KCR | ప్రధాని నరేంద్ర మోదీ గోదావరి నదిని తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు తరలించుకుపోతానంటే.. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కుయ్యిమంటలేడు.. కుటుక్కుమంటలేడని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మండిపడ్డారు. కరీంనగర్ జిల్లా వీణవంకలో జరిగిన బీఆర్ఎస్ బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘నరేంద్ర మోదీ నేను మీ గోదావరిని తీసుకుపోయి తమిళనాడు, కర్ణాటకకు ఇస్తానని బాజాప్తా చెబుతున్నడు. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రపోజల్ పంపిండు. కుయ్యిమంటలేడు. కుటుక్కుమంటలేడు ముఖ్యమంత్రి. మరి ఏం మతలబు ? ఏం కారణం ? ఉన్న గోదావరి పరాయి పాలైతే మన బతుకు ఏం కావాలి? మనకు వచ్చేది గోదావరి నీళ్లే కదా? అదిపోయిన తర్వాత మంచినీళ్లు, తాగునీళ్లు లేవి ? తెలంగాణ బతుకు ఏదీ? ఇంత ప్రధాన విషయంపై కూడా ఆయన మాట్లాడుతలేడు’ అంటూ మండిపడ్డారు.
‘అదే నేనుప్పుడు మోదీ ప్రపోజల్ పెడితే ముందు నా తెలంగాణ వాటా తేల్చు. ఆ నీళ్లు అక్కడపెట్టు. అప్పుడు మాత్రమే దీనిపై మాట్లాడుతా.. అప్పటిదాకా లక్ష మీటింగులు పెట్టినా రాను అని చెప్పాను. అప్పుడు ఆ ఫైల్ ఏం కదలలేదు. ఇప్పుడు ఓ నిరర్ధక ప్రభుత్వం ఉన్నదని ఉద్దేశంతో వాళ్ల ఇష్టం వచ్చిన ఆట ఆడుతున్నరు. పార్లమెంట్ ఎన్నికల్లో మనోళ్లే.. 12-14 మంది ఎంపీలు ఉంటే.. ఇలాంటి ప్రతిపాదన వస్తే పార్లమెంట్లో లేచి ఎగిరి దుంకి అందుకుంటరు.. ఎలా తీసుకుపోతవ్ బిడ్డా అని ప్రశ్నిస్తరు. ప్రశ్నించేవాడు ఉంటడు. ఇక్కడ లేనప్పుడు అక్కడనైనా ఉండాలి కదా? మనం. అక్కడ లేక ఇక్కడ లేక ఆగమైపోతే మనల్ని ఎవరు కాపాడాలి. అందుకోసం ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్లమెంట్ గెలవాలి’ అన్నారు.
‘వినోద్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కరీంనగర్ ఎంపీగా గతంలో పని చేసిండు. నడుమలో వచ్చిన సంజయ్ అనే సన్నాసి ఏం చేసిండో మీకు తెలుసు. తంబాకు నములుడు. అడ్డంపొడువు మాట్లాడడం తప్ప.. తిట్ల పురాణం తప్ప ఇంకొటి లేదు. మనకు ఆ తిట్ల పురాణమెందుకు? ఆ పంచాంగమెందుకు? ఆ పంచాయితీ ఎందుకు? చదువుకున్నోడు.. విద్యావంతుడు.. అడ్వొకేట్ వినోద్లాంటి వ్యక్తి గెలిస్తే మన హక్కుల కోసం కొట్లాడుతడు. మన గోదావరిని కాపాడుతడు. మన నిధుల కోసం కొట్లాడుతడు. ఇవాళ నేను హుజూరాబాద్లో ప్రత్యేకంగా రావాల్సిన అక్కెర ఉండేది. కౌశిక్రెడ్డి తాను ఎంత పొడువుగా ఉన్నడో అంత భారీగా చేద్దామనుకున్నడు. బస్యాత్రకు వస్తున్న రెస్పాన్స్ చూసి.. ఇద్దరు బదులుకొని నాపై 48గంటలు నిషేధం అన్నరు. నేనన్నా మంచిమాట కానీ.. దేవుడున్నడు. పొట్టోని నెత్తి పొడుగోడు కొడితే.. పొడుగోడి నెత్తి పోచమ్మ గొట్టిందట. ప్రజలు ఉంటరు న్యాయం చెబుతరు ఏం బాధ లేదు. అని 48 గంటలు ప్రచారం ఆపేశా’నన్నారు.
‘దాంట్లో హుజూరాబాద్ ఎగిరిపోయింది. దానికి ఆయన (పాడి కౌశిక్రెడ్డి) నా మీద సాగిస్తడు. నువ్వు ఆడిరాకపోయినోడివి ఎట్ల పోతవ్.. పోతే పోయినవ్ గని ఏ తిప్పలన్నపడి మంచిర్యాల నుంచి ఏ రాత్రయినా ఇక్కడికే రా.. ఇక్కడే ఉండాలి.. నీ సంగతి ఎందో చూసి పంపిస్తా అన్నడు. నిన్న ఒక 200 మందితో బొట్టుపెట్టించిడు. కడుక్కునేందుకు నాకు గంట సమయం పట్టింది. నేను పడే బాధలు మీకు తెల్వది. ఫొటోలు దిగాలే అన్నడు. నేను మీకు ప్రామిస్ చేస్తున్నా. ఒక రోజు 24 గంటలు ఇక్కడే ఉండేటట్టు హుజూరాబాద్కు వస్త. వెయ్యి కాదు నాలుగు వెయ్యిల ఫొటోలు దిగుదాం. దయచేసి నన్ను ఇప్పుడు ఆపొద్దు. నన్ను పంపియ్యాలే. జగిత్యాలలో పెద్ద మీటింగ్ ఏర్పాటు చేశారు. అక్కడికి పోవాలి. హుజూరాబాద్లో నేను చెప్పేది ఒక్కటే. కరీంనగర్ పార్లమెంట్లో హుజూరాబాద్ అందరికన్నా ముందున్నది. మీరు పట్టుబడితే ఇంకో ఐదారుశాతం ఓట్లు పెంచగలుగుతరు. మీరు ముఖ్య నాయకులే ఉన్నరు. నేను చెప్పిన అంశాలపై చర్చ పెట్టి ఓటింగ్ శాతం పెంచండి. గెలిచిన తర్వాత మీ ఎంపీని తీసుకొని వచ్చి ఒకరోజంతా ఇక్కడే ఉంట. అందరం కలిసి పండుగ చేసుకుందాం’ అని కేసీఆర్ అన్నారు.