వాషింగ్టన్: అమెరికా, మెక్సికో సరిహద్దులో దారుణం జరిగింది. అక్కడ ఉన్న 14 అడుగుల ఎత్తయిన గోడ మీది నుంచి 3, 5 ఏళ్ల వయసున్న ఇద్దరు చిన్నారులను స్మగ్లర్లు కిందికి పడేశారు. అర్ధరాత్రి వేళ జరిగిన ఈ ఘటన కెమెరాలో రికార్డవడంతో అలర్టయిన యూఎస్ కస్టమ్స్, బోర్డర్ ప్రొటెక్షన్ (సీబీపీ) అధికారులు వెంటనే ఆ ఇద్దరు చిన్నారులను రక్షించారు. మంగళవారం అర్ధరాత్రి శాంటా థెరెసాకు చెందిన ఓ ఏజెంట్ కెమెరా ఫుటేజీని పరిశీలిస్తుండగా.. ఈ ఇద్దరు చిన్నారులను స్మగ్లర్లు గోడ మీది నుంచి పడేయడం గమనించినట్లు సీబీపీ వెల్లడించింది.
ఈ ఇద్దరు చిన్నారులు ఈక్వెడార్కు చెందిన వాళ్లు. వీళ్లను సీబీపీ అధికారులు స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ దారుణానికి పాల్పడిన వారిని గుర్తించడం కోసం అమెరికా ఏజెంట్లు.. మెక్సికో అధికారులతో సంప్రదిస్తున్నారు. ఒకవేళ సరిహద్దులో ఎప్పటికప్పుడు నిఘా ఉండి ఉండకపోతే ఆ చిన్నారులు ఎడారిలో దారుణమైన పరిస్థితులను చవిచూశేవారని సీబీపీ తెలిపింది.
పెరిగిన అక్రమ వలసలు
అమెరికాలో బైడెన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ మళ్లీ అక్రమ వలసలు పెరిగాయి. ముఖ్యంగా అమెరికా దక్షిణ సరిహద్దులో నుంచి మధ్య అమెరికా దేశాల వాళ్లు అమెరికాలో భారీగా చొరబడుతున్నారు. తమ దేశాల్లో జరుగుతున్న హింసను తప్పించుకోవడం కోసం వీళ్లు అమెరికా బాట పడుతున్నారు. ప్రతి రోజూ 500 మంది చిన్నారులు ఎవరి సాయం లేకుండానే సరిహద్దు దాటుతున్నారు. దీనిపై బైడెన్ ప్రభుత్వం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ఇప్పటికే 12918 మంది మైనర్లు ఇలా అక్రమంగా సరిహద్దు దాటి అమెరికాలో అడుగుపెట్టడం గమనార్హం.
ఇవీ కూడా చదవండి..
కోటిన్నర కరోనా వ్యాక్సిన్ డోసులు వృథా
రజనీకి దాదా సాహెబ్ అవార్డు.. కమల్హాసన్ రియాక్షన్ ఇదీ
ఈ 9 నగరాల్లో 2023 ఫుట్బాల్ వరల్డ్కప్
గంటల్లోనే దిగి వచ్చిన మోదీ సర్కార్.. వడ్డీ రేట్ల కోత ఆదేశాలు వెనక్కి
చెన్నై సూపర్ కింగ్స్ ప్రాక్టీస్.. నెట్స్లో చెమటోడ్చిన ధోనీ, రైనా