవో జయసుధ, ఆర్డీవోలు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.