చెన్నై : తమిళనాడు శాసనసభ ప్రారంభమై వంద సంవత్సరాలు పూర్తి కావస్తున్న నేపథ్యంలో శతాబ్ది వేడుకలకు అసెంబ్లీ ముస్తాబైంది. సోమవారం అసెంబ్లీలో జరిగే వేడుకలకు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ హాజరుకానున్నారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో ఐదు పర్యాయాలు ముఖ్యమంత్రిగా సుధీర్ఘ సేవలందించిన దివంగత డీఎంకే నేత కరుణానిధి చిత్రపటాన్ని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆవిష్కరించనున్నారు. రాష్ట్రపతి ఐదు రోజుల పాటు తమిళనాడులో పర్యటిస్తుండగా.. ఈ కార్యక్రమం ప్రారంభంతో పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు.
గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్తో పాటు సీఎం ఎంకే స్టానిల్ పాల్గొనున్నారు. ఇంతకు ముందు ఆగస్ట్ 1977లో అప్పటి రాష్ట్రపతి ఎన్ సంజీవరెడ్డి మాజీ సీఎం కే కామరాజ్ చిత్రపటాన్ని ఆవిష్కరించారు. పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ఇవాళ మధ్యాహ్నం ఢిల్లీ నుంచి 12.45గంటలకు చేరుకుంటారు. సాయంత్రం మద్రాస్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో శతాబ్ది వేడుకలకు హాజరవుతారు. సమావేశ మందిరంలో కరుణానిధి చిత్రపటాన్ని ఆవిష్కరించి, సభ్యులనుద్దేశించి ప్రసంగిస్తారు. తమిళనాడు సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఢిల్లీలో పర్యటించిన స్టాలిన్.. మద్రాస్ లెజిస్లేటివ్ కౌన్సిల్ 100వ శతాబ్ది వేడుకలకు ఆహ్వానించారు.
తమిళనాడులో మొదట ఎన్నికైన అసెంబ్లీని మద్రాస్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అని పిలిచేవారు. భారత ప్రభుత్వ చట్టం 1919 ప్రకారం.. 1921లో ఇది ఏర్పాటైంది. ఆ తర్వాత మద్రాసు ప్రావిన్స్గా, తమిళనాడు శాసనసభగా రూపాంతరం చెందిన సుదీర్ఘ చరిత్ర ఉంది ఈ సభకు ఉన్నది. అనేక సామాజిక సంస్కరణలకు ప్రత్యక్ష సాక్షిగా నిలిచింది. 1921లో ఏర్పడిన మద్రాసు లెజిస్లేటివ్ కౌన్సిల్ పదవీకాలం మూడేళ్లు ఉండేది. 132 మంది సభ్యులుండేవారు. వీరిలో 34 మంది గవర్నర్ నామినేట్ చేసేవారు. మిగిలినవారు ఎన్నికైన సభ్యులు. ఈ కౌన్సిల్కు తొలిసారి జరిగిన ఎన్నికల్లో జస్టిస్ పార్టీ 98 స్థానాలకు 63 చోట్ల విజయాన్ని సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
ఆ సమయంలో దేశవ్యాప్తంగా సహాయ నిరాకరణ ఉద్యమం నిర్వహిస్తున్నందున ఎన్నికల్లో కాంగ్రెస్ ఎన్నికల్లో పోటీ చేయలేదు. తర్వాత 1923 నుంచి మూడేళ్లపాటు, 1930 నుంచి 1937 వరకు జస్టిస్ పార్టీ పాలించింది. ఆ పార్టీ మూలాలనుంచే ద్రావిడర్ కళగం, డీఎంకే వంటి పార్టీలు ఆవిర్భవించాయి. 1937నుంచి 39 వరకు కాంగ్రెస్ నుంచి సీ రాజగోపాలచారి ముఖ్యమంత్రిగా సేవలందించారు. మద్రాస్ ప్రావిన్స్గా ఏర్పడ్డాక 1952 నుంచి 54వరకు రాజగోపాలచారి సీఎంగా కొనసాగారు. 1954నుంచి 67వరకు కాంగ్రెస్ పాలించింది. 1967లో డీఎంకే మొదటిసారి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సమయంలో అప్పటి సీఎం అన్నాదురై తమ ప్రభుత్వం 1921లో అధికారంలోకి వచ్చిన జస్టిస్ పార్టీ అనుసరించిన విధానాలను కొనసాగిస్తుందని ప్రకటించారు.
వందేళ్ల సుధీర్ఘ చరిత్ర ఉన్న తమిళనాడు అసెంబ్లీకి డీఎంకే అగ్రనేత కరుణానిధి ఎక్కువకాలం సీఎంగా సేవలందించారు. సుమారు 19 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పని చేశారు. ఆ తర్వాత ఏఐఏడీఎంకే నుంచి జయలలిత 14 సంవత్సరాల 124 రోజుల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఎంజీ రామచంద్రన్ 10 సంవత్సరాల 65 రోజులు, కాంగ్రెస్ నుంచి కే కామరాజ్ 9 సంవత్సరాల 172 రోజుల పాటు సీఎంగా కొనసాగారు. వీరితో పాటు 1952 నుంచి సీ రాజగోపాలచారి, ఎం.భక్తవత్సలం, అన్నాదురై, వీఆర్ నెడుంజెళియన్ (యాక్టింగ్), జానకీ రామచంద్రన్, పన్నీర్సెల్వం, పళనిస్వామి ముఖ్యమంత్రులుగా పని చేశారు. తమిళనాడులో నాలుగుసార్లు రాష్ట్రపతి పాలన విధించారు. ఈ ఏడాదిలో జరిగిన ఎన్నికల్లో డీఎంకే పార్టీ విజయం సాధించగా.. కరుణానిధి తనయుడు ఎంకే స్టాలిన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం సభలో 234 మంది సభ్యులుండగా.. డీఎంకే కూటమికి 165 మంది, ఏఐఏడీఎంకే కూటమికి 75 మంది సభ్యుల బలం ఉన్నది.