Siddaramaiah : బీజేపీ (BJP) తీరుపై కర్ణాటక సీఎం (Karnataka CM) సిద్ధరామయ్య (Siddaramaiah) ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ నెల 4న చిన్నస్వామి స్టేడియం (Chinnaswamy Stadium) లో జరిగిన తొక్కిసలాటకు బాధ్యత వహిస్తూ కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ (DK Shivakumar), హోంమంత్రి పరమేశ్వర (Parameshwara) రాజీనామా చేయాలన్న డిమాండ్తో ఫ్రీడమ్ పార్కు (Freedom park) లో బీజేపీ ఆందోళనకు దిగడంపై సిద్ధరామయ్య స్పందించారు.
తనను రాజీనామా చేయమని డిమాండ్ చేసే నైతిక హక్కు బీజేపీకి లేదని సిద్ధరామయ్య మండిపడ్డారు. మహాకుంభమేళా తొక్కిసలాటలో 30 మంది మరణించారని, అందుకు బాధ్యత వహిస్తూ అక్కడి సీఎం రాజీనామా చేశారా..? అని ఆయన ప్రశ్నించారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో 241 మంది ప్రాణాలు కోల్పోయారని అందుకు బాధ్యత వహిస్తూ ఎవరు రాజీనామా చేశారని నిలదీశారు.
అంతకుముందు నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి కూలి 140 మంది మరణించారని, అందుకు బాధ్యత తీసుకుని ఎవరూ రాజీనామా చేయలేదు ఎందుకని సిద్ధరామయ్య ప్రశ్నించారు. అయినా నన్ను నేను రక్షించుకోవడానికి ఈ ఉదాహరణలు చెప్పడంలేదని, రాష్ట్రంలో ఏది జరిగినా ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేయడం కరెక్టు కాదని అన్నారు.