భారీ వర్షాల నేపథ్యంలో సీజన్ వ్యాధులపై జిల్లా యంత్రాంగం సమరభేరి మోగించింది. ప్రధానంగా మలేరియా, డెంగ్యూ ప్రబలకుండా చర్యలు తీసుకుంటున్నది. పంచాయతీ, మున్సిపల్ శాఖల ఆధ్వర్యంలో గ్రామాలు, పట్టణాల్లో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు చేపడుతూనే, ప్రతి శుక్రవారం డ్రైడే నిర్వహిస్తున్నది. ఇంకా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక మెడికల్ క్యాంపులు, ఇంటింటా జ్వర సర్వే చేపడుతూనే,ఎక్కడైనా వ్యాధులు ప్రబలితే ఆ ప్రాంతంపై స్పెషల్ ఫోకస్ పెడుతున్నది. ఈ మేరకు ప్రత్యేక దృష్టిపెట్టిన మంత్రి గంగుల కమలాకర్ మూడు రోజుల కింద ప్రభుత్వ జిల్లా కేంద్రంలోని దవాఖానను సందర్శించి వైద్యాధికారులకు మార్గనిర్ధేశం చేశారు. ఇటు కలెక్టర్ ఆర్వీ కర్ణన్ కూడా అధికారులను నిత్యం అప్రమత్తం చేస్తూ ముందుకుసాగుతున్నారు.
కరీంనగర్, జూలై 31 (నమస్తే తెలంగాణ): భారీ వర్షాల తర్వాత వచ్చే సీజనల్ వ్యాధులను అరికట్టేందుకు జిల్లా యంత్రాంగం నిర్విరామంగా శ్రమిస్తున్నది. మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో కరీంనగర్ నగర పాలక సంస్థతో పాటు జిల్లాలోని హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీల్లో, కొత్తపల్లి, చొప్పదండి నగర పంచాయతీల్లో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జిల్లా పంచాయతీ వింగ్ ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని పంచాయతీల్లో కూడా పారిశుధ్య కార్యక్రమాలు జరుగుతున్నాయి. సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఈ నెల 24 నుంచి జరుగుతున్న ఈ ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాల్లో మున్సిపల్, పంచాయతీ అధికారులే కాకుండా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది పాలుపంచుకుంటున్నారు. ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాల్లో భాగంగా డెంగ్యూ, మలేరియా, విష జ్వరాలు ప్రబలకుండా యాంటి లార్వా స్ప్రే చేస్తున్నారు. ప్రతి రోజూ ప్రతి పట్టణం, గ్రామంలో దోమల నిర్మూలనకు ఫాగింగ్ చేస్తున్నారు. వ్యాధులు ప్రబలకుండా బురద నీటిలో బ్లీచింగ్ చేస్తున్నారు. వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది, ఆశ కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు ఇంటింటికీ తిరిగి జ్వర సర్వేలు చేస్తున్నారు. ఎక్కడైనా డెంగ్యూ, మలేరియా కేసులు నమోదైతే అక్కడ ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు, మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నారు. మంచి నీటి పైప్ లైన్ల లీకేజీలను వెంట వెంటనే గుర్తించి అరికడుతున్నారు.
దవాఖానల్లో ప్రత్యేక వార్డులు..
ప్రభుత్వ దవాఖానల్లో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేశారు. కరీంనగర్లోని ప్రధాన ప్రభుత్వ దవాఖానలో 100, హుజూరాబాద్లో 20, జమ్మికుంటలో మరో 20 పడకలతో వార్డులు ఏర్పాటు చేశారు. మందులు, ప్లేట్లెట్స్, అవసరమైన బ్లడ్ను అందుబాటులో ఉంచారు. సిబ్బందికి సెలవులు రద్దు చేసి సేవలు వినియోగించుకుంటున్నారు. ప్రతి ప్రభుత్వ దవాఖానలో వైద్యులు, సిబ్బంది 24 గంటల పాటు అందుబాటులో ఉంటున్నారు. బాధితులు ప్రైవేట్ దవాఖానలకు వెళ్లవద్దని ఇటు మంత్రి గంగుల కమలాకర్ కూడా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రైవేట్ దవాఖానలపై అధికారులు నిఘా వేశారు. డెంగ్యూ పేరుతో ప్రజలను లేనిపోని భయాలకు గురి చేయరాదని స్పష్టం చేస్తున్నారు. ప్రైవేట్ దవాఖానాల్లో డెంగ్యూ నిర్ధారించరాదని, ప్రభుత్వ దవాఖానాల్లో చేసే ఎలిసా టెస్టు ద్వారానే నిర్ధారించాలని స్పష్టం చేస్తున్నారు. ప్రైవేట్ దవాఖానాలపై నిఘా పెంచారు. సీజనల్ వ్యాధులతో చికిత్స పొందుతున్న వారి వివరాలను ప్రతి రోజూ నివేదించాలని ప్రైవేట్ దవాఖానలకు అధికారులు ఆదేశించారు.
తగ్గిన డెంగ్యూ కేసులు..
గతేడాది జిల్లాలో 356 డెంగ్యూ కేసులు నమోదవగా ఈ సారి ఇప్పటి వరకు కేవలం 91 మాత్రమే నమోదయ్యాయి. జనవరిలో 13, ఫిబ్రవరిలో 1, మార్చిలో 5, ఏప్రిల్లో 20, మేలో 12 కేసులు నమోదుకాగా భారీ వర్షాలు కురుస్తున్న జూన్లో 17, జూలైలో ఇప్పటి వరకు 23 కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఎక్కువగా మానకొండూర్ పీహెచ్సీ పరిధిలో 18, తిమ్మాపూర్ పీహెచ్సీలో 13, గంగాధర పీహెచ్సీలో 10, కరీంనగర్లోని మోతాజీఖానా యూహెచ్సీలో 7, కట్టరాంపూర్ యూహెచ్సీలో మరో 7 కేసులు గరిష్టంగా నమోదయ్యాయి. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు ఒకే ఒక్క మలేరియా కేసు నమోదైంది. డెంగ్యూ కేసులు నమోదైన చోట పంచాయతీ, మున్సిపల్, వైద్య, ఆరోగ్య శాఖలు సంయుక్తంగా ప్రత్యేక పారిశుధ్యం, మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నారు. ఇంటింటికి తిరిగి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. దోమల నిర్మూలనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.
దోమల నియంత్రణకు చర్యలు..
వర్షాకాలంలో దోమలు పెరుగుతుంటాయి. వీటి నియంత్రణకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. రాత్రి వేళల్లో ప్రతి గ్రామం, పట్టణాల్లో ఫాగింగ్ మిషన్ల ద్వారా దోమలు రాకుండా నియంత్రిస్తున్నారు. మురుగు కాలువలు, నీరు నిలిచే ఖాళీ ప్రదేశాలలో యాంటి లార్వే స్ప్రే చేస్తున్నారు. మురుగు నీరున్న ప్రాంతంలో ఆయిల్ బాల్స్ను ఉపయోగిస్తున్నారు.
శరవేగంగా బూస్టర్ డోస్..
సీజనల్ వ్యాధులతోపాటు కరోనా కేసులను అరికట్టేందుకు జిల్లాలో బూస్టర్ డోస్లను వేస్తున్నారు. 16 పీహెచ్సీలతోపాటు 139 సబ్ సెంటర్లలో ప్రతి రోజూ డోసులు ఇస్తున్నారు. ఇప్పటికే 51 వేల మందికిపైగా ఇచ్చారు. జిల్లా కేంద్రంలో మాత్రం ప్రత్యేకంగా మరో 16 కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లాలో 9 లక్షలకుపైగా బూస్టర్ డోసులు వేసేందుకు అవకాశం ఉన్న నేపథ్యంలో అందుకుతగ్గ ఏర్పాట్లతో ముందుకుసాగుతున్నారు.
మంత్రి గంగుల ప్రత్యేక పర్యవేక్షణ..
ఇప్పటికే సీజనల్ వ్యాధులు ప్రబలకుండా మంత్రి గంగుల కమలాకర్ అధికారులను నిత్యం అప్రమత్తం చేస్తున్నారు. మూడు శాఖలను సమన్వయం చేసి ముందుకు నడిపిస్తున్నారు. ఇప్పటికే రెండు సార్లు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. అలాగే ఈ నెల 24 నుంచి ఆగస్టు 2 దాకా జరిగే ఈ కార్యక్రమాలను నిత్యం పర్యవేక్షిస్తున్నారు. నివేదికలూ తెప్పించుకుంటున్నారు. నాలుగు రోజుల క్రితం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన దవాఖానను జడ్పీ అధ్యక్షురాలు విజయ, మేయర్ వై సునీల్రావు, కలెక్టర్ కర్ణన్తో కలిసి పరిశీలించారు. సేవలపై రోగులతో ప్రత్యక్షంగా మాట్లాడి తెలుసుకున్నారు. ప్రభుత్వ దవాఖానల్లో అన్ని రకాల మందులు, ప్లేట్ లెట్స్, అవసరమైన బ్లడ్ అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు.