చిగురుమామిడి/సైదాపూర్ ఏప్రిల్ 24 : ‘కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ చేసిందేంటో చెప్పు? బడికో, గుడికో నిధులు తెచ్చినవా..? అభివృద్ధి పనులకు కనీసం ఐదు రూపాయలైన మంజూరు చేయించినవా..? చెప్పు’ అని కరీంనగర్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ ప్రశ్నల వర్షం కురిపించారు. బండి అసమర్థుడని, మళ్లీ ఓటేస్తే ప్రజలను నట్టేట ముంచుతాడని మండిపడ్డారు. బుధవారం ఆయన చిగురుమామిడి, సైదాపూర్లో మాజీ ఎమ్మెల్యేలు వొడితల సతీశ్, రసమయి బాలకిషన్తో కలిసి రోడ్షోలు నిర్వహించారు. ఆయాచోట్ల కాంగ్రెస్, బీజేపీ వైఫల్యాలను తనదైన శైలిలో ఎండగట్టారు. ఆ రెండు పార్టీలపై విమర్శనాస్ర్తాలు సంధించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిందని మండిపడ్డారు. మతాన్ని అడ్డుపెట్టుకొని గెలిచిన సంజయ్ అభివృద్ధిని విస్మరించారని విమర్శించారు. తాను ఎంపీగా ఉన్నప్పుడు కరీంనగర్లో అభివృద్ధిని పరుగులు పెట్టించానని చెప్పారు. మరింత అభివృద్ధి చెందాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి తనను ఢిల్లీకి పంపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.