Iran crude Oil : పశ్చిమాసియా (West Asia) లో యుద్ధం కారణంగా సముద్రంలో నిలిచిపోయిన ఇరాన్ ముడి చమురు (Iranian Crude) పై ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లు ఇటీవల అమెరికా (USA) ప్రకటించింది. దాంతో ఇరాన్ చమురు కొనుగోలుకు భారత రిఫైనరీలు ఆసక్తి చూపిస్తున్నాయి. ఈ క్రమంలో ఇటీవల ఇరాన్ నుంచి ఓ ఆయిల్ ట్యాంకర్ (Oil Tanker) భారత్ వైపు బయల్దేరింది. మార్చి 4న ఖర్గ్ ద్వీపం (Kharg Island) వద్ద ట్యాంక్లోకి చమురు లోడింగ్ చేశారని.. ఏప్రిల్ 4న గుజరాత్ (Gujarat) లోని వాడినార్ పోర్టుకు ఇది చేరుకోనుందని డేటా ఇంటెలిజెన్స్ సంస్థ క్లెప్లర్ వెల్లడించింది.
కాగా, 2019 తర్వాత ఇరాన్ ముడి చమురు భారత్కు రావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇందులో దాదాపు 6 లక్షల బ్యారెళ్ల ముడి చమురు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. అయితే ఇరాన్ నుంచి వస్తున్న ఈ చమురును ఏ భారతీయ రిఫైనరీ ఉపయోగించనుందనే విషయంపై ఎలాంటి సమాచారం లేదు. గతంలో భారత్.. ఇరాన్ చమురుకు ప్రధాన కొనుగోలుదారుగా ఉండేది. ఒకానొక సమయంలో మొత్తం చమురు దిగుమతుల్లో ఇరాన్ వాటా సుమారు 11.5 శాతం ఉంది.
2018లో భారత్ రోజుకు సుమారు 5,18,000 బ్యారెళ్ల ఇరాన్ చమురును దిగుమతి చేసుకోగా.. మే 2019 నాటికి అది రోజుకు 2,68,000 బ్యారెళ్లకు తగ్గింది. ఆ తర్వాత ఇరాన్పై అమెరికా ఆంక్షల కారణంగా ఆ దేశం నుంచి ముడి చమురు దిగుమతులు పూర్తిగా నిలిచిపోయాయి.