హనుమకొండ చౌరస్తా, ఏప్రిల్ 27 : అత్యాధునిక డావిన్సీ-11 రోబోటిక్ సర్జికల్ సిస్టం అందుబాటులోకి వచ్చిందని సోమాజీగూడ యశోద హాస్పిటల్స్ కన్సల్టెంట్ సర్జికల్, గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ కోన లక్ష్మీకుమారి తెలిపారు. శనివారం హనుమకొండ అశోకా హోటల్లో ఆమె మాట్లాడుతూ.. కచ్చితత్వంతో శస్త్రచికిత్స ఫలితాలను మెరుగుపర్చడానికి రూపొందించిన డావిన్సీ-11 రోబోటిక్ సర్జికల్ సిస్టం విశేషమైన పురోగతిని అందిస్తుందన్నారు. సంప్రదాయ ఓపెన్ సర్జరీ లేదా ల్యాప్రోస్కోపిక్ విధానాలతో పోలిస్తే ఈ వినూత్న వ్యవస్థ అనేక ప్రయోజనాలను అందించి, రోగులు వేగంగా కోలుకునేలా చేస్తుందన్నారు. యశోద హాస్పిటల్స్ 3 దశాబ్దాలుగా విభిన్న వైద్య చికిత్సలు అందిస్తున్నదని, అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలను పాటిస్తున్నామని చెప్పారు. సోమాజిగూడ, సికింద్రాబాద్, మలక్పేట్, హైటెక్ సిటీల్లో 4 వేల పడకలతో 4 ఇండిపెండెంట్ హాస్పిటల్స్ ఉన్నాయని, ప్రపంచ స్థాయి ఆరోగ్య సంరక్షణ సేవలను అందిస్తున్నామన్నారు.