అమరావతి : ఎండవేడిమితో అల్లాడుతున్న ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ (Weather department) చల్లని కబురును మోసుకొచ్చింది. సోమవారం నుంచి రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు (Rains) పడుతాయని వాతావరణ విపత్తుల సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. అయితే అక్కడక్కడా పిడుగులతో కూడి వర్షాలు పడే అవకాశమున్నందున జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు సైతం జారీ చేసింది.
సోమవారం అల్లూరి సీతారామరాజు(Alluri Sitaramaraju), శ్రీకాకుళం, శ్రీ సత్యసాయి, వైయస్సార్(YSR), పార్వతీపురం మన్యం, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. మిగిలిన చోట్ల తేలికపాటి వర్షం పడుతుందన్నారు.
మంగళవారం విజయనగరం, పార్వతీపురంమన్యం, ఏలూరు (Eluru), పల్నాడు, ప్రకాశం, వైయస్సార్, నెల్లూరు(Nellore), నంద్యాల, శ్రీ సత్యసాయి, , అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించారు. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్ల క్రింద , బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని సూచించారు.
మహానందిలో అత్యధికంగా 45.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
ఆదివారం నంద్యాల జిల్లా మహానందిలో 45.8 డిగ్రీల అత్యధికంగా ఉష్ణోగ్రత(Temparature) నమోదయ్యింది . కర్నూలు జిల్లా జి. సింగవరంలో 45.6 , నెల్లూరు జిల్లా వేపినాపి అక్కమాంబపురంలో 45.5 , ప్రకాశం జిల్లా వెలిగండ్లలో 45.2, తిరుపతి జిల్లా మంగనెల్లూరు, వైయస్సార్ జిల్లా ఉప్పలూరు, సింహాద్రిపురంలో 45.1, అన్నమయ్య జిల్లా టిసుండుపల్లె 44.7, పల్నాడు జిల్లా రావిపాడులో 44.4, చిత్తూరు జిల్లా పుంగనూరులో 43.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత రికార్డయింది .