ఎరువుల కొనుగోలులో పారదర్శకత పేరుతో ప్రభుత్వం అమలు చేస్తున్న సంస్కరణలు రైతులకు తలనొప్పిగా మారుతున్నాయి. పెరిగిన ధరలు..యాప్ బుకింగ్ వల్ల సాంకేతిక సమస్యలు, సెల్ సిగ్నల్, స్టాక్ కొరత, తదితర నిబంధనలు రైతులను ఉక్కిరిబిక్కరి చేస్తున్నాయి. ప్రస్తుతం వర్షాలు పడకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న సమయంలో ప్రభుత్వాలు కొత్త యాప్ తేవడంతో ఎరువుల కోసం రైతులు అపసోపాలు పడుతున్నారు.
కొండమల్లేపల్లి, ఆగస్టు 10 : రైతులకు అండగా నిలవాల్సిన కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు యాప్ల పేరుతో రైతులను ఇబ్బందులు గురి చేస్తున్నాయి. యూరియా కొనుగోలు చేయాలన్నా, పత్తి విక్రయించాలన్నా యాప్లను అశ్రయించాల్సిన పరిస్థితి నెలకొన్నది. పట్టా పాసు పుస్తకాలు, సాగు విస్తీర్ణం ఆధారంగా యూరియా, డీఏపీ విక్రయాలు ఉం టాయి. అయితే ప్రభుత్వం విధించిన పరిమితుల కారణంగా బుకింగ్ ప్రక్రియ కొందరు రైతులకు ఇబ్బందిగా మారింది. గతంలో యూరియా బుకింగ్ ఆధార్ కార్డు ప్రమాణికంగా తీసుకున్నారు. కానీ ప్రస్తుతం నిబంధనలు కఠినతరం చేయడంతో గిరిజనేతర, కౌలు రైతులకు యారి యా, డీఏపీ అందని ద్రక్షగా మారింది. వానకాలం సీజన్ ప్రారంభమై దాదాపు రెండున్నర నెలలు అవుతున్నది.
దేవరకొండ నియోజకవర్గ వ్యాప్తంగా పత్తి, వరి, కంది సాగు అశాజనకంగా ఉంది. ఈ సమయంలో పంటలు దిగుబడి కోసం వివిధ రకాల ఎరువులు వాడాల్సి ఉంటుంది. దేవరకొండ నియోజకవర్గం పరిధిలో వానకాలం సాగు కోసం 40 వేల మెట్రిక్ టన్నుల ఎరువులు రైతులు వినియోగిస్తారు. కేంద్ర ప్రభుత్వం ఎరువుల కొనుగోలుకు కొత్త యాప్ను ప్రవేశపెట్టింది. (ఫ్రేమ్ వర్క్ ఫర్ ఫర్టిలైజర్ సేల్స్) రైతులు తమకు అవసరమైన ఎరువులను ఈ యాప్ ద్వారానే కొనుగోలు చేయాల్సి ఉంటుందని సూచించింది.
అన్ని ఎరువులు యాప్లోనే..
కేంద్రం అమల్లోకి తీసుకొచ్చిన ఎఫ్ఎఫ్ఎస్( ఫ్రేమ్ వర్క్ ఫర్ ఫర్టిలైజర్ సేల్స్) యాప్ ద్వారానే యూరియా, డీఏపీ, పొటాష్, 20-20-0-13, 28-28-0, 14-35-14, 15-15-15, 16-16-16 తదితర అన్ని రకాల కాంప్లెక్స్ ఎరువులను ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. ఎరువులు అవసరమున్న రైతులు తప్పని సరిగా ఫార్మర్ ఐడీ నమోదు చేసుకోవాలి. ఐడీ లేని రైతులు తమ పరిధిలోని వ్యవసాయ విస్తరణాధికారులను సంప్రదించాలి. రైతులు పట్టదారు పాసుపుస్తకం, ఆధార్ కార్డుకు అనుసంధానమైన ఫోన్ నం బర్ ఆధారంగా ఓటీపీ ధ్రువీకరణ పూర్తి చేయాలి.
రైతుల భూమి విస్తీర్ణం, సాగు చేసే పంటలు ఆధారంగా వారికి అవసరమైన ఎరువులను ముందుగా నమోదు చేసుకోవాలి. రైతులు ఎరువుల దుకాణాలకు వెళ్లినప్పుడు డీలర్ క్యూఆర్ కోడ్ టోకెన్ జారీ అవుతుంది. రైతు ఫోన్కు వచ్చే ఓటీపీ ధ్రువీకరణ పూర్తయిన తర్వాతే ఎరువులు తీసుకునే అవకాశం ఉంది. దేవరకొండ నియోజవర్గంలో పరిధిలో చాలామంది రైతులు ఫార్మర్ జిస్ట్రేషన్ చేసుకోలేదు. చాలా మంది రైతుల వద్ద స్మార్ట్ ఫోన్లు లేవు. గిరిజన ప్రాంతాలతో పాటు మారుమూల గ్రామాల్లో ఫోన్ నెట్వర్క్ సరిగా ఉం డదు. గతేడాది యూరియా కోసమే యాప్ను తీసుకొచ్చిన కేంద్రం ఇప్పుడు రైతుల ఏ ఎరువును కొనుగోలు చేయాలన్నా కొత్త యాప్లోనే బక్ చేసుకోవాలని నిబంధనలు విధిస్తోంది. పాత యాప్తోనే రైతులు ఇబ్బందులు పడుతుంటే కొత్తగా వచ్చిన యాప్తో ఇంకెన్ని తిప్పులు ఉంటాయోనని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రైతులు ఆందోళన..
కేంద్రం తెస్తున్న నూతన ఎఫ్ఎఫ్ఎస్ యాప్ తమకు శాపం గా మారుతుందేమోనని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నా రు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ తెచ్చిన యూరియా యాప్తో నానా ఇబ్బందులు పడుతుంటే ఇప్పడు కేంద్రం మరో యాప్ను తేవడంతో రైతులకు తిప్పలు తప్పేలా లేవు. యూరియా యాప్లో పట్టదారు పాస్పుస్తకం అధికారుల ధ్రువీకరణతో యూరియాను బుక్ చేసుకునే సౌలభ్యం ఉంది. కానీ కేంద్రం తెచ్చిన యాప్లో భూమి రికార్డుల నమోదు తప్పనిసరి చేయడంతో గ్రామీణ, మారుమూల ప్రాంతాల రైతులకు శాపంగా మారింది.
గ్రామాల్లో సెల్ఫోన్ సిగ్నల్ సరిగా లేకపోవడం, కొందరి వద్దే స్మోర్ట్ ఫోన్లు ఉండటంతో ఎరువుల బుకింగ్ ఎలా అని రైతులు ఆం దోళన వ్యక్తం చేస్తున్నారు. నిన్నటి వరకు యూరియా విషయంలో ఇబ్బంది పడిన రైతులు తాజాగా డీఏపీ విషయంలోనూ ఆందోళనకు గురవుతున్నారు. యాప్లో బుక్ చేసుకున్న తర్వాత ఫర్టిలైజర్ షాపుకు వెళ్తె నో స్టాక్ బోర్డులు రైతుల ఆందోళనకు కారణమవుతోంది. లారీ వచ్చిన నిమిషాల్లోనే గోదాము ఖాళీ కావడంతో రైతుల సమయం వృథా అవుతోంది. వరుణదేవుడు కరుణించక, ఎరువులు దొరక్క రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
పాత పద్ధతిలో ఎరువుల సరఫరా చేయాలి
ఎరువుల విక్రయాల కోసం కేంద్ర ప్రభుత్వం (ఫ్రేమ్ వర్క్ ఫర్ ఫర్టిలైజర్ సేల్) ఎఫ్ఎఫ్ఎస్ యాప్ను రద్దు చేసి పాత పద్ధతిలో ఎరువుల విక్రయాలు జరపాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూటకో యాప్ తెచ్చి చిన్న, సన్నకారు రైతులను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారు. ప్రస్తుతం రైతులు స్మార్ట్ఫోన్లు వాడే పరిస్థితుల్లో లేరు. దీనికి తోడు నిరక్షరాస్యులు అధికంగా ఉన్నారు. వారికి యాప్ లో బుక్ చేసి, ఓటీపీ చెప్పి ఎరువులు కొనుగోలు చేసే పరిస్థితుల్లో లేరనే విషయం కేంద్ర, రాష్ట్ర పాలకులు తెలుసు. గ్రామీణ రైతాంగాన్ని వ్యవసాయాని దూరం చేసే కుట్రలు చేస్తున్నారు.
-కేసాని లింగారెడ్డి, రైతుబంధు మండల మాజీ అధ్యక్షుడు
రైతులు ఆందోళన చెందవద్దు..
కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న ఎఫ్ఎఫ్ఎస్ కొత్త యాప్పై రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రైతులు తమకు కావాల్సిన ఎరువులను యాప్ ద్వారా బుక్ చేసుకోవాలి. రైతులకు సరిపడా ఎరువులు నిల్వ ఉన్నాయి. ఈ నెల 20 తేదీ నుంచి ఈ కొత్త యాప్ పూర్తిస్థాయిలో అమలులోకి వచ్చే అవకాశం ఉంది. త్వరలో రైతులకు యాప్పై అవగాహన కల్పిస్తాం.గూగుల్ ప్లే స్టోర్ నుంచి ‘ఫ్రేం వర్క్ ఫర్ ఫర్టిలైజర్’ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి.
– జానకిరాములు, మండల వ్యవసాయాధికారి