హైదరాబాద్, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ): ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఎందుకు ఇచ్చారో వివరణ ఇవ్వాలని హైకోర్టు ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. ఎక్సైజ్ అధికారులను ప్రస్తుతమున్న జిల్లాల్లోనే కొనసాగించాలన్న ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యానికి నంబర్ను కేటాయించేందుకు హైకోర్టు రిజిస్ట్రీ అభ్యంతరం వ్యక్తం చేయడం తో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలో క్ ఆరాధే, జస్టిస్ జే అనిల్ కుమార్ ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది.
ఒకే జిల్లాలో మూడేండ్లకుపైగా పనిచేస్తున్న రెవెన్యూ, పోలీస్ అధికారులను బదిలీ చేసినప్పటికీ ఎక్సైజ్ అధికారులను మాత్రం బదిలీ చేయలేదని పిటిషనర్ తరఫు న్యాయవాది తెలిపారు. ఎక్సైజ్ అధికారులను కూడా బదిలీ చేసేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ఎన్నికల మార్గదర్శకాల ప్రకారమే బదిలీలు జరిగాయని కేంద్ర ఎన్నికల సంఘం తరఫు న్యాయవాది చెప్పారు.