Airport Metro | సిటీబ్యూరో, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ): ఎయిర్పోర్ట్ మెట్రో కారిడార్ నిర్మాణం ఎన్నో సవాళ్లతో కూడుకొని ఉన్నదని, అయినా అందుబాటులో ఉన్న ఇంజినీరింగ్ పరిజ్ఞానంతో వాటిని అధిగమించి అద్భుతమైన రీతిలో నిర్మిస్తామని హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి అన్నారు. శనివారం ప్రతిపాదిత శంషాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో కారిడార్లో సుమారు 14 కి.మీ మార్గాన్ని ఇంజినీరింగ్ అధికారులు, కన్సల్టెంట్లతో కలిసి కీలకమైన ప్రాంతాలను పరిశీలించారు.
మెట్రో అధికారులు డీవీఎస్ రాజు, ఎస్కే దాస్, చీఫ్ ప్రాజెక్టు మేనేజర్ ఆనంద్ మోహన్, జీఎం బీ.ఎన్. రాజేశ్వర్, ఎస్.ఈ వై.సాయపరెడ్డి, ఇంజినీరింగ్ కన్సల్టెన్సీ సిస్ట్రా ఇంజినీరింగ్ నిపుణులతో కలిసి కారిడార్లో నిర్మించే స్టేషన్ల స్థలాల పరిశీలన, ఫ్లై ఓవర్లు ఉన్న చోట చేయాల్సిన మార్పులపై చర్చించారు. నాగోల్ నుంచి ఎల్బీనగర్, చాంద్రాయణగుట్ట మీదుగా విమానాశ్రయం లోపలి వరకు నిర్మిస్తున్న మార్గంలో ఎక్కడెక్కడ స్టేషన్లు నిర్మించాలి.. మూసీనది, ఎల్బీనగర్ జంక్షన్, బైరామల్గూడ-సాగర్ రింగ్ రోడ్డు, చాంద్రాయణగుట్ట ఇంటర్చేంజ్ స్టేషన్ నిర్మించే చోట ఎదురవుతున్న సవాళ్లను ఏ విధంగా పరిష్కరించాలన్న దానిపై ఇంజినీరింగ్ అధికారుల బృందంతో చర్చించారు. ఆయా ప్రాంతాల్లో అడ్డంకులుగా ఉన్న ఫ్లై ఓవర్లు, అండర్పాస్, మూసీ నది తీర ప్రాంతాలు, ఇతర భారీ నిర్మాణాలను ప్రత్యక్షంగా పరిశీలించి.. ఇంజినీర్లకు పలు సూచనలు చేశారు.
నాగోల్-ఎయిర్పోర్టు మార్గంలో కొత్తగా నాగోల్ వద్ద నిర్మించనున్న మెట్రోస్టేషన్.. ప్రస్తుతమున్న నాగోల్ స్టేషన్కు దగ్గరలోనే ఎడమ వైపు (ఎల్బీనగర్ వైపు) ఉంటుంది. ప్రయాణికుల సౌలభ్యం కోసం ఈ రెండు స్టేషన్లను కాన్కోర్ లెవల్లో కలుపుతూ.. విశాలమైన స్కైవాక్ నిర్మించాలని ఎండీ ఆదేశించారు. నాగోల్ స్టేషన్ తర్వాత మూసీ నది వంతెనను ఆనుకొని ఉన్న పెద్ద పెద్ద మంచినీటి పైపులు, భూగర్భ హైటెన్షన్ విద్యుత్ కేబుళ్ల దృష్ట్యా, మెట్రో అలైన్మెంట్ను మరో 10 మీటర్లు ఎడమ వైపునకు జరపాలన్నారు. మూసీ అభివృద్ధికి ప్రభుత్వం చేపట్టిన ప్రణాళికను దృష్టిలో పెట్టుకొని, ఆ నదిపై మెట్రో బ్రిడ్జిని పొడవైన స్పాన్తో నిర్మించాలన్నారు. ఎల్బీనగర్ జంక్షన్ కుడివైపున ఉండబోయే కొత్త మెట్రో స్టేషన్ను ఇప్పటికే ఉన్న కారిడార్-1 (మియాపూర్-ఎల్బీనగర్)లోని ఎల్బీనగర్ మెట్రో స్టేషన్కు విశాలమైన స్కై వాక్తో అనుసంధానం చేయాలని ఆదేశించారు.