వరంగల్ చౌరస్తా, మార్చి 26: వరంగల్ కాకతీయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో వైద్యులు అరుదైన ఘనత సాధించారు. బ్రెయిన్ ట్యూమర్ శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేసి బాధితురాలికి పునర్జన్మనిచ్చారు. వివరాలిలా ఉన్నాయి.. హనుమకొండ జిల్లా కమలాపురం మండలం ఉప్పల్ గ్రామానికి చెందిన బుర్ర స్వరూప తల, నరాల తీవ్ర నొప్పి, ఫిట్స్తో బాధపడుతూ ఈ నెల 11న వరంగల్లోని సూపర్స్పెషాలిటీ హాస్పిటల్లో వైద్యులను సంప్రదించింది. ఆమెకు పరీక్షలు చేసిన డాక్టర్లు.. స్వరూప మెదడులో కణితి పెరగడం వల్ల ఇబ్బంది పడుతున్నట్లు గుర్తించారు. ఈ నెల 18న న్యూరో సర్జన్ విభాగాధిపతి డాక్టర్ మహ్మద్ సికిందర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సచిన్, డాక్టర్ వీరేశ్, అనస్థీషియా వైద్యులు మురళి, చంద్రశేఖర్, కిరణ్ బృందం సుమారు రెండున్నర గంటల పాటు శస్త్రచికిత్స చేశారు. స్వరూపను మంగళవారం డిశ్చార్జి చేశారు. బ్రెయిన్ ట్యూమర్ను గుర్తించి, విజయవంతంగా శస్త్రచికిత్స చేసిన వైద్య బృందాన్ని ఎంజీఎం సూపరింటెండెంట్ చంద్రశేఖర్, కేఎంసీ ప్రిన్సిపాల్ మోహన్దాస్తో పాటు పలువురు విభాగాధిపతులు అభినందించారు. బాధితురాలి కుటుంబ సభ్యులు వైద్య బృందానికి కృతజ్ఞతలు తెలిపారు.
ఎనుమాములలో తగ్గిన పత్తి ధర
కాశీబుగ్గ, మార్చి 26: ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో మంగళవారం పత్తి ధర క్వింటాల్కు రూ. 80 తగ్గింది. శుక్రవారం గరిష్ఠంగా క్వింటాల్కు రూ. 7,250 ధర పలకగా, మంగళవారం గరిష్ఠంగా రూ. 7170, మధ్య రకానికి రూ. 6,500, కనిష్ఠంగా రూ. 6 వేల ధర పలికింది. సీసీఐ మద్దతు ధర క్వింటాల్కు రూ. 7,020 కాగా, అంతర్జాతీయ మార్కెట్లో పత్తికి డిమాండ్ పెరగడంతో ప్రైవేట్ వ్యాపారులు పోటీపడి మద్దతు ధర కన్నా అధిక రేటు పెట్టి కొనుగోలు చేస్తున్నారు. పత్తి ధర తగ్గడంతో మూడు రోజుల సెలవుల తర్వాత మార్కెట్కు వచ్చిన రైతులకు నిరాశే ఎదురైంది.