నీలగిరి, ఆగస్టు 10: నాగార్జునసాగర్లో ప్రభుత్వం నిర్వహించిన మహా వరుణ యాగం సందర్భంగా ఉమ్మడి నల్లగొండ జిల్లా అంతటా తీవ్ర నిర్బంధకాండను ప్రయోగించారు. తెల్లవారుజాము నుంచే విపక్ష నేతలను ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను టార్గెట్ చేస్తూ అరెస్టుల పర్వానికి తెరలేపారు. మండలాల వారీగా ముఖ్యనేతలను గుర్తిస్తూ ఇళ్ల వద్దనే వారిని అదుపులోకి తీసుకొని పోలీసు స్టేషన్లకు తరలించారు. మధ్యాహ్నం 3 గంటలకు సీఎం సాగర్ రానుండగా ఉదయానికే చాలాచోట్ల ముందస్తు అరెస్టులు చేశారు.
నల్లగొండ జిల్లా హాలియాలో ఉదయాన్నే బీఆర్ఎస్ ముఖ్య నేతలను పదిమందికి పైగా అరెస్టు చేసి పోలీసుస్టేషన్లో నిర్బంధించారు. వీరిని సా యంత్రం సీఎం తిరిగి వెళ్లే వరకు స్టేషన్లోనే కూర్చోబెట్టడంతో వీరు పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. త్రిపురారంలో బీఆర్ఎస్తో పాటు బీజేపీ, పలు ప్రజాసంఘాల నేతలను తెల్లవారుజామునే అరెస్టు చేసి పోలీసుస్టేషన్కు తరలించారు. గుర్రంపోడులో పార్టీ మాజీ మండలాధ్యక్షుడితో పాటు ఇతర ముఖ నేతలను పోలీసు లు అరెస్టు చేశారు. తిర్మలగిరిసాగర్, నిడమనూర్, పెద్దవూరల్లో సైతం బీఆర్ఎస్ తో పాటు విపక్ష నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
శాలిగౌరారం, తిప్పర్తిలోనూ బీఆర్ఎస్ నేతలను పోలీసులు ముందుగానే అరెస్టు చేశారు. ఎంజీ యూనివర్సిటీలోనూ పలువురు విద్యార్థి సంఘాల నేతలను నార్కట్పల్లి పోలీసులు ముం దస్తు అరెస్టు చేశారు. సూర్యాపేట జిల్లాలోనూ అరెస్టుల పర్వం కొనసాగింది. తుం గతుర్తిలో వరుణయాగాన్ని అడ్డుకుంటారన్న నెపంతో బీఆర్ఎస్ ముఖ్య నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అర్వపల్లిలోనూ మాజీ జడ్పీటీసీతోపాటు పార్టీ ముఖ్య నేతలను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు.
ప్రజా ప్రభుత్వమంటూ సంబంధం లేకుండానే అరెస్టులు చేయడమేంటని ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. సాగర్లో వరుణయాగంపై ఎలాంటి నిరసనలకు పిలుపునివ్వకున్నా ఎందుకు ఇలా నిర్బంధించడం ఎమిటని పలువురు ప్రశ్నించారు. రోజురోజుకూ ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకత, అసంతృప్తితో ప్రభుత్వం పెద్దలు భయపడుతున్నారని, అందుకు నిదర్శనమే ఇలా నిర్భందకాండ అని నేతలు ఈ సందర్భంగా ఎత్తి చూపారు.