Nayanthara | దక్షిణాది చిత్ర పరిశ్రమలో ‘లేడీ సూపర్ స్టార్’గా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నయనతార మరోసారి వార్తల్లో నిలిచారు. రెండు దశాబ్దాలకు పైగా సినీ ప్రయాణంలో హీరోయిన్గా తన స్టార్డమ్ను నిలబెట్టుకుంటూ, కథకు ప్రాధాన్యమున్న సినిమాలను ఎంచుకుంటూ వరుస విజయాలను అందుకుంటున్న ఆమె.. ఇప్పుడు చెన్నైలో అత్యంత విలాసవంతమైన ప్రాంతంలో భారీ విలువైన విల్లాను కొనుగోలు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. చెన్నైలోని ప్రముఖ ప్రాంతమైన పోయెస్ గార్డెన్లో నయనతార కొత్త లగ్జరీ విల్లాను సొంతం చేసుకున్నారని తమిళ సినీ వర్గాలు చెబుతున్నాయి. సూపర్ స్టార్ రజనీకాంత్, హీరో ధనుష్తో పాటు పలువురు ప్రముఖులు నివసించే ఈ హై-సెక్యూరిటీ ప్రాంతంలో కొనుగోలు చేసిన ఈ విల్లా విలువ సుమారు రూ.40 కోట్లు ఉంటుందని ప్రచారం జరుగుతోంది.
ప్రస్తుతం అదే ప్రాంతంలో నివసిస్తున్న నయనతార, త్వరలోనే భర్త విఘ్నేశ్ శివన్, పిల్లలతో కలిసి ఈ కొత్త ఇంటిలోకి గృహప్రవేశం చేయనున్నట్లు సమాచారం. సినీ పరిశ్రమలో 20 ఏళ్లకు పైగా కొనసాగుతున్న నయనతార క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.15 కోట్ల వరకు పారితోషికం అందుకుంటూ, దక్షిణాదిలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్గా కొనసాగుతున్నారు. కథల ఎంపికలో చూపించే ప్రత్యేక శ్రద్ధ, నటనలోని వైవిధ్యం ఆమెను ఈ స్థాయికి తీసుకువచ్చాయని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం నయనతార పలు భాషల్లో బిజీగా ఉన్నారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ చిత్రాల్లో కలిపి దాదాపు ఎనిమిది ప్రాజెక్టులు ఆమె చేతిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది మెగాస్టార్ చిరంజీవితో నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ మంచి విజయాన్ని అందుకోగా, మమ్ముట్టి-మోహన్లాల్ కాంబినేషన్లో వచ్చిన ‘పేట్రియాట్’ చిత్రంలోనూ కీలక పాత్ర పోషించారు.
అలాగే కన్నడ స్టార్ యష్తో ‘టాక్సిక్’, బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్తో ఓ భారీ పాన్-ఇండియా ప్రాజెక్ట్లో నటిస్తున్నారు. నయనతార ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘హాయ్’ చిత్రం ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. నటనలో విజయాలు, భారీ పారితోషికం, విలాసవంతమైన జీవనశైలితో నయనతార మరోసారి తన స్టార్ స్టేటస్ను చాటుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు.