Maruti Suzuki | న్యూఢిల్లీ, ఏప్రిల్ 27: దేశీయ కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ.. చిన్న హైబ్రిడ్ కారుపై దృష్టి సారించింది. ఇప్పటికే పలు మాడళ్లను హైబ్రిడ్ వెర్షన్లలో విక్రయిస్తున్న సంస్థ..తాజాగా అధిక మైలేజీ ఇచ్చే చిన్న కారుపై దృష్టి సారించినట్లు మారుతి చైర్మన్ ఆర్సీ భార్గవ సూచనప్రాయంగా వెల్లడించారు. ఇందుకోసం తన సబ్సిడరీ సంస్థ సుజుకీ ప్రయత్నాలను వేగవంతం చేసినట్లు ఆయన చెప్పారు. ఎప్పటి లోగా విడుదల చేసేదానిపై ఆయన స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. ప్రస్తుతం టయోటా టెక్నాలజీతో తయారవుతున్న హైబ్రిడ్ కార్లు ధర అధికంగా ఉంటుందని, దీనివల్ల హైబ్రిడ్ కార్ల ధరలు ఎక్కువగా ఉంటున్నాయన్నారు. దీంతో తక్కువ ఖర్చుతో నడిచే హైబ్రిడ్ మాడళ్లను తీసుకురావాలనేది తమ ముఖ్య ఉద్దేశమని ఆయన వ్యాఖ్యానించారు. ఇందుకోసం చిన్నపాటి హైబ్రిడ్ కార్ల టెక్నాలజీపై సుజుకీ పనిచేస్తున్నదన్నారు.
హైబ్రిడ్ కార్లపై జీఎస్టీ తగ్గించండి
హైబ్రిడ్ కార్లపై జీఎస్టీని తగ్గించాలని భార్గవ కోరుతున్నారు. అప్పుడే దేశీయంగా అధిక మైలేజీని ఇచ్చే చౌక ధర కలిగిన హైబ్రిడ్ కార్లు అందుబాటులోకి వస్తాయన్నారు. ఎలక్ట్రిక్ వాహనాలపై 5 శాతం జీఎస్టీని విధిస్తుండగా, అదే హైబ్రిడ్ మాడళ్లపై మాత్రం 43 శాతం విధిస్తుండటంతో వీటి ధరలు అధికంగా ఉంటున్నాయని చెప్పారు. ప్రస్తుతం పెట్రోల్ కార్లపై 48 శాతం పన్ను విధిస్తున్న విషయం తెలిసిందే. హైబ్రిడ్ కార్లపై విధిస్తున్న జీఎస్టీని తగ్గించే విషయాన్ని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆర్థిక మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళ్లారు. 2023-24లో 4.50 లక్షల సీఎన్జీ మాడళ్లను విక్రయించిన సంస్థ..ఈ ఏడాదిలో 6 లక్షలు లక్ష్యంగా పెట్టుకున్నట్లు భార్గవ వెల్లడించారు.