Voice of Women | ప్రశ్న.. ఓ ప్రజాస్వామ్య ఆయుధం. పాలకుల వేగానికి స్పీడ్ బ్రేకర్. ప్రశ్నించకపోతే జవాబు రాదు. జవాబు రాకపోతే.. వాస్తవాలు తెలియవు. మనకిప్పుడు కావలసింది.. స్తోత్రపాఠాల స్వరాలు కాదు. ప్రశ్నించే గొంతుకలు. నిప్పులాంటి నిజాలు.
మనుషులంతా ఒక్కటే. కానీ వాళ్ల అభిప్రాయాలు వేరుగా ఉండవచ్చు. స్థిరమైన వేలిముద్రలే కలవనప్పుడు, చలించే మనసులు ఒకేలా ఉంటాయనుకోవడం, ఉండాలనుకోవడం భ్రమే. కాకపోతే కాలానుగుణంగా ఒకరిది పైచేయి అవుతుంది, లేదా ఒకరి వాదన నిజం అని తేలుతుంది. అలా అని అభిప్రాయాలను బంధిస్తే… చర్చకు ఆస్కారం ఉండదు. లెఫ్ట్, రైట్, స్వేచ్ఛావాదం, సనాతనం… అంటూ ఏదో ఒకవైపు మొగ్గు చూపవచ్చు. కానీ అభిప్రాయం చెప్పడం చాలా అవసరం. సమర్థన అయినా, వ్యతిరేకత అయినా మనకు తోచిన విషయాన్ని, చెప్పాలనుకున్న మాటను బలంగా చెప్పగలగాలి. అలాంటి కొన్ని ధిక్కార స్వరాలివి. వారి వాదనను మనం ఆమోదించవచ్చు, తిరస్కరించవచ్చు. కానీ, గౌరవించాలి. ఎవరి గొంతుక వారిది. ఎవరి స్వరం వారిది. ఎవరి పంథా వారిది. దటీజ్ ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ!
ఆడవాళ్లు అణకువగా ఉండాలి. అవసరం అయితే ఒక అడుగు వెనక్కి వేయాలి… అనే సామాజిక నేపథ్యంలో శతాబ్దాలు గడిచిపోయాయి. చరిత్రలో ఒకరిద్దరు మగువలను గొప్పగా చెప్పుకొంటారు కానీ, మిగిలిన కోట్లాది స్వరాలు ఒకటిరెండు మాటల దగ్గరే మిగిలిపోయాయి. గత నూరేళ్ల నుంచే పరిస్థితులు మారాయి. రచన అయినా, రంగస్థలం అయినా మహిళలు ముందుకొచ్చి రాణిస్తున్నారు. తమ ఉనికినే కాదు ప్రతిభనూ నిరూపించుకుంటున్నారు. కానీ ఇక్కడా సమస్యే! ఒకప్పుడు వారి మాటల్ని చుట్టుపక్కల వాళ్లు మాత్రమే గమనించి, ఆపేవాళ్లు. కానీ ఇప్పుడు సమాజం మొత్తం వాళ్లను క్షుణ్ణంగా గమనిస్తున్నది. ఏమాత్రం ‘హద్దులు’ దాటారని అనిపించినా వెంటపడుతున్నది. ట్రోలింగ్ చేస్తున్నది. కేసులు వేస్తున్నది. మనం వారితో ఏకీభవించకపోవచ్చు, విభేదించవచ్చు. కానీ అద్దాలమేడ పైకి వచ్చి… చెప్పాలనుకున్న విషయాన్ని వెల్లడిస్తున్న వారి ధైర్యాన్ని గుర్తించాల్సిందే. అలాంటి ధిక్కార స్వరాలివి. సెలెబ్రిటీ స్థాయిలో ఉండి, కంఫర్ట్ జోన్లో ఉండిపోకుండా తమ మనసును వెల్లడిస్తున్న మగువల తీరు ఇది.
డాక్టర్ కాబోయి యాక్టర్ కాలేదు. ఎంబీబీఎస్ చదువుకుంటూనే సినిమాల్లో నటించింది. తన తొలి పెద్ద సినిమా ‘ప్రేమమ్’తో దేశాన్నే ఆకర్షించింది. హీరోయిన్ పాత్రలను బలమైన వ్యక్తిత్వంతో మలిచే శేఖర్ కమ్ముల దృష్టిలో పడింది. ‘ఫిదా’తో ‘సింగిల్ పీస్’గా నిలబడింది. ఆ తర్వాత ‘లవ్స్టోరీ’తో మళ్లీ నిరూపించుకుంది. ఇక ‘విరాటపర్వం’లో తెరమీదే వెన్నెల కురిపించింది. సాయి పల్లవి ఇలా షూటింగ్కి వచ్చి, ఆ తర్వాత ప్రీ రిలీజ్ ఫంక్షన్లలో మెరిసి మాయమయ్యే నాయిక కాదు. అందుకే ఒక్కో సినిమా గడుస్తున్న కొద్దీ తన గురించి రకరకాల వార్తలు వినిపించాయి. సినిమా ఫ్లాప్ అయితే రెమ్యునరేషన్ తగ్గించుకుందని ఒకసారి, మనస్పర్ధలు వచ్చినప్పుడు క్షమాపణకు సిద్ధమైందని ఓసారి వివరాలు బయటికి పొక్కాయి. అన్నిటికంటే ముఖ్యమైన కబురు… తను ఓ ఫెయిర్నెస్ క్రీమ్ యాడ్ తిరస్కరించి కోట్లు వదులుకోవడం. దాంతో సాయి పల్లవిది… వ్యక్తిగతంగానూ బలమైన పాత్రే అన్న ఓ భావన ఏర్పడింది. కానీ ‘విరాటపర్వం’ సినిమా రిలీజ్ సందర్భంగా తను వ్యక్తం చేసిన ఓ అభిప్రాయం తీవ్ర దుమారానికి దారితీసింది.
కశ్మీరీ పండితుల మీద జరిగిన అరాచకాలను, గోసంరక్షణ పేరుతో జరిగే వధలను ఒకే తాటిన కట్టడం చాలామందికి నచ్చలేదు. ఆ వ్యాఖ్యతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కిపోయింది. తనను ఓ మతానికి వ్యతిరేకిగా, దేశద్రోహిగా నిరసించారు. ఇలాంటి కామెంట్లు చేయడం ఫ్యాషన్ అయిపోయిందనీ, ఇలా మాట్లాడటమే భావ ప్రకటన అనుకోవడం మూర్ఖత్వం అనీ… విమర్శలు చెలరేగాయి. తన మీద కేసు కూడా నమోదైంది. తన పుట్టుపూర్వోత్తరాలనూ తవ్వితీశారు. వివాదం చేయిదాటిపోతున్నదని గ్రహించాక… సాయి పల్లవి ఒక వీడియో విడుదల చేసింది. అందులో నేరుగా క్షమాపణలు చెప్పలేదు. నేను ఏ పక్షమూ కాదని మాత్రం స్పష్టం చేసింది. ‘ఇకనుంచీ మనసులో ఉన్నదాన్ని చెప్పేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తాను’ అని చెప్పింది. వ్యక్తి ఎవరైనా సరే, ప్రతి ప్రాణం ఒక్కటే అని తేల్చింది. ఒక డాక్టర్గా… పుట్టబోయే ప్రతి బిడ్డ తన ఉనికి గురించి భయపడని రోజులు రావాలని కోరుకుంది. ఈమధ్యే విడుదల అయిన ‘గార్గి’ సినిమాలో సాయి పల్లవి… తండ్రి కోసం పోరాడే పాత్ర పోషించింది. నిజజీవితంలో ఇప్పుడు తన కోసమూ పోరాడుతున్నది.
అరుంధతీరాయ్.. మొదటినుంచీ ఓ భిన్నమైన పంథా. ఫూలన్ దేవి బయోపిక్ (బాండిట్ క్వీన్) మీద తన విశ్లేషణతోనే… ఓ వ్యతిరేక స్వరంగా మీడియా దృష్టిని ఆకర్షించింది. ‘గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్’ పుస్తకంతో అంతర్జాతీయ ఖ్యాతి సంపాదించినా, అందులో పేర్కొన్న విషయాలకు కేసులు ఎదుర్కొంది. ఆ తర్వాత తన స్వరం పెంచింది. ఏకంగా ప్రభుత్వ వ్యవస్థ మీదే మాటల యుద్ధం ప్రకటించింది. పార్లమెంట్ మీద దాడి అయినా, కశ్మీర్ వేర్పాటువాదం అయినా… మెజారిటీ ప్రజల భావనకు విరుద్ధంగా మాట్లాడేది. ఒక్క భారతదేశం మీదే కాదు ఇజ్రాయెల్, అమెరికా, శ్రీలంక… ఇలా ఎన్నో దేశాల విదేశీ విధానాలను దునుమాడింది. మావోయిస్టుల పట్ల సానుభూతి ప్రకటిస్తూ, అన్నా హజారే లాంటి పాపులర్ వ్యక్తులను నిరసిస్తూ… తనది వేరొక బాట అని నిరూపించే ప్రయత్నం చేసింది. దేశద్రోహం సహా ఎన్ని కేసులు పెట్టినా- ‘నేను గీతకు ఇటువైపున ఉన్నాను… నన్ను జైల్లో పడేసినా పట్టించుకోను’ అంటున్నది అరుంధతి.
లీనా మణిమేఖలై వార్తలకు కొత్తేమో… ఉద్యమాలకు కాదు. సరిగ్గా ఇరవై ఏండ్ల క్రితం తను తీసిన ‘మాతమ్మ’తోనే సంచలనం మొదలైంది. దేవదాసీ లాంటి వ్యవస్థ గురించి తీసిన డాక్యుమెంటరీ అది. ఆ తర్వాత రూపొందించిన డాక్యుమెంటరీలు కూడా మహిళలు, అణగారిన వర్గాల మీదే సాగాయి. ఆ క్రమంలో వివాదాలకూ జంకలేదు. 2011లో వచ్చిన ‘సెంగడల్’ సినిమా తమిళనాట శ్రీలంక శరణార్థుల వెతలను చూపించే ప్రయత్నం చేసింది. సెన్సార్ ఆంక్షలను ఎదుర్కొంది. ఆ తర్వాత ఏకంగా శ్రీలంకకే వెళ్లి… అక్కడ మాయమైపోయిన వ్యక్తుల గురించి ‘వైట్ వాన్ స్టోరీస్’ డాక్యుమెంటరీ నిర్మించింది. శ్రీలంక అధికారుల నిర్బంధం, ప్రశ్నలు, బెదిరింపులు దాటి బయటపడింది. లీనా వ్యక్తిగతమూ వైవిధ్యమే. తను లెస్బియన్ అని చెప్పడమే కాకుండా, LGBT కి అనుకూలంగా తన గొంతును పెంచింది. ఆసియాలోనే తొలి LGBT పరేడ్ (మధురై- 2012)కు బాసటగా నిలిచింది. లీనా కవయిత్రి కూడా! తన అభిప్రాయాలను, రచనల్లోనూ స్పష్టంగా ప్రకటిస్తుంది. స్వజాతి సంపర్కం గురించి తమిళంలో వెలువరించిన తొలి కవితా సంపుటి తనదే అని చెబుతారు. లీనా డాక్యుమెంటరీలు, వాటిలో ప్రస్తావించే అంశాలకు విదేశీ చలనచిత్రోత్సవాల్లో మంచిపేరే ఉంది. అయితే ఈ క్రమంలో వచ్చిన ‘కాళి’ మాత్రం తేనెతుట్టెనే కదిల్చింది. కాళీమాత పాత్రలో సిగరెట్ తాగుతూ, LGBT జెండాను చేతపట్టుకుని ఉన్న ఆ పోస్టర్ను చూసి భక్తులు భగ్గుమన్నారు. లీనా మీద ఇప్పటికే కేసులు నమోదయ్యాయి. లుకౌట్ నోటీసులూ జారీ అయ్యాయి. కానీ లీనా మాత్రం వెనక్కి తగ్గడం లేదు సరికదా… విమర్శకులను రెచ్చగొడుతూ మరొక చిత్రాన్ని ట్వీట్ చేసింది. అది ధైర్యం అనేవాళ్లు ఉన్నారు. దురహంకారమని ఈసడించేవాళ్లూ ఉన్నారు.
బలమైన పాలకులకు వ్యతిరేకంగా ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అని జాతీయ ప్రతిపక్షాల గొంతుకలు సన్నగా వణుకుతున్న వేళ… ఓ మహిళ దీటుగా నిలబడింది. ఆమే మహువా మొయిత్రా. అది NRC చట్టం గురించి జరిగిన చర్చ కావచ్చు, లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్న న్యాయమూర్తికి రాజ్యసభలో స్థానం దక్కిన రచ్చ కావచ్చు… మహువా గళం పార్లమెంటులో సూటిగా, కటువుగా వినిపించింది. ఉన్నత చదువులు చదువుకుని జెపి మోర్గాన్ లాంటి ప్రతిష్ఠాత్మక కంపెనీ ఉపాధ్యక్షురాలి స్థాయికి ఎదిగిన మహువా, అదంతా వదులుకుని రాజకీయల్లోకి అడుగుపెట్టిన తీరు కాస్త ఆశ్చర్యమే. రాజకీయాల్లోనూ నిదానంగా ఏం ఎదగలేదు. తొలుత కాంగ్రెస్లో చేరి రాహుల్ నమ్మకస్తురాలిగా నిలిచారు. తృణమూల్లోకి మారిన వెంటనే అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆ తర్వాత లోక్సభలో అడుగుపెట్టారు. ఈ క్రమంలో వివాదాలకు జడవలేదు. ఒక టీవీ చర్చలో తన మీద మాట తూలాడని, అప్పటి కేంద్రమంత్రి మీదే కేసు పెట్టారు. ఒక మీడియా సంస్థ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్నదంటూ బహిరంగంగానే దుర్భాషలాడి కేసులో చిక్కుకున్నారు. ఇక కాళికామాత పోస్టరు మీద జరుగుతున్న తాజా వివాదంలోనూ తనదైన అభిప్రాయాన్ని వినిపించారు. అందులో తప్పేమీ లేదనే రీతిలో అన్న తన మాటలు అగ్గి రాజేశాయి. పార్టీ సైతం, అది ఆమె వ్యక్తిగత అభిప్రాయం అంటూ దూరం జరిగింది. తనను అరెస్టు చేసితీరాలని ప్రతిపక్ష నాయకులు పట్టుబడుతున్నారు. మహువా మాత్రం… పార్టీని ట్విట్టర్లో అన్ఫాలో చేసి పారేసింది. నేను అన్నమాటకు కట్టుబడి ఉంటాను, దానికోసం దేశంలోని ప్రతి కోర్టునూ ఎక్కేందుకు సిద్ధమే అని కుండబద్దలు కొట్టేసింది.
ద్యుతి చంద్! ఒలింపిక్స్ వంద మీటర్ల పరుగులో మన దేశానికి ప్రాతినిధ్యం వహించిన మూడో మహిళ. కానీ దానికి ముందు తను ఎదుర్కొన్న సవాళ్లు, వాటిని ధిక్కరించిన తీరు కూడా వినూత్నమే! నిరుపేద కుటుంబంలో పుట్టిన ద్యుతి, అక్కను చూసి పరుగుపట్ల ఆసక్తి పెంచుకుంది. ఆ పరుగు ఆపకుండా జాతీయస్థాయికి చేరుకుంది. ఇక ప్రపంచ పతకాలే లక్ష్యం అనుకున్న సమయంలో… 2014లో ఓ అనూహ్యమైన నిర్ణయం తనను నిలువరించింది. పురుషుల్లో ఉండే టెస్టోస్టిరాన్ హార్మోన్ ద్యుతిలో ఎక్కువ ఉంది కాబట్టి , తను రేసుకు అనర్హురాలు అన్నది దాని సారాంశం. నిజానికి ఇంతకుముందు చాలామంది మహిళా అథ్లెట్స్ పరుగును ఈ నిబంధన ఆపేసింది. కానీ ద్యుతి అలా కాదు. ఈ పాత చట్టాన్ని సవాలు చేసింది. దాన్ని సడలించి మళ్లీ అవకాశం ఇచ్చేదాకా ఊరుకోలేదు. దాంతో ద్యుతిలాంటి ఎంతోమందికి ఈ అడ్డంకి తొలగిపోయింది. ఎన్నో ఏళ్ల నుంచి ఈ సమస్య ఉన్నా, ద్యుతి గళం విప్పడంతోనే ఈ పక్షపాతం లోకం దృష్టికి వచ్చింది. అక్కడితో ఆగలేదు. ట్రాన్స్జెండర్లను కూడా క్రీడల్లోకి అనుమతించాలంటూ ద్యుతి ప్రచారం చేస్తున్నది. తాను లెస్బియన్ అంటూ బహిరంగంగా ప్రకటించిన తొలి భారతీయ క్రీడాకారిణి ద్యుతి. ఆ ప్రకటనతో తన కుటుంబమే వెలివేసినంత పనిచేసింది. అయినా వెనక్కి తగ్గలేదు. LGBTQ+ కు అండగా పోరాడుతూనే ఉంది. అంతేకాదు! ఒలింపిక్స్ సమయంలో తనను కించపరుస్తూ కథనాలు రూపొందించిన టీవీ ఛానల్ను కోర్టుకు ఈడ్చింది. క్రీడల్లోనూ లైంగిక వేధింపులు ఉంటాయంటూ తన స్వీయ అనుభవాలను నిర్భయంగా చెప్పుకొచ్చింది.
నీనా గుప్తా అనే పేరు గూగుల్ చేయగానే కనిపించే ఓ ముఖ్యమైన ప్రశ్న… ‘నీనా గుప్త భర్త ఎవరు?’ అనే. తన గురించి అంతకంటే ముఖ్యమైన విషయాలు చాలానే ఉన్నాయి. సంప్రదాయ కుటుంబంలో పుట్టిన నీనా, ఉన్నత చదువులు చదువుకుంది. సంస్కృత నాటకాల మీద పరిశోధన చేసింది. రంగస్థలం మీద గొప్పనటిగా పేరు తెచ్చుకుని సినిమాల్లోకి అడుగుపెట్టింది. తనకంటూ ఒక గాడ్ ఫాదర్ లేడు. పాత్రల కోసం తనే వెళ్లి అడిగే అలవాటూ లేదు. పైగా అది రేఖ, షబానా అజ్మి, స్మితా పాటిల్, డింపుల్ కపాడియా వంటి నటీమణులు రాజ్యమేలుతున్న కాలం. నటిగా నిలదొక్కుకోలేకపోయినా… వ్యక్తిగా మాత్రం దృఢంగా ఉండేది. ఓ విదేశీ క్రికెటర్ను ప్రేమించింది. ఓ బిడ్డను కన్నది. 32 రెండేండ్ల్ల క్రితం ఇలాంటి సంఘటన ఎన్నో విమర్శలకు తావిచ్చింది. అయినా వెనక్కి తగ్గలేదు. తన నటనకు అవకాశం ఇచ్చేదైనా, ఆర్థికంగా సాయం చేసేదైనా (ఉదా: ఛోలీకే పీఛే పాటకు నృత్యం) తోచిన ప్రతి పాత్రనూ అంగీకరించింది. మనసుకు నచ్చినవారితో బంధంలో ఇమిడే ప్రయత్నం చేసింది. వార్తలకు వెరవకుండా, 48 ఏండ్ల వయసులో వివాహం చేసుకుంది. పెళ్లి గురించి అయినా, క్యాస్టింగ్ కౌచ్ గురించిఅయినా ఇప్పటికీ నిర్భయంగా తన మనసులో మాట చెప్పేస్తుంది.
రాధికా ఆప్టే.. అప్పుడప్పుడూ తెర మీద మెరిసేది. ఓటీటీలు వచ్చాక నట్టింట్లోనే పలకరిస్తున్నది. దాదాపుగా ఇరవై ఏండ్ల కెరీర్లో ఎత్తుపల్లాలు ఎన్ని ఉన్నా.. తన స్వరం మాత్రం మారలేదు. సహజమైన అందానికే తన ప్రాధాన్యం అని మొదటినుంచీ చెబుతూనే వస్తున్నది. ‘చాలామంది నన్ను సర్జరీలకు వెళ్లమన్నారు. అవకాశాలు కోల్పోయినా.. వాటి జోలికి వెళ్లలేదు’ అని చెప్పుకొచ్చింది. క్రమంగా తనకు నచ్చిన పాత్రలు.. అవి ఎంత సంక్లిష్టమైనవైనా సరే, అంగీకరించడం మొదలుపెట్టింది. అలా పార్చ్డ్, అంధాధున్, మాంఝి లాంటి సినిమాలు చేస్తూ వచ్చింది. ఓటీటీ అంటే దిగువ స్థాయి సినీ మాధ్యమం అని అందరూ దూరంగా ఉన్న వేళ… నెట్ఫ్లిక్స్ మనదేశంలో నిర్మించిన తొలి వెబ్ సిరీస్ (సేక్రెడ్ గేమ్స్) నుంచి వాటిలో నటిస్తూనే ఉంది. ‘పార్చ్డ్’ సినిమాలో నగ్నంగా నటించడం వల్ల #BoycottRadhikaApte హ్యాష్ ట్యాగ్ పాపులర్ అయినా జడవలేదు. తన నగ్న చిత్రాలు బయటికి వచ్చినా కంగారుపడలేదు. మీటూ ఉద్యమంలోనూ.. చాలామంది జంకుతున్న సమయంలో ధైర్యంగా వినిపించిన గొంతుక తనది. దక్షిణాదిన ఒక హీరో తనతో వెకిలిగా ప్రవర్తించాడని పబ్లిక్గా వెల్లడించింది. తనతో ఇంటర్వ్యూ అంటే.. సంచలనాలే!
ఇప్పుడు వార్తల్లో వ్యక్తి ఎవరూ అంటే సుస్మితా సేన్ పేరే గుర్తుకువస్తుంది. తను లలిత్ మోదీకి దగ్గరైందని తెలియగానే… తను ఇంతకుముందు ఎంతమందితో డేటింగ్ చేసింది అనే ‘పరిశోధనాత్మక’ వ్యాసాలు మొదలయ్యాయి. తను డబ్బుల కోసమే మగవాళ్లకు చేరువయ్యే గోల్డ్డిగ్గర్ అంటూ ట్రోలింగ్ మొదలైంది. మనదేశం నుంచి మిస్ యూనివర్స్ కిరీటాన్ని గెల్చుకున్న తొలి మహిళ- సుస్మితా సేన్. కానీ అది తన నటనకు అంతగా ఉపయోగపడలేదు. కొన్ని పాత్రలకే అవకాశం వచ్చినా, వాటితో మంచిపేరు సంపాదించుకున్నా… కెరీర్ ముందుకు సాగలేదు. అలాగని నిశబ్దంగా నిష్క్రమించలేదు. మహిళా హక్కుల మీద తన గొంతును వినిపించడంలో క్రియాశీలంగానే ఉంది. పిల్లల్ని పెంచడానికి పెళ్లితో సంబంధం ఏమిటంటూ, ఇద్దరు పిల్లల్ని పెంచుకోవడమే కాదు… వాళ్లతో గడపాలనే తపనతో తనకు వచ్చిన కొద్ది అవకాశాలనూ వదులుకుంది. జీవితాంతం స్టెరాయిడ్స్ మీద ఆధారపడాల్సిన వ్యాధితో బాధపడటం వల్లో ఏమో… తను వివాహానికి దూరంగానే ఉంది. అది విమర్శలకు మరింత ఆస్కారమిచ్చింది. తన మాజీ ప్రియుడు విక్రమ్ భట్ ముందుకు వచ్చి… ఆమె ప్రేమ కోసమే కానీ డబ్బు కోసం బంధాల్లో ఇమడదు అని చెప్పినా సరే… సుస్మితను గోల్డ్ డిగ్గర్గా ముద్ర వేసేశారు.
అది 1989. నాటి కేంద్ర ప్రభుత్వం ఆర్భాటంగా, ప్రతిష్ఠాత్మకంగా అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలు నిర్వహిస్తున్నది. ఇంతలో ఓ నటి లేచి నిలబడి ఆమధ్య హత్యకు గురైన ఓ రచయిత విషయంలో ప్రభుత్వం ఏ చర్యా తీసుకోలేదంటూ గళమెత్తింది. ఆ దెబ్బతో ప్రభుత్వ అనుకూలురంతా తన మీద కత్తి కట్టారు. కానీ ఇలాంటి సాహసం తనకు కొత్త కాదు. తన తండ్రి కైఫి అజ్మి ప్రముఖ ఉర్దూ రచయిత. భర్త జావెద్ అఖ్తర్ సెలెబ్రిటీ రైటర్. రచనలు, నాటకాల మధ్య పెరిగిన తను… మనసుకు నచ్చిన పాత్రలతోనే కెరీర్ మొదలుపెట్టింది. తన మొదటి సినిమా ‘అంకుర్’ తోనే కులం, వివాహేతర సంబంధాలు, ఛాందసభావాలు లాంటి అంశాల మధ్య నలిగిన పాత్రతో వివాదాస్పదం అయ్యింది. తనే షబానా అజ్మి! వందకు పైగా నటించిన తన చిత్రాల్లో ఎక్కువ శాతం బోల్డ్ పాత్రలే. కొన్నయితే తీవ్ర దుమారమే రేపాయి. దీపా మెహతా ‘ఫైర్’ చిత్రంలో… సహనటితో సన్నిహితమైన సన్నివేశాలు భారతీయ తెర మీదే మొదటివి. పాత్రలే కాదు… తన నాటకాలతో సంప్రదాయ భావాలను ఎదుర్కొంది, ప్రదర్శనలతో ప్రభుత్వ విధానాలను నిరసించింది, వ్యాఖ్యలతో మతపెద్దలను సైతం ఢీకొన్నది. ఇలా ఆ మతం ఈ మతం అని కాకుండా… చాలామందికి కంటగింపుగా మారారు. తాజాగా కన్హయ్య కుమార్ కోసం ఎన్నికల ప్రచారం చేసి వార్తల్లో నిలిచింది.
.. ఇలా చాలా స్వరాలే గుర్తుకువస్తాయి. రియల్లీ స్వరా పేరుతో ప్రభుత్వ విధానాలు, తాజా సంచలనాల మీద తనవైన వ్యాఖ్యలు చేసే స్వరా భాస్కర్; ఇటు ట్రోలర్స్తోపాటు అటు సాటి నటుల మాటలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టే తాప్సి పన్ను; సినీ రంగంలో ఉన్న వారసత్వాన్ని మొహం మీదే ప్రశ్నిస్తూ, తన ప్రభుత్వ అనుకూలతను నిరంతరం చాటుకునే కంగనా రనౌత్; విడాకుల అపవాదు తనమీదే పడినా, దాన్ని భరిస్తూ తనకు ఇష్టమైన పాత్రల్లో నటిస్తున్న సమంత… లాంటివాళ్లు ఎంతోమంది వార్తల్లోనే ఉన్నారు. ముందే చెప్పుకొన్నట్టుగా, ధైర్యంగా మాట్లాడినంత మాత్రాన… వాళ్ల ప్రతి మాటనూ సమర్థించాల్సిన పనిలేదు. పొరపాటు మాట్లాడితే ఖండించకుండా ఊరుకునే పరిస్థితులూ కావు. కానీ ట్రోలింగ్, నిరసన, విద్వేషం ఎదుర్కొంటామని తెలిసినా ఒక సెన్సేషన్ కోసం కాకుండా తమ భావ ప్రకటన కోసం మాట్లాడినప్పుడు మాత్రం… ఆ స్వరాలను, వాటి వెనుక ఉన్న ధైర్యాన్నీ అభినందించాల్సిందే!
వర్చువల్ ఇన్ఫ్లుయెన్సర్ అంటే ఎవరు? వాళ్లకు సోషల్మీడియాలో ఎందుకంత క్రేజ్ ?
ఈ ప్రపంచం మీద అసలు ఇలాంటి ఆటలు ఉన్నాయని తెలుసా
మనకంటూ ఓ బ్రాండింగ్ రావాలంటే ఏం చేయాలి? పొరపాట్లు జరగకుండా ఉండాలంటే ఎలా?
టాలెంట్ ఉండి.. కష్టపడితే సినిమాల్లో రేపటి స్టార్స్ మీరే.. అందుకు వీళ్లే ప్రూఫ్ !!