జయశంకర్ భూపాలపల్లి జిల్లా: చలివాగు ప్రాజెక్టు నుంచి రైతులకు సాగు నీరందించాలని డిమాండ్ చేస్తూ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని రేగొండ మండలంలో గల రూపిరెడ్డిపల్లి వద్ద పరకాల జాతీయ రహదారిపై భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు రైతులతో కలిసి ధర్నా నిర్వహించారు.
ఈ ధర్నా కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ.. చలివాగు ప్రాజెక్టు నుంచి వెంటనే రైతులకు సాగునీరు అందించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వర్షాకాలం ప్రారంభమై రెండు నెలలు పూర్తయిన ఇప్పటివరకు చలివాగు ప్రాజెక్టుకు సాగునీరు అందించకపోవడంతో రైతులు వరినారు సాగు చేయలేని దుస్థితి నెలకొందని, వందలాదిమంది రైతులు సాగునీటి కోసం తండ్లాడుతున్నారన్నారు. ఇప్పటికైనా ఈ కసాయి కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల బాధలు తెలుసుకొని వెంటనే రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు.
జాతీయ రహదారిపై రైతులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ధర్నా నిర్వహించడంతో సుమారు గంటపాటు రాకపోకలు స్తంభించిపోయాయి. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.