KCR | నాలుగైదు నెలల్లోనే రాష్ట్రంలో పరిస్థితులు తారుమారయ్యాయని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మండిపడ్డారు. వీణవంకలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభలో గులాబీ దళపతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పాలనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘తొమ్మిదేళ్లు బ్రహ్మాండంగా వచ్చిన కరెంటు ఎందుకు రావడం లేదు. నడిచిన తొవ్వే కదా. మీరు కొత్తగా గడ్డపారలతో బాయిలు తవ్వేది లేదు. పూడికలు తీసేది లేదు. నడిచింది నడిచినట్లుగా నడిపిస్తే అయిపోతుంది కదా? కరెంటు కోతలు పడుతున్నయ్ కదా? మిషన్ భగీరథ నీళ్లు ఎందుకు మాయమైనయ్ ? మళ్లీ బిందెలుపట్టి మోసుడేంది? ఇంతకన్నా దుర్మార్గం ఉంటదా? అంటూ మండిపడ్డారు.
‘దవాఖానలు ఫస్ట్క్లాస్గా చేసినం. కేసీఆర్ కిట్లను తెచ్చాం. వ్యాన్లలో అమ్మాయిలను తీసుకువెళ్లి ప్రసవం చేయించి.. పైసాఖర్చు లేకుండా ఇంటికాడ దించినం. ఆడిపిల్ల పుడితే రూ.13వేలు, మగపిల్లాడు పుడితే రూ.12వేలు చేతిలో పెట్టి, కేసీఆర్ కిట్ ఇచ్చి ఆదుకున్నాం. ప్రైవేటు దోపిడీపోయి గవర్నమెంట్ దవాఖానాల్లో ప్రసవాలు బాగా అయ్యేవి. మళ్లీ ఇప్పుడు తార్మార్ అయిపోతుంది. కిందిమీద అయిపోతుంది. కేసీఆర్ కిట్ లేదు. న్యూట్రిషన్ కిట్ లేదు. ఆ కథ లేదు. ఇవాళ రెండు వార్తలు వచ్చినయ్. వరంగల్ ఎంజీఎంలో దుర్భమైన పరిస్థితులు ఉన్నయ్. ఎయిర్ కండిషనర్లు పనిచేస్తలేవు. కొత్త పుట్టిన చిన్న పిల్లలు అల్లాడుతున్నారని ఆ తల్లులు గోసపడుతున్నరని పేపర్లలో వార్త వచ్చింది. అట్లనే ఆదిలాబాద్ జిల్లా రిమ్స్లో కూడా చాలా దారుణమైన పరిస్థితి ఉన్నది. మృతదేహాల నుంచి దుర్వాసన వస్తున్నది. డాక్టర్లు భయపడుతున్నారని వార్తలు వస్తున్నాయి. ఇంత తొందరలోనే ట్రాక్ ఎలా తప్పుతుంది? అంటూ నిలదీశారు.
‘ఇప్పుడున్న పరిపాలకులకు ఒక పద్ధతి పాడు లేదు. వ్యవహారం చేసే దక్షత, ప్రజలపై ప్రేమ.. ఎట్లన్న చేసి రాష్ట్రాన్ని కాపాడాలనేటువంటి లేదు. అందుకే ఇలాంటి దుర్మార్గాలు వస్తున్నయ్. దాని అర్థం ఏంటీ? వారితో కాదు. చేయరు.. చెడగొడుతరు. మళ్లీ బాగు చేయాల్సిన బాధ్యతనే ఉంటది. మళ్లీ మనం వచ్చేదాక ధీటుగా పని చేసి తెలంగాణ కోసం.. ప్రజల కోసం పార్టీని ముందుకు తీసుకెళ్లాలి’ అని సూచించారు.