కంఠేశ్వర్, ఏప్రిల్ 26: లోకసభ ఎన్నికల్లో తొలి అంకం పూర్తయింది. నామినేషన్ల స్వీకరణ, పరిశీలన శుక్రవారంతో ముగిసింది. నిజామాబాద్ లోక్సభకు దాఖలైన దరఖాస్తుల్లో పది మందివి తిరస్కరణకు గురికాగా, 32 మంది బరిలో ఉన్నారు. జహీరాబాద్లో 18 నామినేషన్లు తిరస్కరణకు గురికాగా, 26 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 29 వరకు గడువు ఉంది. మే 13న పోలింగ్ జరుగనుండగా, ప్రధాన పార్టీలు ప్రచారంపై దృష్టి సారించాయి. అందరి కంటే ముందే బరిలోకి దిగిన బీఆర్ఎస్.. గెలుపే లక్ష్యంగా ప్రచారంలో దూసుకెళ్తున్నది. పార్టీ నాయకులు, కేడర్ను సమన్వయం చేసుకుంటూ ప్రజల్లోకి వెళ్తున్నది.
నిజామాబాద్ లోక్సభ స్థానానికి దాఖలైన 90 నామినేషన్లలో 10 తిరస్కరణకు గురయ్యాయి. ఈ నెల 18 నుంచి 25 వరకు స్వీకరించిన నామినేషన్లను శుక్రవారం స్క్రూటినీ చేశారు. కలెక్టరేట్లో ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు , సాధారణ ఎన్నికల పరిశీలకురాలు ఎలిస్ వజ్ సమక్షంలో అభ్యర్థులు, పార్టీ ప్రతినిధుల ఎదుట నామినేషన్ల పరిశీలన ప్రక్రియ చేపట్టారు. నిబంధనల ప్రకారం లేని 10 మంది నామినేషన్లను తిరస్కరించినట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. అభ్యర్థులు మిర్యాల్కర్ జయప్రకాశ్, పోతు అశోక్, బేగరి పోషం, మీసాల శ్రీనివాస్రావు, మొహమ్మద్ జమీల్, ఎండీ షాహెద్ఖాన్, కొండూరు గంగాధర్, పాణిగంటి రజితావాణి, చెంచుల అశోక్, వి.మహాతేజ దాఖలు చేసిన నామినేషన్లు చెల్లుబాటు కాలేదని కలెక్టర్ తెలిపారు. స్క్రూటినీ ప్రక్రియలో అదనపు కలెక్టర్ అంకిత్, నగరపాలక సంస్థ కమిషనర్ మకరంద్, సహాయ రిటర్నింగ్ అధికారులు పాల్గొన్నారు.
జహీరాబాద్ స్థానానికి దాఖలైన నామినేషన్లను శుక్రవారం సంగారెడ్డి కలెక్టరేట్లో రిటర్నింగ్ అధికారి వల్లూరు క్రాంతి పరిశీలించారు. సాధారణ ఎన్నికల పరిశీలకుడు గోపాల్ జీ తివారీ, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, ఆయా పార్టీల ప్రతినిధులు, స్వతంత్ర అభ్యర్థుల సమక్షంలో నామినేషన్లను పరిశీలించారు. ఈనెల 18 నుంచి 25వ తేదీ వరకు స్వీకరించిన నామినేషన్ల ప్రక్రియలో భాగంగా 40 మంది అభ్యర్థులు 68 నామినేషన్లు దాఖలు చేశారు. ఆయా నామినేషన్లను పరిశీలించగా, వివిధ కారణాలతో 14 మంది అభ్యర్థు లు, 18 నామినేషన్లు తిరస్కరించినట్టు కలెక్టర్ తెలిపారు.
లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటేందుకు బీఆర్ఎస్ ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నది. నిజామాబాద్, జహీరాబాద్ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ప్రచార పర్వంలో దూసుకెళ్తున్నది. పార్టీ అభ్యర్థులు బాజిరెడ్డి గోవర్ధన్, గాలి అనిల్కుమార్ క్షేత్ర స్థాయిలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. కార్యకర్తలతో పాటు ప్రజలను కలుస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. నిజామాబాద్లో మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు జీవన్రెడ్డి, బిగాల గణేశ్గుప్తా, పార్టీ ముఖ్య నేతలు ప్రచార బాధ్యతలు చేపట్టారు. అటు జహీరాబాద్ లోక్సభ పరిధిలో మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే, జాజాల సురేందర్, గంప గోవర్ధన్ తదితరులు పార్టీ శ్రేణులను సమన్వయం చేస్తూ పకడ్బందీగా ప్రచారం చేస్తున్నారు. మరోవైపు, ప్రత్యర్థి పార్టీల ప్రచారం ఇంకా ప్రారంభమే కాలేదు. బీజేపీ అభ్యర్థి, సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అర్వింద్పై పార్టీలోనే తీవ్ర అసంతృప్తి నెలకొన్నది. అలాగే, ఐదు రోజుల్లో పసుపుబోర్డు తెస్తానని బాండు రాసిచ్చి ఐదేండ్ల పాటు మోసం చేశారన్న ఆగ్రహం రైతుల్లో వ్యక్తమవుతున్నది. ఇక జగిత్యాల జిల్లాకు చెందిన కాంగ్రెస్ అభ్యర్థి జీవన్రెడ్డికి నిజామాబాద్ జిల్లా నాయకుల నుంచి పూర్తి స్థాయి సహకారం అందడం లేదని పార్టీ వర్గాలే పేర్కొంటున్నాయి. అందుకే ప్రచారం ముమ్మరం చేయలేక పోతున్నారనే వాదన వినిపిస్తున్నది.