Telangana | హైదరాబాద్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ): నాలుగు కోట్లకుపైగా జనాభా.. దేశానికి ఐటీ అడ్డా.. వ్యాక్సిన్లా తయారీలో ప్రపంచానికే దిక్సూచి.. అనేక అంతర్జాతీయ పరిశ్రమల కేంద్రం.. నిత్యం వేల సంఖ్యలో దేశ, విదేశీ ప్రయాణాలు.. ఇదీ తెలంగాణ రాష్ట్రం ఘనత. అయినా రాష్ర్టానికి విమానయానం గగనంగా మారింది. ఒకే ఒక్క ఎయిర్పోర్టు ద్వారా ప్రయాణాలు సాగించడం కష్టతరమవుతున్నది. రాష్ట్రంలో ఆరు కొత్త విమానాశ్రయాల ఏర్పాటుకు గత కేసీఆర్ సర్కారు ప్రతిపాదనలు పంపినా పదేండ్లుగా కేంద్రం నాన్చుడు ధోరణి అలంభిస్తున్నది.
ఏపీలో ఏడు ఎయిర్పోర్టులు ఉండగా, తెలంగాణలో విమానాశ్రయాల ఏర్పాటులో కేంద్రం వివక్ష ప్రదర్శిస్తున్నది. కనీసం కార్యకలాపాలకు సిద్ధంగా ఉన్నవాటికి కూడా మోదీ సర్కారు అనుమతి ఇవ్వడం లేదు. ఇటు ఆదిలాబాద్, అటు భద్రాచలం వంటి మారుమూల ప్రాంతాల నుంచి కూడా ఎటైనా వెళ్లాలంటే శంషాబాద్కు రావాల్సిన దుస్థితి. రెండు గంటల ఢిల్లీ ప్రయాణానికి ఐదారు గంటలు కారులో ఎయిర్పోర్టుకు చేరుకోవాల్సిన పరిస్థితి. దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు డొమెస్టిక్ ఎయిర్పోర్టుల ఏర్పాటుకు రాష్ట్రంలో అన్ని అవకాశాలు ఉన్నప్పటికీ కేంద్రంలోని బీజేపీ సర్కారు తీవ్ర నిర్లక్ష్యం చూపుతున్నది.
మూడు విమానాశ్రయాలకు ఏఏఐ సిఫారసు
తెలంగాణ ఏర్పాటైన తర్వాత ప్రజల అవసరాలు, రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ఆరు కొత్త విమానాశ్రయాలను ఏర్పాటు చేయాలని నాటి ముఖ్యంత్రి కే చంద్రశేఖర్రావు నిర్ణయించారు. నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ, మహబూబ్నగర్ సమీపంలోని దేవరకొండలో గ్రీన్ఫీల్డ్ (కొత్తగా ఏర్పాటుచేయడం) ఎయిర్పోర్టులు, వరంగల్ జిల్లా మామునూరు, పెద్దపల్లి జిల్లా బసంత్నగర్తోపాటు ఆదిలాబాద్లో బ్రౌన్ఫీల్డ్ (ప్రస్తుతం ఉన్నవాటిని అభివృద్ధి చేయడం) ఎయిర్పోర్టులు అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది.
మామునూరు (వరంగల్), ఆదిలాబాద్, జక్రాన్పల్లిలో మాత్రమే టెక్నికల్లీ ఫీజబుల్ ఉన్నట్టు నివేదికలో పేర్కొన్నది. ఫీజబుల్ ఉన్న మూడు ఎయిర్పోర్టులను చిన్న విమానాల కోసం ప్రారంభించాలని, భూసేకరణ చేయాల్సిన అవసరం కూడా లేనందున వెంటనే ప్రారంభించుకోవచ్చని కూడా ఏఏఐ సిఫారసు చేసింది. అప్పటి సీఎం కేసీఆర్ పలుమార్లు కేంద్రానికి లేఖలు రాసినప్పటికీ, పౌరవిమానాశ్రయాల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్వయంగా హైదరాబాద్లో కేసీఆర్తో సమావేశమై ఎయిర్పోర్టుల ఏర్పాటునకు హామీ ఇచ్చినప్పటికీ ఇవి కార్యరూపం దాల్చలేదు.
మూతపడిన మామునూరు ఎయిర్పోర్టు
నిజాం హయాంలో 1930లో మామునూర్ ఎయిర్పోర్టును సుమారు 1,930 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటుచేశారు. చాలాకాలంపాటు ఆజంజాహి మిల్స్, సిర్పూర్ పేపర్ మిల్స్తోపాటు వాణిజ్య, పౌర సేవలకు ఇది ఎంతగానో ఉపయోగపడింది. ఎంతో విశాలమైన ఈ ఎయిర్పోర్టు ఉమ్మడి రాష్ట్రంలో పాలకుల నిర్లక్ష్యం వల్ల మూతపడింది.
ఎయిర్పోర్టులు ఉన్నా ఉపయోగం సున్నా..